Showing posts with label శుభ శుక్రవారము. Show all posts
Showing posts with label శుభ శుక్రవారము. Show all posts

Wednesday, March 19, 2008

శుభ శుక్రవారము

నా ద్యానములోవున్నప్పుడు శుభశుక్రవారము గురించి బ్లాగాలనిపించింది. చాలా సార్లు నేను కొన్ని క్రైస్తవ మందిరములలో ఈ అంశాలను మాట్లాడినప్పటికీ బ్లాగు రాయటం కష్టంగానే అనిపిస్తుంది. అయినా చిన్న ప్రయత్నం.

ఇది యేసు క్రీస్తు సిలువ మరణము పొందిన దినము.

దీనికిముందు 40 రోజులు లెంట్ డేస్‌గా పాటిస్తారు. భస్మ బుధవారముతో మొదలయ్యే 40 రోజులలో పాటించేవి ఉపవాసము, బ్రహ్మచర్యము, మిత ఆహారము, ప్రత్యేక ప్రార్థనలు. ఇవి ఆచారబద్దంగా వున్నాయని క్రైస్తవ శాఖలలో కొన్ని శాఖలవారు పాటించటలేదు. క్యాధలిక్ వారు పాటిస్తునే వున్నారు. ఈ రోజులలో సిలువ ధ్యానాలు పేరిట ఇళ్ళను దర్శించడము, ప్రత్యేకమైన ప్రార్ధనలు జరిగించడము, సిలువలోని మర్మాలను గురించి ధ్యానించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలకు ప్రస్తుత రోజుల్లో తక్కువగా హాజరౌతున్నారు.

ఈ శుక్రవారము సమావేశము అవటం ద్వారా క్రీస్తు సిలువ వేయబడుతున్న సమయంలోని సంగతులను ఉదయం 11 గంటలనుండి మద్యాహ్నం 3 గంటలవరకు ధ్యానిస్తారు. ముఖ్యంగా యేసుక్రీస్తు సిలువపై వ్రేలాడుతూ పలికిన ఏడు మాటలను, తనుపొందిన ఏడు గాయములు, వాటి ఆంతర్యాలను మన జీవితాలకు అన్వయించుకోవలసిన అవసరాన్ని తెలియచేసేవిగా వుంటాయి. క్రైస్తవులనే వారు తప్పనిసరిగా ఈ సమావేసము(ఆరాధన)లో పాల్గొంటారు.

యేసుక్రీస్తుకు ఇలా జరుగుతాయని ఆయన పుట్టక మునుపే ప్రవక్తలు ప్రవచించినట్లుగా బైబిలు తెలియచేస్తుంది. యేసును నమ్మటంద్వారా పాపములు పరిహరింప బడతాయని, క్రొత్త జీవిత విధానములోకి మార్చ బడతామని, (యెవడైనను క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి.) బైబిలు తెలియచేస్తుంది

క్రీస్తును సమాధిలోవుంచి సీలువేసి, సైన్యము కాపలావున్న తర్వాత ఆదివారము వుదయం యేసుక్రీస్తు సమాధిని గెలిచి లేచి వచ్చాడు, దీనిని పునరుత్థానపు (ఈస్టరు)గా పండుగ జరుపుకుంటారు. మొదటి తరం ప్రొటస్టెంటులలోనూ, మిషనరీ ప్రాచుర్యము చేస్తున్న సమయంలో ఈస్టరును ప్రత్యేక రీతిలో జరుపుకునే పద్దతులు పాటించినప్పటికీ మారుతున్న కాల మాన పరిస్తితులకు అనుగుణంగా చాలా మార్పులు చోటుచేసుకోవడంవల్ల ప్రత్యేకంగా ఇలా జరుపుకుంటారు అని వివరించలేము ఇప్పుడు.

యేసు సిలువకు అప్పగింపబడిన సమయమునుండి పునరుత్థానుడైనంత వరకూ జరిగిన సంగతులను, విషయాలను, సంభాషణలను, రహస్యాలను, దీనివెనుకున్న వేదాంతాన్ని పరిశీలించినపుడు చాలా ఆశ్చర్యంగాను, అద్బుతంగాను అనిపిస్తాయి.

ప్రత్యేకమైన సమయాలను పాటిచడం కాదు, ప్రతిసమయాన్ని ప్రత్యేక సమయంగా మార్చు కోవాలి అనే వాదన వల్లకూడా కొన్ని మేలుకరమైన ఆచారాలు కూడా కనుమరుగౌతున్నాయని నా కనిపిస్తుంది.

యేది యేమైనా యేసు అన్నట్లు "నమ్ముట నీవలనైతే సమస్తము సాధ్యమే" యేసు పాపపరిహార్థముగా చనిపోయాడని నమ్మటం ముఖ్యం. మనం అనుభవించవసిన పాపపు శిక్షను యేసు సిలువకు కొట్టాడని, అయనను ఆశ్రయించడం ద్వారా పాపం నుండి మనం స్వతంత్రులమౌతామని బైబిలు తెలియచేస్తుంది.

ఈ శుభ శుక్రవారపు మరియు పునరుత్థానపు (ఈస్టర్) దీవెనలు మీ అందరికి కలుగును గాక!