Thursday, February 28, 2013

మరణం తరవాత తెలుస్తున్న రమణ! వొక తర్వాత

వొక తర్వాత

బహుశ వొక వ్యక్తి మరణించిన తర్వాతనే
అతనితో సంభాషణ మొదలుపెడతాం
వొక వ్యక్తి అంతర్థానమైన తర్వాతనే
ఆమెను అర్థం చేసుకోవడం మొదలుపెడతాం

శాశ్వత అశాశ్వతత్వాని
అక్షండ ఖండ సత్యాల్ని
అనుభవంలోకి తెచ్చుకున్న తర్వాత
బహుశా దుఖ్కించడమో సంతోషించడమో
మొదలుపెడతాం మరి

సంధ్యా సౌదర్య శిఖరంపై
కమ్ముకున్న చిక్కటి చీకటి శైతల్యం
రాత్రి పెదిమల మీద
నులివెచ్చని వుదయ రాగోదయం

బహుశ వొకరు శిలువనెక్కిన తర్వాతనే
జీవితాన్ని అర్థం చేసుకోవడం మొదలుపెడతాం
సమాధినుంచి మెలకువ కోసం
ప్రార్థనలు మొదలుపెడదాం

ఆశ్చర్యమేమీ లేదు
వొక వ్యవస్థ అస్థమించించిన తర్వాతనే
తవ్వకాలు మొదలుపెడతాం
మన వునికిని మనమే
అనుమానించడం మొదలుపెడతాం

బహుశా వొకరు
మరణించిన తర్వాతనే
బతికిన వారిగురించి
ఆలోచించడం మొదలుపెడతాం
మరణించిన వారిని
బతికించుకోవడమూ మొదలు పెడతాం

కె. యెస్. రమణ గారి “జడి” సంకలనం
-


కొద్ది సార్లు ఆయన్ని యూనివర్సిటీలో కలిసాను. ఆయన పరీక్షల నిర్వహణా విభాగంలో వున్నప్పుడు చాలా చేసేపు ఎదురెదురుగానే పనివత్తిడివల్ల సమయం గడిచిపోయేది. ఏమీ మాట్లాడటానికి కుదిరేది కాదు.
 నా కవిత్వం రాయటంలో కొన్ని సూచనలు ఇచ్చారు. 2004 హసీనా – దీర్ఘ కవితగా రాయడం ఆయన ప్రోత్సాహమే. 
మాటల్లో ఒకసారి మీరు పిహెచ్ డి ఎందుకు చేయకూడదూ అని అడిగారు. ఎం.ఎ. చెయ్యలేదని చెపాను. ఆయన ప్రోత్సాహంతో 2010-12 ఎం.ఎ. జాయిన్ అయ్యాను. ఇక్కడ ఆయనే అధునిక కవిత్వం అనే అంశాన్ని బోధించారు, కాని నా గుండె ఆపరేషన్ వల్ల ఆయన తరగతులు హాజరు కాలేకపోయాను. అదో అంసృప్తి నాకు. డిశెంబరు 2012లో  యెస్.పి కాలేజిలో చిన్న ఫేర్ వెల్ జరిగింది. అందులో విద్యార్థిగా నేనూ మాట్లాడాను. అప్పుడు జాన్ గారి ఫోను ఎప్పుడు వచ్చినా ఒక కవిత నాకు వినడానికి వస్తుంది అనడం నాకు ఇంకా చెవుల్లో ధ్వనిస్తూనేవుంది.

ఆయన సంకలనం జడి ఇచ్చారు. చదివి కవితలన్నీ వేరు వేరు సందర్భాలలో, సమయాలలో రాసినవే అయినా అందులో అంతర్గతంగా దుఖం నాకు కనబడింది . ఆ పదం ఎన్ని సార్లు వచ్చింది అని ఒకసారి మళ్ళీ చదివి ఆయనకు చెప్పాను. మంచివిషయాన్ని పట్టుకున్నారు, ఏదైనా వ్యాసం రాయండి  అన్నారు.

బహుశ అదే చివరి సారి కలవడం.
**
వ్యాసం ఇంకా మొదలు పెట్టలేదు
ఈ కవిత చదువుతుంటే
తెరలు తెరలుగా కమ్మిన
దుఖంలో
ఏమీ రాయలేని ఒక అలజడి
ముందుగానే ఒక సందిగ్దత


***

No comments: