Thursday, June 18, 2009

నా జీవితంలో శ్రీ శ్రీ

నా జీవితంలో శ్రీ శ్రీ

ఈ మద్య శ్రీ శ్రి గురించి చదుతున్నప్పుడు నాకు ఆయనతో ఎటువంటి అనుబందం లేకపోయిందే అనిపించింది.
నా యవ్వనంలో సాహిత్యం పెద్దగా చదివిన గుర్తులేదు. అందులోనూ శ్రీ శ్రీని అసలు చదలేదు.
ఓ సాయత్రం ఆఫీసు అయిపోయి ఇంటికి వెళుతున్నప్పుడు బస్సులో మగత మగతగా కొన్ని జ్ఞాపకాలు వెంటాడాయి.ముఖ్యంగా రెండు సందర్బాలు.

1. నా 24వ ఏట పెళ్ళి సంబందాలు రావటం మొదలయ్యాయి. అప్పటికి నాకంటే పెద్దదైన అక్కకు నాకు కలిపి కుండమార్పిడి సంబందం ఒకటి. మా ఇంటిలోని వారికి చాలా వరకు నచ్చింది. కాని నేను 28 సంవస్తరాలు వచ్చేవరకు చేసుకోనని నిర్దందంగా చెప్పేసాను. అప్పటికి నేను మద్యప్రదేశ్ లోని జబల్‌పూర్ వద్ద ఓ కంపెనిలో పనిచేస్తున్నాను. అక్కడనుంచి ఒక సంవత్సరంపాటు ఇంటికి రాలేదు. అక్క పెళ్ళికోసం వచ్చినప్పుడు నా మీద ముగ్గురు మరదళ్ళ చూపు పడింది. ముగ్గురుతో కొద్దిగా చనువు ఏర్పడింది. అది ప్రెమని నేను అనుకోను కాని మా మద్య పలకరింపుల లేఖలు నడిచాయి ఒక సంవత్సరం గడిచిన తర్వాత ముగ్గిరిలో ఎవరినైనా ఎన్నుకోవాలా లేక బయటకు వెళ్ళాలా అనే సందేహం కలిగింది. ఒకరు రూపంలో బాగుండేది, ఇంకొకరు చదువులో ముందుండేది, ఇక మోడో ఆమెకు రెండిటిలోనో సాధరణమే అయినా, పొలము పుట్ర సంక్రమించేవిగా వుంది. ఇలాంటి సమయంలో శ్రీ శ్రీ నాకు తెలియకుండా నా జీవితంలోకి ప్రవేశించాడు.
అది ఎలా అంటారా?
"నిన్ను నిన్నుగా ప్రెమించుటకు
నీ కోసమే కన్నీరు నింపుటకు నేనున్నానని నిండుగ పలికే తోడొకరుండిన అదే బాగ్యమో! అదే స్వర్గమో!" ముగ్గురిలో ఒకరు నా ప్రక్కటెముకగా మారింది.
ఆ భాగ్యాన్ని, ఆ స్వర్గాన్ని సొంతంచేసుకున్నాక చాలా కాలం నన్ను ప్రభావితం చేసింది శ్రీ శ్రీ అని తెలియదు.

2
ఒ రోజు ఎక్కడికో ప్రయాణంచేస్తూ బస్సుకోసం ఎదురుచూస్తున్నప్పుడు ఫుట్పాత్ మీద పాత పుస్తకాలు కనిపించాయి. అందులో ఓ చిన్న పుస్తకాన్ని సైజు చూసి డిటెక్టివ్ అనుకోని అయిదు రూపాయలకు కొన్నాను. దానికి అట్టలేదు. తీరా బస్సు వచి, సీటు దొరికాక పుస్తకంలోపలికి వెళితే అది వచన కవిత్వం, అందులోనో మైకోవిస్కీ రచనకు తెలుగు అనువాదం (నిజానికి అప్పటికి మైకోవిస్కీ తెలియదు). ఆ పుస్తకం ఎంతగా నచ్చిందంటే ప్రతీ ప్రయాణంలో పట్టుకెళ్ళేవాడిని. కొన్నిరోజులు దాన్ని మర్చిపోయాను. మళ్ళీ ఓ సాహితి మిత్రుడు వద్ద ఏ పుస్తకం విషయం ప్రస్తావన వచ్చింది. అప్పుడు తెలిసింది అది మైకోవిస్కీ రచన, శ్రీ శ్రీ అనువాదం.
ఇది రాస్తున్న సమయానికి చాలా సంవస్తరాలే అయ్యింది చదివి. అందులోని పాదాలు నాకు కుర్తుకు లేవు. కానీ అది చదినప్పుడు కలిగిన అనుభూతి మాటల్లో చెప్పలేను. ఇప్పుడు అనిపిస్తుంది నేను సాహిత్యం చదవడం, మొదలుపెట్టాక రాయడంలో బహుశ దాని ప్రభావం వుందనిపిస్తుంది.
నాకు తెలియకుండానే నా జీవిత కీలక సంఘటనల్లో శ్రీ శ్రీ చొరవ తీసుకొని ఆలోచనాంతర్బాగం అయిపోయాడు. నన్ను రుణగ్రస్తుణ్ణి చేసేసాడు. ఏమిస్తే ఆయన రుణం తీరుతుంది.
శిరసు వంచి నమస్కరిస్తున్నా.

Labels: , ,

Monday, May 11, 2009

అమ్మ సంకలనం అప్పుడే ఏడాది పూర్తి చేసుకుంది.

అమ్మ సంకలనం అప్పుడే ఏడాది పూర్తి చేసుకుంది.
అయినా నాకు ఈ మద్యనే దానికొసం పనిచేసినట్టు అనిపిస్తుంది.
ఈ ఏడాది కాలంలో మరేది చెయ్యలేకపోయాను.

మదర్స్ దినోత్సవ సందర్బంగా అమ్మను ప్రత్యేక దృష్టితోనూ, ప్రత్యేకమైన ప్రేమతోనూ జ్ఞాపకంచేసుకోవడంలోని దివ్యమైన అనుభూతి ఎన్ని సంకలనాలు చేసినా తీరదు.

నా నలబై తొమ్మిదేళ్ళ జీవితం కళ్ళముందు కనిపిస్తుంది. అందులో అమ్మతోటి అనుబందం, జ్ఞాపకాలు అనిర్వచనీయమే.

అందుకే అమ్మా నిన్ను ప్రేమిస్తున్నాను.

నా జీవితంలో వొడిదుడుకుల సమయంలో నన్ను వూరడించి, వెన్నుతట్టిన నా సహచరి, నా ప్రక్కటెముక ఎన్నోసార్లు అమ్మలాగే కనిపిస్తుంది.

ఎన్నటికీ అమ్మను కాలేని వాణ్ణే, అందుకే అమ్మతనంముందు ప్రణమిల్లుతున్నాను.

Labels: ,

Wednesday, April 29, 2009

ఓ గొప్ప సాయంకాలంశివారెడ్డి కవిత్వంలో ఆమె

నిన్న 28.4.2009 ఓ గొప్ప సాయంకాలం
-----------------
ఉదయమే ఒక పోను వచ్చింది. హలో అన్నవెంటనే గుర్తు పట్టాలేదు. అంతలోనే నేను శివారెడ్డిని అని అవతలై స్వరం. సాయంకాలం మిత్రు కలుస్తున్నారు నీవుకూడా వస్తే బాగుంటుంది కలిసి చాలకాలం అయ్యింది, అలగే ఎవరైనా మిత్రులుకు తెలియపర్చు అన్నారు. బషీర్బాగ్, ప్రెస్ క్లబ్ సాయత్రం 6 గటలకు. కొద్ది సేపు నన్నునేను నమ్మలేకపోయాను.

నగరంలో రకరకాల పరుగుల మద్య, ట్రాఫిక్ జాములమద్య సమయానికి చేరటం కొంచెం కష్టమే అయ్యింది. తీరా వెల్లేసరికి అది మిత్రుల కలయిక కాదు. శివారెడ్డి కొత్త పుస్తకం సభా కార్యక్త్రమం. ఘుడిపాటి, పెన్నా కలిసి శివారెడ్డి కవిత్వంలోచి స్త్రీ దృక్పద కవితల్ని ఏరి ఒక్కచోట చేర్చిన పుస్తకం. నేనువెళ్ళేసరికి వేణు మాట్లాడుతున్నారు. తర్వాత శివారెద్ది కొన్ని కవితల్ని చదివారు. అన్నీ నేను ఏదో ఒక సందర్బంలో చదివినవే అయినా ఆయన చదువుతున్నప్పుడు కొత్తవేమొ అంపించాయి.

కవిత్వ వినటం ఒక అద్బుత జ్ఞాపకమైతే వచ్చిన మిత్రులు మరీ ఎక్కువ ఆనందాన్ని నింపారు. వెన్నెల కుండపోతగా కురిసినట్టు, అందరూ సాహిత్య కారులే, కవులు కథకులు పత్రికలు. మరచిపోలేని జ్ఞాపకం.

శివారెడ్డి కవిత్వంలో ఆమె
- పెన్నా శివరామకృష్ణ, గుడిపాటి
( శివారెడ్డి కవితా సంకలనం ‘ఆమె ఎవరైతే మాత్రం’ పుస్తకానికి ముందుమాట)

ప్రతి కవీ ఏదో ఒక సందర్భంలో ఎవరో ఒక స్త్రీ గురించి కవిత రాసే ఉంటారు. శివారెడ్డి రాసినంత విస్తృతంగా స్త్రీ ఇతివృత్త కవితలు రాసిన తెలుగు కవి మరెవరూ లేరనే చెప్పాలి. శిశువుగా, బాలికగా, మగవాడి వంచనకు గురైన అభిమానవతిగా, ‘ప్రపంచానికి ముగుతాడేసి తన వెంట నడిపించుకుపోతున్న’ ధీరగా, తన ప్రాణాన్ని పంచుతూ పురిటినొప్పులు సహించే మాతృమూర్తిగా, జీవకారుణ్యాన్ని వర్షించే తల్లిగా, పురుషుడి అన్ని దాష్టీకాలను భరించే నిశ్శబ్దపు పసుపు ముద్దలాంటి మధ్యతరగతి గృహిణిగా, స్కూటీ గుర్రం మీద దౌడు తీసే నేటి తరం విద్యార్థినిగా, యువతిగా, ఉద్యోగినిగా స్త్రీ జీవితంలోని వివిధ దశలను, వివిధ పార్శ్వాలను అత్యంత స్పష్టంగా, గాఢంగా, ఆత్మీయంగా శివారెడ్డి పరామర్శించారు.

ఆమె ఎవరైతే ఏం
ఆ కన్నీళ్ళు నావే
ఆమె ఎవరైతేం
ఆ ఆవేదనా నాదే...
ఆమె ఎవరైతేం
ఆమె నా ఆలోచన
ఆమె ఎవరైతేం
నా లోపలి అద్దం మీద చెరగని ముద్ర
ఆమె ఆనవాళ్ళు
నా అక్షరాల్నిండా ప్రత్యక్షం
ఈ వాక్యాలు ‘నేత్రధనుస్సు’ (1978)లోని ‘ఆ కన్నీళ్ళు నావే’ అనే కవిత లోనివి. స్త్రీ పురుషుల మధ్య ఆవేగాత్మకమైన బంధాన్ని తెలిపే ‘నుదుటి మీద రెండు పెదవులు’ 1975 (‘చర్య’ కవితా సం పుటి) నాటిది కాగా, దాంపత్య జీవితంలో క్రమంగా ఏర్పడిన సంక్లిష్టతను తెలిపే ‘ముళ్ళు’ అనే కవిత 1978లో (‘నేత్రధనుస్సు’) రాసినది.

వీటిని గమనిస్తే సుమారుగా గత నాలుగు దశాబ్దాల ఆయన కవిత్వంలో ‘ఆమె’ ఒక ప్రధాన అంతఃస్రోతస్విని అని తెలుస్తుంది. ‘ఆ కన్నీళ్ళు నావే’ అనే కవితలోని ‘ఆమె ఎవరైతే ఏం’ అనే తొలి వాక్యమే ఆ తర్వాత అప్రయత్నంగా ‘ఆమె ఎవరైతే మాత్రం’ (1989) అనే శీర్షికగా పరిణమించిందని గుర్తించడం కష్టంకాదు. తల్లి లేని బాల్యం, తల్లిప్రేమ నెరుగని బాల్యం అనంతర జీవితాన్ని ప్రతి కూలంగా ప్రభావితం చేయటం లోకంలో సాధారణంగా కనిపిస్తుంటుంది. అలాంటి బాల్యం దుందుడుకుతనాన్ని పెంపొందించడమో, మనుషుల పట్ల, లోకం పట్ల ఒక పగను, ప్రతీకారేచ్ఛను ప్రేరేపించడమూ, చివరకు ఆత్మ విధ్వంసానికి దారితీయడమూ జరుగుతూ ఉంటుంది.

‘అయిదేళ్ళ ప్రాయంలో తల్లిని పోగొట్టుకున్న ఒక పల్లెటూరి బాలుడికి ప్రపంచం ఒక వేయితల నాగుపాము. జీవితం ఒక భయం, ఒక దరిద్రం, ఒక అనాదరణ... ఆనాథ బాల్యాలు కానీ ఆర్ద్రత లోపించిన పిలుపులు గానీ, ఏకాకితనాలు కానీ, ఆర్థం కాని సంబంధాలు కానీ అన్నీ... అన్నీ భయం భయంగా నాలో మిగిలి నా అంతర్లోకాలన్నింటినీ ముట్టించి ఊదరబెట్టి ఊపిరాడక అరిస్తే, అమ్మా! అంటే పలికే గొంతు లేనప్పుడు- బహుశా ఇవన్నీ నా కవిత్వంలో అదృశ్యంగా నర్తిస్తూ ఉంటాయేమో! (చూడు: ‘మనిషి బతుక్కి అర్థం సమూహంలోనే!’ - ‘జైత్రయాత్ర’ కవితా సంపుటి) అని శివారెడ్డి చెప్పుకున్నారు.
బాల్యంలోని కష్టనష్టాలకు కారణాలను నిష్పాక్షికంగా విశ్లేషిం చుకొని, మనుషుల మనస్తత్వాన్ని, లోకాన్ని సానుకూల దృక్పథం తో పరిశీలించడమూ, తనకు దొరికిన ఏ కొద్ది ప్రేమనైనా అపురూపంగా స్వీకరించడమూ, తాను పొదలేకపోయిన ప్రేమను ఇతరులకు పంచడం ద్వారా ఆనందాన్ని అనుభవించడమూ, సాధన పూర్వక ఆచరణగా, ఆచరణాత్మక అభ్యాసంగా మార్చుకోవడం విశేషం. ప్రతి దానిని అనుమానిస్తూనే, విశ్లేషించుకుంటూనే (ప్రతికూల దృష్టిని అలవరచుకోకుండా) సానుకూల పార్శ్వాలకే ప్రాధా న్య మివ్వడం, సంలీనమవ్వడం సులభసాధ్యమేమీ కాదు. తల్లి ప్రేమ తెలియని, ఇంటి పనులు, వ్యవసాయ పనులు చేసుకొంటు న్న కుర్రాడికి విశాఖపట్టణమూ, విశ్వవిద్యాలయపు వీధులూ, తొలి యౌవనంలో హైదరాబాదు సంక్లిష్ట రాజకీయ, సాహిత్య వాతావరణం మలి యౌవనంలో ఎన్నో పాఠాలు నేర్పి ఉంటాయి.

అన్ని పాఠాలను, గుణపాఠాలను సానుకూల దృక్పథంతో స్వీకరించడం ఆయన వ్యక్తిగత, సాహిత్య, జీవిత పరిణామక్రమానికి మూల కారణంగా గ్రహించవచ్చు. ఈ దృక్పథమే, ఈ రకమైన జీవన విధానమే స్త్రీ పట్ల అపారమైన ఆయన ప్రేమకు ప్రధాన ప్రేరణగా ఊహించవచ్చు.అన్ని బంధాలను, అన్ని రకాల మానవ సంబంధాలను గతితార్కిక దృష్టితో పరిశీలిస్తూనే, ఆత్మీయతలకు, అనుబంధాలకు మూలమైన అవసరాలను, అన్ని దృక్పథాల పరిమితులనూ పరిగణనలోకి తీసుకోవడం, వాస్తవిక జీవన అనుభూతులకు ప్రాధాన్య మివ్వడం- ఈ కవి ఇతర కవితలలో వలెనే స్ర్తీ ఇతివృత్త కవితలలోను కనిపిస్తుంది.

ప్రతి వస్తువుకు, ప్రతి స్థితికి, ప్రతి ఉద్వేగానికి, ప్రతి సిద్ధాంతానికి ఉండే రెండు చివరలను ఈ కవి అర్థం చేసుకున్నారు. ప్రతిదానికీ ఉండే పరస్పర వ్యతిరేక పార్శ్వాలను ఏకకాలంలో దర్శిస్తూనే దేనిని ఎక్కడ, ఎంతవరకు అన్వయించుకోవాలో గ్రహించగలగడమూ, అన్ని చలన సూత్రాలనూ గమనిస్తూనే తక్షణ సన్నివేశాల లో, అనుభవాలలో తనను తాను మిళితం చేసుకోవడమూ, హుద య పూర్వకంగా, సంకల్ప సహితంగా అనుభవించగలగడమూ ఒక అంతర్ముఖ సాధన. అభిప్రాయాల పరంగా,దృష్టికోణాల పరంగా, సిద్ధాంతాల పరంగా వైరుద్ధ్యాలు లేకుండా కవితాత్మకం గా వ్యక్తీ కరించగలగడం బహిర్ముఖ అక్షర తపస్సు.
అనుభూతి నుంచి ఆలోచనకు, ఆలోచన నుంచి అనుభూతి వరకు సాగే నిరంతర కవిత్వ హేల ఇది. భుజం మీద అడ్డంగా గడకర్ర పట్టుకుని తాడు మీద నడుస్తున్న గారడీ పిల్ల శివారెడ్డి కవిత్వం. అనుభూతికి ఆలోచనకు మధ్యనున్న దృశ్యాదృశ్య విభజన రేఖే ఆ తాడు.

ఒక సన్నివేశాన్ని, సంఘటనను లేదా అనుభవాన్ని ఉన్నది ఉన్నట్లుగా వర్ణించడం ఒక పద్ధతి. కవిగా, బౌద్ధిక విశ్లేషణాపూర్వకంగా ఒక సన్నివేశాన్ని వర్ణించడం రెండో పద్ధతి. ఒక సన్నివేశ వర్ణనతో ఆరంభించి, ఆ సన్నివేశ నేపథ్యాన్ని విశ్లేషిస్తూ, తిరిగి నిర్దిష్ట సన్నివేశ ప్రస్తావనతో ముగించడం మూడవ పద్ధతి. ఈ మూడు పద్ధతులూ ఈ కవి ఇతర కవితలలోలాగానే ఈ స్త్రీ ఇతివృత్తి కవితలలోనూ కనిపిస్తాయి.
సగటు మగాడిలా ఎక్కడా స్త్రీని తప్పు పట్టకుండా, న్యూనపరచకుండా, ఆమె ప్రతి కదలికకూ, ప్రతి ఆలోచనకూ, ఆచరణకూ కారణాలను వ్యవస్థలో వెతుక్కుంటూ ‘ఆమె’ను అపార సానుభూతితో, ప్రేమతో, కరుణతో ఆశ్లేషించుకోవడం ఈ కవితలలోని ప్రత్యేకత.

ఒకరు మరొకరి మీద ఆధారపడడం ‘వ్యవస్థ’ కల్పించిన కుట్ర అని భావిస్తూనే, పురుషుడి అస్తిత్వం నిరంతరం ‘ఆమె’ మీద ఆధారపడిందనే భావాన్ని ‘ఆమె కలదు, నువ్వు లేవు’ అనే వాక్యాలలో వ్యక్తం చేశారు. ‘ఆమె కలదు, నువ్వు లేవు’ అనే మాట ఉద్వేగాత్మకంగా అనిపించవచ్చు. కాని వ్యక్తిగత జీవిత లక్ష్యాలను ఏదో ఒక మేరకు సాధించిన (తన వ్యక్తిగత జీవననేపథ్యాన్ని నిష్పాక్షికంగా వి శ్లేషించుకోగలిగిన) ఏ పురుషుడైనా ఈమాటలతో ఏకీభవిస్తాడు.

నిత్య చైతన్యం, నిత్య ఉత్సాహం, నిత్య సహనం, గూఢత్వం- ఇవేవీ ఎవరికీ పుట్టుకతోనో, వారసత్వంగానో సంక్రమించేవి కావు. కాని ప్రతి సగటు స్త్రీ వీటిని అభ్యసిస్తూనే ఆచరిస్తూ, ఆచరిస్తూనే అభ్యసిస్తూ జీవన పోరాటాన్ని కొనసాగిస్తుంటుంది. వ్యవస్థలోని లైంగిక వివక్ష వల్ల స్ర్తీలు తమకు తెలియకుండానే తమ అస్తిత్వం కోసం అలవరచుకొన్న లక్షణాలివి. స్త్రీల ‘స్వభావాని’కి కారణాలైన ఇలాంటి బాహిర ప్రభావాలను గమనించ లేక (గమనించినా అంగీకరించలేక) స్త్రీ హృదయాన్ని, స్త్రీ చిత్తాన్ని, బుద్ధిని గూర్చి అనేక అపోహలను పురుషాధిపత్యం సూత్రీకరించింది; సిద్ధాంతీ కరించింది. స్త్రీలు ‘రహస్య రసాధిదేవతలు’ అని ఈ కవి అనడం అపూర్వం. ఇది స్త్రీల సహజ చిత్తవృత్తిని తెలుపుతూ, దాని వెనుకనున్న స్త్రీల మానసిక, సామాజిక కారణాల అన్వేషణకు ప్రేరణ నిస్తుంది.

తన ప్రాపంచిక దృక్పథానికి వ్యతిరేకం కానంతవరకు ఏ వస్తువును స్వీకరించడానికైనా, ఏ విధంగా వర్ణించడానికైనా ఈ కవి వెనుకాడరు. (ఈ కవితలన్నీ ఒకే కాలంలో, ఒక క్రమంలో రాసినవి కావన్నది తెలిసిందే.) వివిధ కాలాలలో, వివిధ మానసిక స్థితులలో అనుభవమే ప్రమాణంగా, ఆయా దృశ్యాల, సన్నివేశాలలోని వాస్తవికతే ప్రమాణంగా రాసిన కవితలివి. ‘నిజాయితీ లేకుండా, గాఢంగా నమ్మకుండా ఒక్క అక్షరం కూడా రాయలేదు’ అని ఆయ నే చెప్పుకున్నారు. గాఢంగా అనుభవించకుండా ఆయన రాయరు. అనుభవించలేకపోతే, ఒకానొక వస్తువు మనసును పట్టి పీడించే వరకు ఆగుతారు. లేదా మనసుకు పట్టించుకోవడానికి కొన్ని వారాలపాటు, నెలల పాటు ప్రయత్నిస్తారు.

‘నాకు రెండు టేబుళ్ళ కవతల’, ‘వాళ్ళు మాట్లాడుకుంటున్నారు’ అనే కవితలను, ‘అప్పుడి వేమీ’, ‘నుదుటి మీద రెండు పెదవులు’, ‘ఒక ఆడ- ఒక మగ’, ‘ఒక ప్రక్రియ’, ‘ఒక దీపం’ మొదలైన కవితలను ఒక వరుసలో చదివినప్పుడు- వీటిలో భావవైరుద్ధ్యమున్నట్లు వెంటనే అనిపించవచ్చు.స్త్రీ , పురుషుల లేదా భార్యాభర్తల బంధాలలోని వివిధ దశలను, వాస్తవిక స్థితిగతులను, వైరుద్ధ్యాలను, సంక్లిష్టతలను ఈ కవితలు ప్రతిఫలిస్తాయి తప్ప, కవిలోని భావవైరుద్ధ్యాలను కావని గ్రహించాలి. ఇంతకుముందే అనుకున్నట్లు ఈ కవి తన ప్రాపంచిక దృక్పథాన్ని ఎంత సీరియస్‌గా తీసుకుంటారో వస్తు, వ్యక్తీకరణల్లో అంత స్వేచ్ఛగా వ్యవహరిస్తారు.

‘స్త్రీవాద ధోరణి ఇంతకు ముందు మనం స్పృశించని కొన్ని అంశాలను ముందుకు తెచ్చింది. వాళ్ళ జీవితాలలో మనం చూడని, చూడలేని చీకటి కోణాలను అది వ్యక్తీకరిస్తున్నది. నేనైతే మనస్ఫూర్తిగా స్త్రీవాద ధోరణిని ఆహ్వానిస్తున్నాను’ అని ఒక ఇంటర్వ్యూలో శివారెడ్డి చెప్పారు. స్త్రీవాదం ఆరంభానికి చాలా కాలం ముందు నుంచే స్ర్తీల హక్కులు హరింపబడడాన్ని, పురుషాధిపత్యాన్ని నిరసిస్తూ ఈ కవి రాశారని ఈ సంపుటిలోని కొన్ని కవితల రచనల తేదీలను పరిశీలిస్తే తెలుస్తుంది. అందువల్ల స్త్రీవాదం వల్లనే శివారెడ్డి ఇలాంటి కవితలు రాయగలిగారనేది పూర్తిగా సత్యం కాదు. కాకపోతే స్త్రీవాదం ఆయన ‘చూపు’కు మరింత ‘పదును’ పెట్టిందని, స్త్రీ ఆంతరిక, భౌతిక జీవితాలలోని మరికొన్ని కొత్త కోణాలను చూసే అవకాశాన్ని కల్పించి ఉంటుందని ఊహించవచ్చు. స్త్రీ విముక్తిని గాఢంగా కాంక్షించే ఈ కవి, పోరాటపంథా ఏ విధంగా ఉండాలనేది ఎక్కడా సూటిగా చెప్పినట్లు లేదు. పై ఆంగ్ల వాక్యాల సారాంశాన్ని అంగీకరిస్తే,స్త్రీ విముక్తిని గురించిన శివారెడ్డి అభిప్రాయాలు సోషలిస్టు ఫెమినిజానికి దగ్గరగా ఉన్నట్లు చెప్పవచ్చు.
-0-
గాఢానుభూతిలో ‘ధిక్కారాన్ని’ మిళితం చేయడం ఈ కవి కవిత్వంలో కనిపించే ఒక ముఖ్య లక్షణం.
ఒక వస్తువులోని తనదైన ‘విలక్షణత్వాన్ని’ నిదర్శన పరంపరల తో మరింత ఎక్కువ చేసి చూపడంలో ‘కారికేచర్‌’ లక్షణం కనిపిస్తుంటుంది. అలాగే పట్టరాని ఆగ్రహంలోను భాష, భావాల పరం గా ఒక సంయమనాన్ని కూడ ఈ కవితలలో గమనించవచ్చు.శివారెడ్డి కవితల్లో ‘చిన్న’, ‘పెద్ద’ కవితలు వేటికవి ప్రత్యేకంగా ఉంటాయి. చిన్న కవితలలో ‘భావాంశాల’ మధ్య సమతుల్యానికి, ముగింపుకు ప్రాధాన్యముంటుంది. ‘శీర్షిక’ కూడా కవితలో భాగమై కవితను మరింత ధ్వన్యాత్మకం చేస్తుంటుంది. ‘పెద్ద’ కవితల్లో నిర్వహణకు, వర్ణనలకు, ఆద్యంతాల మధ్య వస్తు ఐక్యతకు ప్రా ముఖ్యముంటుంది. ‘ముళ్ళు’, ‘సారాంశం’, ‘వెన్నెల’, ‘ముఖే ముఖే విషాదంలో...’ మొదలైన ‘చిన్న’ కవితలను చదివితే ఈ శిల్ప రహస్యాలను అర్థం చేసుకోవచ్చు.
‘రూపం’లో సామ్యం (పోలిక) అవ్యక్తంగా ఉంటుంది. దానివల్ల కవిత్వానికి సాంద్రత వస్తుంది. రూపక నిర్మాణం కవి సత్తాకు ఒక నిదర్శనం. ‘పురాతన విలువ మేకు’, ‘ఆదర్శాల రాగిచెంబు’, ‘ముగుతాడేసి ప్రపంచాన్ని నడిపించుకుపోవడం’, ‘శూన్య నేత్రాల గృహం’, ‘కిరణాలు రెక్కలొచ్చి ఎగిరిపోవడం’ మొదలైన రూ పకాలలో, ప్రయోగాలలో నైరూప్యాలను సారూప్యాలతో పో ల్చడం, ప్రాణి ధర్మారోపణలు, సినెక్‌డకీ (), మెటానమీ () లు అన్నీ కలగలిసిపోవడం చూస్తాం. ‘చీకటి మొక్క’, ‘యిసుక సముద్రా ల సామ్రాజ్యం’, ‘ముకు ర పుష్పం’ లాంటి ప్రయోగాలు ఎన్నెన్నో... కవిత్వ సాంద్రత కోసం ఈ కవి చేసే సమాస, పదబంధ కల్పనలకు ఇవి స్వల్ప ఉదాహరణలు.

‘ఆమె చేతుల్లో ఎండిపోయినా, పండిపోయినా, రాలిపోయినా గొప్ప భాగ్యమే’- ఇలాంటి అనేక సందర్భాలలో క్రియాపదాల ద్వారా ఉపమానోపమేయాలను ధ్వనించడం ఈ కవి అనుసరించే మరో పద్ధతి. పరాత్మకంగా (ఆబ్జెక్టివ్‌గా), సాక్షీమాత్రంగా ఒక సన్నివేశవర్ణనను ఆరంభించి మధ్య, మధ్య కవిగా లుగజేసుకుంటూ, వ్యాఖ్యానిస్తూ తిరిగి వర్ణనను కొనసాగించి స్వీయ వ్యాఖ్యతో ముగించడం శివారెడ్డి కవిత్వ నిర్వహణ పద్ధతులలో ప్రధానమైనది (శివారెడ్డి కవిత్వ నిర్వహణ పద్ధతులను గూర్చిన మరింత విస్తృత చర్చ కోసం ‘శివారెడ్డి కవిత్వం- పరిణామ వికాసాలు’ పుస్తకం చూడవచ్చు). ప్రసుత సంకలనంలోని ఏ కవితను, ఏ భాషలోకి అనువదించినా ఆయా కవితల వన్నె తగ్గదు. వస్తుపరమైన విశ్వజనీనత, అనుభవ గాఢత, అభివ్యక్తి నవ్యతలను ప్రతిఫలించే కవిత్వ నిర్మాణ శిల్పం దీనికి ప్రధాన కారణాలు.

ప్రతి కవీ ఏదో ఒక సందర్భంలో ఎవరో ఒక స్త్రీ గురించి కవిత రాసే ఉంటారు. శివారెడ్డి రాసినంత విస్తృతంగా స్త్రీ ఇతివృత్త కవితలు రాసిన తెలుగు కవి మరెవరూ లేరనే చెప్పాలి. శిశువుగా, బాలికగా, మగవాడి వంచనకు గురైన అభిమానవతిగా, ‘ప్రపంచానికి ముగుతాడేసి తన వెంట నడిపించుకుపోతున్న’ ధీరగా, తన ప్రాణాన్ని పంచుతూ పురిటినొప్పులు సహించే మాతృమూర్తిగా, జీవకారుణ్యాన్ని వర్షించే తల్లిగా, పురుషుడి అన్ని దాష్టీకాలను భరించే నిశ్శబ్దపు పసుపు ముద్దలాంటి మధ్యతరగతి గృహిణిగా, స్కూటీ గుర్రం మీద దౌడు తీసే నేటి తరం విద్యార్థినిగా, యువతిగా, ఉద్యోగినిగా స్ర్తీ జీవితంలోని వివిధ దశలను, వివిధ పార్శ్వాలను అత్యంత స్పష్టంగా, గాఢంగా, ఆత్మీయంగా శివారెడ్డి పరామర్శించారు.

భౌతిక, సామాజిక జీవితాలలో స్ర్తీ ఎదుర్కొంటున్న పక్షపాతాలతోపాటు, స్ర్తీ పురుషుల సంబంధాలలోని అనేకానేక సమస్యలతోపాటు, ఉద్వేగపరమైన సంఘర్షణలను, స్ర్తీ, పురుషుల చిరకాల సాంగత్యానికి మూలమైన సర్దుబాట్లను కూడా అంత వాస్తవికంగా విశ్లేషించడం ఈ కవితలలోని ప్రధాన వైశిష్ట్యం. తన కవిత్వానికి, తన కవిత్వమే ‘ముందుమాట’గా, ‘చివరిమాట’గా శివారెడ్డి భావిస్తారు. ఈ కవితలను కాలక్రమంలోను, వస్తుపరమైన విభజన దృష్టితోను పలుమార్లు చదివినప్పుడు కలిగిన ఆశ్చర్యానందాలను నిగ్రహించుకోలేకనే ఈ నాలుగు మాటలు రాయాల్సి వచ్చింది. ఈ సంకలనం తీసుకురావడానికి అనుమతించిన శివారెడ్డికి హార్థిక కృతజ్ఞతాభి వందనాలు.

Labels: ,

Tuesday, March 31, 2009

వర్షమంటే... నానోలు

1
వర్షం
అంటే
చినుకుల
సవ్వడి-


2
కాగితపు
పడవల
బాల్యపు
గుర్తులు-

3
వోణీ
తడిసి
వొంపిన
వయ్యారం-

4
చినుకు
చిరుకాంతి
ఆకాశంతెర
హరివిల్లు-

5
ఎండిన
విత్తనానికి
జీవం
పోయడమే-

6
నెరలిల్లిన
నేలతల్లిని
పదును
చేయడమే-

7

పెళ్ళలుగా
పగిలిన
పుడమికి
పులకరింపే!-

8

దాహంగొన్న
భూమికి
తొలకరిజల్లై
సేదదీర్చడమే!-

9

ఘనీభవించిన
మేఘం
చినుకై
ద్రవీభవిండమే!-

10

కురిసి
కురిసి
పొంగిపొర్లే
ప్రవాహమవ్వడమే!-

Labels:

Wednesday, March 25, 2009

ఎందుకో ఇలా??

నిర్మానుష్యమైన చోటికి పారిపోవాలని మనసు పదే పదే కోరుకుంటుంది. నిజానికి అలాంటి ప్రదేశం ఏదైనా దొరుకుతుందా? నిద్రకన్నుల రెప్పల్ని బలవంతంగా అలారం మోతతోటి తెరిచి, రొదపెడ్తన్న చోటుల్లోకి ఒకటే పరుగులు, వురకలు. కాసింత తొలిజాము కూతల పక్షుల సవ్వడి మరచిపోయామా? లేక రొదగా భావించి పక్షులకే అలారంమోత నేర్పి కొత్త సమయాన్ని, కొత్తస్థలాన్ని వెతుక్కోమని తోలివేసామా??
వెంటాడుతున్న బాద్యతల్ని ఒకొక్కటిగా నెమరువేసుకుంటూ నేటి పనుల జాబితాల్ని తయారు చేసుకుంటుంటే వాటి మద్య ఎక్కడైన నిర్మానుష్యమైన ప్రదేశానికి చోటుదొరుకుతుందా సమయం దొరుకుతుందా. బహుశ అంతర్జాల బ్రౌజర్లో వెతకాలేమో. దానికోసం ఏ ఏ కోడును ఉపయోగించాలో. ఒకదాని వెంబడి ఒకటి వెంటాడి వెతుకుతున్న దాన్ని మరిపింపచేసే గందరగోళంలో పడవేస్తాయి కదా!
బ్రతుకు జీవనం తరుముతుంటే రహదారులవెండి పరుగులు తీస్తుండాలి. వరదలాంటి వాహనాల ప్రవాహంలోకి జొరబడి ఒడ్డుకుచేర్చే తెడ్లకోసం వెతుకుతుంటాము.
మంచుకురిసినట్టో, ఎర్రని గుల్మోర్ పువ్వులు రాల్తున్న రహదారుల్లో రూపాయలకోసంవెతుకులాట గుర్తుకోచ్చి ప్రశ్నించే బాసు మొఖం కళ్ళముందు కదలాడి నుదుటపట్టే చెమటను తుడుచుకోవడమే మరచిపోయి పరుగులు తీయాల్సిందే! గాలివీచే కిటికీలను మూసివేసిన గదుల్లో ఎవరికివారే బందీలుగా అప్పగించుకొని బయటపడే మార్గంకోసం మరోవైపునుంచి వెతుక్కోవల్సిందే! బయటపడాటంకోకోసంచేసే ప్రయత్నాలలో అలసిన దేహం విశ్రాంతిని కోరుకొంటుంది. సుఖాన్ని మరచి, గతాన్ని మరచి మరుపుపొరలనద్య, మగత నిద్రల మద్య మరో రాత్రి పలకరించిపోతుంది.
దేన్ని వెతుకుతున్నానో ఏది కోరుకుంటున్నానో
ఎక్కడనుంచో మ్రోగిన రింగుటోను ఎదో అలజడిని గుర్తు చేస్తుంది.

Labels:

Monday, March 23, 2009

నానోలు

సాహితీ మిత్రుడు ఈగ హనుమాన్ నాలో ఏమిచూసాడో గానీ నానోలు రాయమని కాక రాయగలవు అంటూ పదేపదే ప్రోత్సాహిస్తుంటే చిన్న ప్రయత్నంగా ఇలా మీముందుకు వచ్చాయి.


నానోలు

1
రాలే
శిశిరం
వసంత
ఆగమనం

2

కడిగిన
కన్ను
మలినరహిత
మనసు

3

మరిగే
ఆలోచనలు
మనసు
రణరంగం

4

విజయం
అపజయం
బొమ్మా
బొరుసు

5

సీత
గీత
దాటితే
యుద్దమే!

6

చిగురు
వగరు
కోకిల
వసంతగానం

7

రెక్కలు
ఉహలు
కలలు
అందమే!

8

పప్పు
ఉప్పు
నిప్పు
వంటకమే!

9

నిజం
నిశ్శబ్దం
నిర్మానుష్యం
భయపెట్టేవే!

10

ఎవరి
లంకకు
వారే
లంకేశ్వరులు
.....

ఇంకా నానోలకోసం దర్శించండి

http://nanolu.blogspot.com/2009/03/blog-post_22.html

Labels:

Tuesday, February 24, 2009

నిజంగా నీవు ఇక్కడ వుంటే బాగుండేది

నిజంగా నీవు ఇక్కడ వుంటే బాగుండేది

హితులెవ్వరూలేని ఈ నిశ్శబ్దపు రాత్రి

చుట్టూ చీకటినిండుతుంటే

ఈ ప్రదేశమంతా భయంతో నిండినప్పుడు

నీవు ఇక్కడవుండి నా భయం పోగొడతావని

నాలో చిరునవ్వు పూయిస్తావని

నా ఆశ!

దురదృష్టం నీవిక్కడలేవు

నిజంగా నీవు ఇక్కడ వుంటే బాగుండేది

ఇక ఎవరు పట్టించుకుంటారు నన్ను

Labels:

Saturday, February 14, 2009

వెంటాడుతూనే వుంటాయి


కాలం గడచిపోతూనే వుంటుంది
కొన్ని జ్ఞాపకాలు
కొన్ని అనుబందాలు
కొన్ని కర్తవ్యాలు
కొంత శూన్యం
కొన్ని మార్పులు
వెంటాడుతూనే వుంటాయి

శూన్యాన్ని చూస్తూ చూస్తూ
బాధ గుండెను పిండేస్తుంది
కోల్పోయిందేదీ లేదు

అడుగులు ముద్రలై
కర్తవ్యాన్ని బోదిస్తూనేవుంటాయి
శూన్యాన్ని పూరించడంకోసం
గాలి నలువైపులనుండి చొచ్చుకొని వస్తుంది

ఒక్క జ్ఞాపకం
ఒక్క సారి నేమరువేసుకోనే అనుభవం
కొత్త శక్తినిస్తుంది
నీవులేకున్నా
నీ పరామర్శలులేకున్నా
బ్రతికేస్తునే వుంటాము

ఈ జ్ఞాపకం
మీ ఆత్మకు శాంతినివ్వాలని

Labels: ,

Thursday, January 29, 2009

జనవరి నెల నేలా వెన్నెల

యధావిదిగా ఈ మెల నెలనెలా వెన్నెల25.1.2009 ఆదివారం శ్రీ కృష్ణరావుగారి ఇంటిలో జరిగింది.
శ్రీ సంపత్కుమారాచార్య,
శ్రీ మోహన రెడ్డి, వారి మిత్రుడు
శ్రీ కె.వి. రమానాయుడు
శ్రీ ధర్మాచారి
శ్రీ యాకూబ్
శ్రీ వీర్రాజు
శ్రీ జాన్ హైడ్ కనుమూరి
శ్రీమతి రేనుకా అయోలా హాజరయ్యారు.

సంపత్కుమారాచార్యా - ఆముక్త - కావ్యం నుంచి పద్యాలను చదివి వినిపించారు.
ధర్మాచారి తనదైన శైలిలోని శ్రీకాకుళం మాడలికంతో గల్పికలను వినిపించారు.
రేణుక మృదువైన కవిత్వన్ని వినిపించారు.
కె.వి. రమానాయుడు జలప్రస్థానాన్ని మరొక్కసారి వినిపించి సైన్సును కవిత్వీకరించడంలోని మహత్వాన్ని చాటిచెప్పారు.
చెట్టు ఇస్మాయిల్‌ను జ్ఞాపకంచేస్తూ యాకూబ్ కవితవినిపించారు.
శ్రీ వీర్రాజు, నేను, మోహనరెడ్డి కొన్ని కవితలను చదవడంజరిగింది.

Labels:

Monday, January 19, 2009

అలలపై కలలతీగలపై మీటిన రాగం

మంచి వ్యాసాన్ని రాసిన తాడేపల్లి వారికి, అరుణ పప్పు గారికి

చదివి స్పందిచి ఫోనులు చేసినవారికి, ఎస్.ఎం.ఎస్. చేసినవారికి

వేగులు పంపినవారికి
గుంపులో పలుకరించినవారికి

అందరికి ధన్యవాదములు
చిన్న సూచన : నేను మద్యపానాన్ని మానే ప్రయత్నం 1999 - 2003 మద్య చేసాను, మానివేసాను అప్పటినుండి దానిజొలికి నేను వెళ్ళలేదు.
అలా సాహిత్యం, బైబిలుసాహిత్యం నన్ను కట్టడిచేసాయని చెప్పడానికి సంతోషిస్తున్నాను.




http://www.andhrajyothy.com/navshow.asp?qry=/2009/jan/18navya6

Labels: ,

Thursday, January 15, 2009

ఎవరైనా చెప్పి సహాయం చేస్తారా...

నేను సరదాగా టాప్‌లెట్ మార్చడానికి ప్రయత్నించి విజయం సాదించాను. కాని కొన్ని కోల్పోయాను.
ఉదా : అమ్మ సంకలనం లంకే
స్టాట్ సూచిక
అవిపె తిరిగి పెట్తటం ఎలాగో ఎవరైనా చెప్పి సహాయం చేస్తారా...

Friday, January 9, 2009

వెంటాడుతున్న జ్ఞాపకాలనుండి...జ్వాలాముఖి

అది ఉగాది సాయత్రం(2003) పొట్టిశ్రీరాములు తెలుగు యూనివర్సిటీ ప్రాంగణములోని ఎన్.టి.ఆర్. ఆడిటోరియంలో కవి సమ్మేళనం జరిగింది. అద్యక్షులుగా శ్రీమతి నాయని కృష్ణకుమారి, ప్రత్యేక అతిథిగా శ్రీ ఉత్పల సత్యనారాయణ ఆసీనులైన వేదికపై వేదిక శీమతి శరత్ జోత్సనా రాణి ఆహ్వాన పలుకులతో ప్రారంభమైన సభలో జ్వాలాముఖి, ఎస్వీ సత్యనారయణ, అందెశ్రీ, కె. ప్రభాకర్, ఒబ్బిని, శివారెడ్డి, శిఖామని, ఘంటసాల నిర్మల, ఇలా ప్రముఖులెందరో ఆ రోజు కవిత్వాన్ని చదివారు. ఇంకా కొందరి పేర్లు గుర్తుకు రావటంలేదు.
అప్పటికి నేను అప్పుడప్పుడే రాస్తున్నాను.
కొంచెం ఆలస్యంగా సభ ప్రారంభమవటంవల్ల కార్యక్రమము ఎవరికి వారే ఆలస్యం అవుతుందంటూ త్వరపడసాగారు. చివరిగా ముగ్గిరికి అవకాశం ఇవ్వబడింది. అందులో నేను ఒకణ్ణి . ఇప్పుడిప్పుడే రాస్తున్నా నని నన్ను నేను పరిచయం చేసుకొని " వసంతమా ఎపుడొచ్చావు" అనే కవితను చదివాను.

వసంతమా ఎపుడొచ్చావు నువ్వు??

అప్పటిదాకా భయపెట్టిన చలి
దుప్పటి దులిపి పారిపోతున్న వేళ
చికురాకుల వగరు తిన్న కోయిల
కుహు కుహు రాగాలాపన చేస్తున్న వేళ
చేదునింపుకున్న వేప తేనెలొలుకు పూలై విరబూస్తున్న వేళ
వచ్చిందంట వసంతం
దాని వర్ణన కవులకే సొంతం
అనుభూతి ఓ అనంతం

యంత్రాలవలె కదలికలతో వాహనాలరొదలలో
క్షణం కోసం అనుక్షణం పోరాడుతూ
కాలంవెనుక వడివడిగా పరిగెడుతున్న వేళలో
గ్లోబునంతా జేబులొ పెట్టాలని
సాప్ట్‌వేర్ హార్డ్‌వేర్ అంటూ
కొత్తవేళ్ళూనుతున్న తరుణంలో
ఓ వసంతమా ఎపుడొచ్చావు నీవు?
ఎవరు గమనించారు నిన్ను
అందుకే అంటాను
నీవు కవులకే సొంతమని

వెండితెర తారల తళుకు బెళుకులతో
నెట్‌లోని బ్రౌసింగు రూములలో చాటింగులతో
పబ్‌లలో హంగుల పొంగులతో
హోరెత్తించే బీటులోని నోటులతో
నూతన విరామాన్ని ఆనందాన్ని వెతుక్కుంటున్న సమయయంలో
ఓ వసంతమా ఎపుడొచ్చావు నీవు?
ఎవరు గమనించారు నిన్ను
అందుకే అంటాను
నీవు కవులకే సొంతమని

సస్యశ్యమలమనిపించే సీమలో
కాలే కడుపుతో బక్కచిక్కిన రైతు
నీవు వస్తావని సిరులెన్నో తెస్తావని
ఎదురుచూస్తున్న సమయంలో
పుట్లునింపాలని పట్టెడాశతో
పుస్తెలనమ్మి ఎరువేస్తే
వరదొచ్చి పురుగొచ్చి కరువొచ్చి
వెన్నుపై వెన్ను విరిచిన వేళ
ఓ వసంతమా ఎపుడొచ్చావు నీవు?
ఎవరు గమనించారు నిన్ను
అందుకే అంటాను
నీవు కవులకే సొంతమని

నిన్నెరిగిన వారు నీకై స్పందించినవారు
నిన్నాశ్వాదించిన వారు
నీతో నడవలేక నవతరంతో ఇమడలేక
మమతల కరువై వెతల బ్రతుకై
కాలం పొరలమాటున దాగిన జ్ఞాపకాలను
నెమరేసుకుంటున్న తరుణంలో
ఓ వసంతమా ఎపుడొచ్చావు నీవు?
ఎవరు గమనించారు నిన్ను
అందుకే అంటాను
నీవు కవులకే సొంతమని

ఉన్నత విద్యా సాధనలో
సుదూరతీరాలకు నిచ్చనవేసే ఆరాటంలో
భాషా సౌదర్యాన్ని గాలికి వదిలేసి
సబ్జెక్టులతో సెట్తులకై కుస్తీ పడుతూ
నిరంతరం అవిశ్రాంతంగా పోటీపడే
తాపత్రయంలో నిమగ్నమైపోతుంటే
ఓ వసంతమా ఎపుడొచ్చావు నీవు?
ఎవరు గమనించారు నిన్ను
అందుకే అంటాను
నీవు కవులకే సొంతమని

మానవత్వాలు మరచి
బంధాలు పొడి బారిపోతున్న వేళ
వలస బ్రతుకుల మధ్య మనిషి
వ్యాపార వస్తువైపోతూ
వర్గవర్గాలుగా విడివడిపోతున్న వేళలో
ఓ వసంతమా ఎపుడొచ్చావు నీవు?
ఎవరు గమనించారు నిన్ను
అందుకే అంటాను
నీవు కవులకే సొంతమని
----
ఎవరికి వారే త్వరగా వెళ్లిపోవాలనే ఆత్రంలో ఎవరు విన్నారో అని నాకు కొచెం అనుమానంగానే వుంది మనసులో. సభ అయ్యి బయటికి వచ్చినప్పుడు మొట్టమొదటిగా ఎవరో నన్ను పిలిచారు ఆశ్చర్యానికి లోనై వెనుతిరిగి చూసాను. తెల్లటి చొక్కా కుడి బుజంనుంచి వేల్లాడుతున్న చంచితో కంపించే జ్వాలముఖి. కొద్ది ఆగితే ఆయన నాలుగు అడుగులు వేసి నన్ను కలిసి భుజంపై చెయ్యివేసి హాట్స్ ఆఫ్ టు యువర్ పోయం అని భుజం తట్టారు. కొచెం ఆశ్చర్యం, కొచెం ఆనందం వుక్కిరిబిక్కిరిచేస్తుండగా కొత్తగా రాస్తున్నట్టులేదు, మంచి వరవడివుంది రాస్తూవుండు అని భుజం తట్తారు జ్వాలాముఖి. ఆయనిచ్చిన ఆ స్పూర్తితో నేనూ రాయగలను అనే నమ్మకం కుదిరింది. రాస్తూ పోయాను.
విజయవాడలో 24 గంటల కవిసమ్మేళనం జరిగింది అందులో పాల్గ్నటానికి రాష్ట్రం నలుమూలనుంచి వాచ్చిన కవులను కలుసుకోవటానికి నేను వెళ్లాను. అక్కడ చాలామందిని కలిసాను అప్పుడే నాకు స్ఫూర్తినిచ్చిన జ్వాలాముఖితో చాలా సమయం గడపటం జరిగింది. అప్పటికి నేను రాసిన "హసీనా" దీర్ఘ కవిత ముద్రించాలనే ప్రయత్నంలో వుండి జ్వాలాముఖిని ముందుమాట రాయమని కోరాను. బాగున్నదని అన్నారుకాని ఎందుకో పరిచయవాక్యలు రాయలేదు. ఆయన అభిప్రాయం లేకుండానే హసినా పుస్తకరూపం దాల్చింది.

జ్వాలముఖి ప్రసింగించే తీరు, అనర్ఘలం ఎంతైనా అనుకరించాలని మనసులో కోరికకలుగుతూనే వుంది ఇప్పటికీ.

ఒకసారి చిక్కడపల్లి లైబ్రరీలో ఎవరిదో పుస్తకావిష్కరణకు వెళ్ళాను. అక్కడ వెనుకగా వచ్చి భుజంతట్టి అభినందనలు తెలియచేసారు. ఎందుకని అడిగాను ఓ పుస్తకచేతికిచ్చి చూడమన్నారు. అది సాహిత్య ప్రస్థానం. అందులో ఆయన రాసిన వ్యాసంవుంది తర్వాత చదివిచెపుతాను అని చెప్పాను. అయితే నేను చూడమన్నది అది కాదు అని పేజీలు తిప్పమన్నారు. అందులో నేను రాసిన ఒక కవిత ముద్రింపబడింది. చాలా ఆశ్చర్యం.

Labels: ,

Thursday, January 1, 2009

నూతన సంవత్సర శుభాకాంక్షలు

నూతన సంవత్సర శుభాకాంక్షలు

Monday, December 29, 2008

డిసెంబరు నెల నేలా వెన్నెల

చలా కాలంగా బ్లాగు సరిగా రాయలేకపోతున్నాను.
చాలా కార్యక్రమాలలో పాల్గొనలేకపోతున్నాను. రకరకాల కారణలు.

పుస్తక ప్రదర్శనకని బయలుదేరాను, కానీ వెళ్ళలేకపోయా. చివరికి నెలనెలా వెన్నెల హాజరయ్యాను. దిల్‌షుక్‌నగర్, చైతన్యపురి, న్యూ మారుతి నగర్ లో జరుగుతుంది. ఇదివరలో ఆస్మాన్ ఘడ్‌లో జరిగేది. రోడ్డుకు కొంచెం దగ్గరగావుండేది. అయినా రామచంద్రపురంనుండి వెళ్ళే నాకు దగ్గరేమిటి దూరం ఏమిటి. నేను వెళ్ళే సరికి కొంతమంది అప్పటికే వచ్చివున్నారు. ఒబ్బిని, ధర్మాచారి, నాగార్జున, కె.వి. రమానాయుడు, మొహనరెడ్డి, వారి మిత్రుడు, ప్రార్వతిమోహన్, లలితకుమారి శిలాలోలిత ఇలా.

పలకరింపులు అయ్యాక ఈ మద్య కాలంలో మనల్ని వదిలిపెట్టివెళ్ళిన సాహితీమిత్రుల్ని ఒక్కసారి గుర్తు చెసుకుంటూ మౌనం పాటించారు. ఒబ్బిని తన కవిత్వ పటనాన్ని ప్రారంబించారు. ఇంతలో ఇంద్ర ప్రసాద్, మరికొద్దిసేపటికి అద్దేపల్లి రామ్మొహన రావు వచ్చారు. అద్దేపల్లి జ్వాలముఖితో వున్న సాన్నిహిత్యాన్ని, జ్ఞాపకాలను నెమరేసుకున్నారు,

ఎప్పటిలాగే తన శ్రీకాకూళపు మాండలీకంతో విరుపుల, రాజశేఖరీయం అనే గల్పికను చదివి వినిపించారు.

శిలాలోలిత ఈమద్యకాలంలో దూరమౌతున్న సాహితీ మిత్రులను తలపోస్తూ ఏమైపోతున్నారు వీరంతా అంటూనే ......

ఈ మద్య తనకు ఆకాశవాణి జాతీయంగా ఎన్నుకున్న కవితను చదివి వినిపించారు.

వాళ్ళంతా దేహాన్ని విడిచారు
రాలిపడ్డ పూలల్లా వాళ్ళ అక్షరాలు
ఆ జ్ఞాపకాలను సమికరించుకుంటూ
దేహం అశశ్వతమని
అక్షరాల పూలే శాశ్వతమని చేదు గుళికలు మింగుతూ
రూప రహితులైన వారి జ్ఞాపకాలను
చమర్చుతున్న కన్నీళ్ళను అదిమిపడ్తూ ఆర్దత పొలమారుతుంటే
వాళ్ళ అక్షరాల వూత కర్రతో
ముందుకు మున్ముందుకు సాగిపోదాం!


మరోకవితలోని కొన్ని పాదాలు
" బ్రతుకు కంటే స్వేచ్చ గొప్పది
స్వేచ్చంటే బాధను చుట్తుకున్న పొర చేదింపబటమే
" అంటారు

మోహన రెడ్డిగారు తనకవితను వినిపించారు.
అద్దేపల్లిగారితో వచ్చిన ఆయన శిష్యుడు స్వియరచనా పాటలని పాడివినిపించారు.

నడిచే పుస్తంకగా మేము పిలుచుకొనే రామనాయుడు కొన్ని కవితలను, దిగంబర కవిత్వంలో తనకు బాగా గుర్తున్న వాక్యాలను వినిపించారు

అన్నా!
నీ గాయాలపైనుండి వీచిన గాలి ఎరుపెక్కింది
నువ్వు ఆసరచెసుకున్న బొడ్డుమల్లె ఎరుపెక్కింది
నువ్వు పడ్డచోట భూమి కూడా ఎరుపెక్కింది
ఇంకో మాట విన్నావా
నువ్వు కొట్తిన బాణం దెబ్బకు గాలికూడా ఎరుపెక్కింది


ఇక నావంతు వచ్చేసరికి నాదగ్గార నేను రాసినవి ఏమిలేకపోవడంవల్ల, ఇమద్యకాలంలో నాకు నచ్చిన "పొద్దు" లో వచ్చిన చదరంగం - ఒరెమునా(చావా కిరణ్) అనే కవితను చదివి వినిపించాను.

మరో ఉదయం అస్తమించింది,
రాతిరి చీకటిని తలుచుకుంటూ
కన్నీటి ప్రవాహం సాక్షిగా,
యద రోదన సాక్షిగా,
నిరాశ, నిస్పృహ, నిర్లిప్త,
నిజ శరీర సాక్షిగా


మరో ఉదయం అస్తమించింది.
రాతిరి చీకటిని తలుచుకుంటూ.
తుఫానులో కలిసిపొయిన వారి జ్ఞాపకాల సాక్షిగా,
విరిగిన తెరచాప, మరుగయిన నీరాహారాల సాక్షిగా,
అనుచరులందరి అయోమయ చూపుల సాక్షిగా,
ఓటమిని గుర్తుచేస్తున్న సముద్రం సాక్షిగా,

మరో ఉదయం అస్తమించింది.
రాతిరి చీకటిని తలచుకుంటూ.
మరో ఉదయాగమనం,
రాతిరి పరిమళాలతో
నవ్వుల జల్లుల సాక్షిగా,
యద కేరింతల సాక్షిగా,
ఆనంద, మాధుర్య, సగర్వ,
సమ్మోహ స్వ శరీర సాక్షిగా



మరో ఉదయాగమనం,
రాతిరి పరిమళాలతో
కోమలి చెవిలో గుసగుసలాడుతుండగా,
దేవదూత రెండు కొత్త రెక్కలు తొడుగుతుండగా,
సూర్యుడు పంపిన ఏడు గుర్రాలు వేచిచూస్తుండగా,
వర్షం వెలసిన అందమైన అడవి పిలుస్తుండగా,
మరో ఉదయాగమనం.
రాతిరి పరిమళాలతో.

జీవితం ఎప్పుడూ ఇంతే,
ఒక కిటికీలో మోయలేని విషాదం
ఒక కిటికీలో భరించలేని ఆనందం."


ఇక లలితకుమారిగారు బాల సాయిబాబాపై రాసిన భక్తి పద్యాలను వినిపించారు, ముద్రితమైన పుస్తకాన్ని అందరికి పంచారు. చివరిగా అద్దేపల్లి ప్రెష్‌ష్ష్...........
కురగాయలు బహుళ కంపెనీలుగా మారిపోవడన్ని వినిపించారు.

తేనీరు సేవించి అందర్మూ ఒకరికొకరు నూతనసంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటూ శెలవు తీసుకున్నాము. బహుముఖాలుగా సాగిన ఈ సాహిత్య సాయంకాలం సుమహారంగా మారింది.

నిర్వహించిన సి.వి.కృష్ణారావుగారి మోములో కొత్త నందివర్దనం విరిసింది

Labels:

Tuesday, December 23, 2008

క్రీస్తు జయంతి విశ్వమానవాళికి శాంతి

క్రీస్తు జయంతి విశ్వమానవాళికి శాంతి

లోకరక్షణార్థమై జన్మించిన యేసు క్రీస్తుని తోడు, వెలుగు మనందరి జీవితాలలో వెలుగొందు గాక!

శుభాకాంక్షలు... శుభాకాంక్షలు అందరికి

Labels:

Tuesday, December 16, 2008

జ్వాలాముఖి ఇక లేరు


ఎన్నడూ గర్వించాల్సిందీ లేదు
ఎన్నడూ కృంగి పోవలసిందీ లేదు
చదరంగం ఆట అయిపోయిన తర్వాత
రాజు, భటులు చేరేది ఒకే పెట్టెలోకే కదా!

ఆటలోని మెళకువలు, తీరుతెన్నులు మార్గదర్శకాలౌతూనే వుంటాయి

Labels: ,

Monday, December 15, 2008

jvaalaa mukhi ఇకలేరు


http://www.andhrajyothy.com/mainshow.asp?qry=/2008/dec/14main20

Labels:

Monday, December 1, 2008

గాయం ... సలుపెడుతుంది....

ఈ మద్య నేను నా సహచరుణ్ణి కోల్పోయాను. నిజానికి అతను నా చుట్టుతిరుగుతున్నప్పుడు, నాతోనో వుంటున్నప్పుడు అతణ్ణి నా సహచరుడుగా గుర్తించలేకపోయాను.
ఓ రోజు హటాత్తుగా వురిపెట్టుకొని చనిపోయాడనే వార్తను సెల్లుపోను నా చెవిలోకి జారవిడిచినప్పటినుంచి, నా హృదయాన్ని కుదిపేస్తుంది.
ఈ మద్య ఎప్పుడో ఆత్మహత్యలగురించి రాద్దమని చాలా విషయాలను సేకరించాను కాని నా వ్యక్తిగతము, సమయ చిక్కబట్టుకోలేక రాయలేకపొయా. రాసివుంటే బహుశ నా సహచరుడుకి వుపయోగపడెదేమో అనే సందేహం పీడిస్తుంది.
అలోచనలతో మస్తిష్కం వేడెక్కుతోంది, ఈ లోగా అవకాశాన్ని చూసుకొని ఎటునుంచి లోనికిదూరిందో క్రిమి (వైరస్) జ్వరమై పీడిస్తుంది. ఈ జ్వరంలో పలవరింతలు, భయాలు, ఒకొక్కటిగా దాడిచేస్తున్నాయి. నా దేహాన్ని నిర్వీర్యం చేయడానికి దొరికే ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవాలని చూస్తోంది. నా సహచరుణ్ణి ఆర్థింకంగా వుచ్చులోబింగించి తనుకుతాను దూరంగా పారిపోవాలనే ఆలోచను రేకెత్తించి, బంధాలను బాద్యతలను నిర్ధాక్షణ్యంగా వదిలేసి వెళ్ళిపోయాడు. రోజూ చూపులతొనో, మాటలతోనో వేధించే తన సగభాగానికి పూర్తి బాద్యను నెట్టేసి పారిపోయాడు.
తను పారిపోయిన పిరికితనంలో నాకూ భాగస్వామ్యం వుందా?? అనే అలోచన ముల్లులా గుచ్చుకొని మరింత బాధిస్తుంది.
ఒక్కసారి లోనికి ప్రవేసించి రక్తంలొకి చొరబడ్డ వైరస్‌ను చంపడానికి చేస్తున్న ప్రయత్నాలలొ దేహం తూట్లు పదుతుంది.
దేహానికి కొత్తగాయమో, అంగచ్చేదనమో అవసరమౌతున్నాయి.

వైద్యంకోసంచేస్తున్న ప్రయత్నలూ నా దేహాన్ని బాదిస్తూనే వున్నాయి.
అయినా రేపటి ఉదయంకోసం నిరీక్షన, ఆసై ఎదురుచూస్తుంది.
ఏ జాములోనో కప్పిన మంచుపొరను చీల్చడానికి వేకువకిరణం ఆరాటపడుతునేవుంది.
నా సహచరురుణ్ణి గుర్తించడమే కష్టమౌతుంది. మనసుపొరల్లోచి మేలుకొన్న మానవత్వమై నీకోసం ఎదురుచూస్తాను.
ఛేదు జ్ఞాపకాన్ని ఇచ్చిపోయావు, మరెవరికీ ఈ రుచిని చూడొద్దని ఎలుగెత్తి చెప్తాను.

Labels:

Friday, November 21, 2008

అప్పుడప్పుడు ఇలాకుడా జరుగుతుంది


నిన్న అనగా 20.11.2008 ఆధ్ర జ్యోతిలో రాధిక బ్లాగుపై వ్యాక్య వచ్చింది, కానీ పొరపాటున నాబ్లాగు లంకె ఇవ్వడంవల్ల కొద్దిగా నా బ్లాగులోకి సందర్శకులు వచ్చరని వ్యూ స్టట్ ను బట్టి తెలుస్తుంది

నిజానికి ఈ నొక్కులు రాధిక "స్నేహమా" బ్లాగుకు చెందవలసినవి.

ఆంధ్రజ్యోతివారు ఈ విషయం గమనించగలరు.

రాధిక గారికి అభినందనలు.

Labels:

Tuesday, October 28, 2008

వెలిగే దివ్వెలకోసం యుద్ధమే!



రేపెప్పుడో వెలిగించే దివ్వెలకోసం
సర్వసన్నద్ద యుద్ధం

ప్రతిరోజూ వూడ్చే చీపురుదూరని మూలల్లో
పొందిగ్గా గూడేర్పరచుకున్న
పురుగులతో చిన్న యుద్ధమే!

వెలుగుచూపు కొత్తదనంకోసం
వేసే సున్నపు చినుకులకోసం
ఖాళీచేస్తున్న గదులు
దించుతున్న చిత్రపటాలతో ఓ యుద్ధమే!

చిందరవందరైన వస్తువుల మద్య
ఎప్పుడో పోయిందనుకున్న
పుస్తకమో వస్తువో కళ్ళకెదురైనప్పుడు
తేలికైన దేహానికి దొరికే ఆనందంలో
ఆదమరచిన ప్రియులతో ప్రచ్చన్న యుద్ధమే!

సదురుతున్న షెల్పుల్లోంచి
హటాత్తుగా ఎగిరొచ్చిన వూహల్లా
ముందుపడ్డ పాత ఫొటోలు
లాక్కుపోతున్న అనుబంధాలు
పరుచుకున్న జ్ఞాపకాలను
మూసివేయడమూ ఓ యుద్ధమే!

ఎన్నో యుద్ధాల జయాల ఆనందహేలలో
వెలిగే దివ్వెల పిల్లలనవ్వులు
విరజిమ్మే కాకరపువ్వొత్తులు

చీకటివేళను చీల్చడంకోసం
వెన్నెల నవ్వులను పూయించేందుకు
ఎన్ని యుద్ధాలైనా సిద్దమే నేను!
----
5116
----
దీపావళి అలంకరణకొసం పనిచేస్తూ ఫోనులో మాట్లాడిన సాహితీ మిత్రురాలు
శ్రీమతి రేణుకా అయోలా దీపావళి శుభాకాంక్షల ప్రేరణ

Labels:

Sunday, October 26, 2008

ఇది చదివారా ?? బ్లాగుల ప్రపంచం గురించి




Labels:

Friday, October 24, 2008

మంచిమాట

సముద్రంలో నీళ్ళెన్నివున్నా

లోనికివస్తే తప్ప ఓడను ముంచలేవు.


అన్ని రకాలైన వత్తిడులు మనల్ని బాధించలేవు,

వాటిని లోనికి రానిస్తే తప్ప.




--- సేకరణ

Labels:

Friday, October 17, 2008

క్రైస్తవ్యంలోని మర్మమేమిటి ?? వెంటాడుతుంది.

మార్టీన్ లూథరు ఒక చర్చికి ఫాదర్ వుంటున్నపుడు మత ఆచారలపేరిట జరుగుతున్న వాటిపై ఒక రకమైన వ్య్తిరేకతను తెలియజేసాడు. ఆ వ్య్తిరేకత చివరికి తిరుగుబాటుగా మారి క్రైస్తవ్యంలో పెద్ద చంచలనాన్ని, మార్పును తెచ్చింది.
అక్కడే క్రైస్తవ మతం పేరిట రెండుగా చీలిపోయింది.
కాథలిక్, ప్రటెస్టంటులుగా విడిపోయి ఆచారాలలోను, వ్యవహారలలోనూ నమ్మ కాలలోను భిన్నత్వాన్ని ఏర్పరచుకున్నాయి.

Labels: , ,

Monday, October 13, 2008

క్రైస్తవ్యంలోని మర్మమేమిటి?? వెంటాడుతుంది - 3

క్రైస్తవ్యంలోని మర్మమేమిటి?? వెంటాడుతుంది - 3
ఇలా రాయవలసిన అవసరం వస్తుందని అనుకోలేదు.
నేను రాసిన విషయము చర్చగా పక్కదారి పడుతున్నందుకు ఈ టపాను రాస్తున్నాను.
1. మతపరమైన దాడుల వార్తలను చూస్తున్నప్పుడు నాకు మా తాత గారు గుర్తుకురావటం జరిగింది. ఆయన వ్యక్తిగతంగాను, కుటుంబంగాను, సామాజికంగాను పడిన అవస్థలు గుర్తుకు వచ్చాయి. అప్పుడు నాకేమనిపించిందంటే దాడులు జరగటమనేది నేడు కొత్తకాదు అని.
దాడుల జరుగుతున్న నేపద్యంలో ఆస్థులను కోల్పోతూ, అస్థిత్వాన్ని కోల్పోతూ కూడా క్రైస్తవ్యాన్ని నమ్ముకోవడంలో ఏదో మర్మం దాగివుందని నాకు అనిపిస్తుంది. అందువల్లనే తరువారి తరానికి అందించారు అని నాకు అనిపిస్తుంది.
మాలాగే హిందువులనుంచి అనేకులు క్రైస్తవులగా మారిన వారు, క్రైస్తవ వ్యాప్తికోసం, క్రైస్తవ సేవకోసం తమ ధనాన్ని, ఆస్తులను విరాళంగా ఇచ్చిన వారు వున్నారు ... అలా అస్తులను పంచీవ్వడంలో ఏదో మర్మం దాగివుందని నాకు అనిపిస్తుంది.
3. మత ప్రచారాన్ని గురించిగాని, మార్పిడులగురించి గాని నేను ప్రస్తావించలేదు.
సామాజికంగా వెనుక బడిన వారు మతం మారుతున్న నేపద్యాలవెనుక అర్థిక, సామాజిక, లౌకిక రాజ్య పర్థితులు వున్నాయి. వాటిని నేను చర్చించడంలేదు.
4 నాకు లేఖరాసిన బ్లాగుమిత్రుడు ఇచ్చినవివరాలు, గణాంకాలు నిజానిజలతో నా టపాకు సంబంధం లేదనిపిస్తుంది.
నేను రాసినది స్వీయానుభవంనుండి నా భావన. అది గణాంకలతో కొలిచేది కాదు. మిత్రుడు రాసినది తన ఇంతకుముందు రాసిన టపాకు కొనసాగింపు. రెండు టపాలు క్రైస్తవ్యానికి సంబందించినవే అయినా విభిన్న పార్శ్వాలకు చెందినవి. ఒకచోట ముడివేయడం సరైయిన పద్దతి కాదేమో!
5. నేను మా తాతనుండి మా పిల్లవరకూ జరుగుతున్న క్రైస్తవ మార్పులను రాద్దామని మొదట అనుకున్నాను కాని పక్క దార్లు పడుతున్న వాదనలు, అభిప్రాయలకు కొంచెం కలతచెంది విరమించుకోవాలనుకుంటున్నాను.

ఏది ఏమైనా క్రైస్తవాన్ని స్వికరించి వడుదుడుకులకు, కాల వత్తిళ్ళకు నిలదొక్కుకుంటూ క్రైస్తవ్యాన్ని వ్యక్తిగతంగా, కుటుంబపరంగా నిలుపుకోవడంలో ఏదో మర్మం (సీక్రెట్) దాగివుందనే నా బలమైన నమ్మకం.

----
4829

Labels: , ,

Friday, October 10, 2008

క్రైస్తవ్యంలోని మర్మమేమిటి?? వెంటాడుతుంది - 2

ముందు రాసిన టపాకు వచ్చిన అభిప్రాయాలు, నాతో మాట్లాడిన స్నేహితుల మాటలను దృష్టిలో పెట్టుకొని మొదటి టపాకు కొనసాగింపుగా రాస్తున్నాను.
నా స్నేహితుల మద్య నడచిన సంభాషణల్లో క్రైస్తవ్యంలోకి జేరటంవల్ల ఆర్థికమైన సహాయం లబిస్తుంది అని అంటారు. అది ఎంతవరకు నిజం అనేది ప్రశ్న?
నాకు నా అనుభవంలో అది నిజంకాదనిపిస్తుంది. మా మాన్న, పెదననాన్నలు మిషనరీల దగ్గర పెరిగినప్పటికి స్వయం పాలనను, వ్యక్తిగత స్వేచ్చను వారికి నానమ్మ నేర్పిందనిపిస్తుంది. కేవలము ఒక సామాజికమైన దన్నుకోసము, పిల్లలను చదివించాలనే లక్ష్యముతో మిషనరీల వద్ద పనిచేసింది కాని వారిజీవితాలను మిషనరీలపై ఆధారపడెటట్లు చెయ్యలేదు. తన ఆర్థిక వెసులుబాటుకోసం లేసులు అల్లేది (అప్పట్లో ఉభయగోదావరి జిల్లాలలో లేసులు అల్లి ఇంగ్లాండుకు ఎగుమతి అయ్యేవి), కలుపు పనులకు, కోతలకు, నాట్లకు వెల్లేది. నాన్న రెవెన్యూ డిపార్టుమెంటులో ఉద్యొగంచేసారు. వారి సర్టిఫికెట్లలోగాని పిల్లమైన మా సర్టిఫికిట్లలోగాని "కులము" అనేది ఎక్కడా పేర్కొనలేదు.
నేను యవ్వనంలో ఈవిషయాన్ని చాలా సార్లు ప్రతావించినప్పుడు బైబిలులోని కొన్ని వాక్యాలను చెప్పేవారు "ఎవడైనను క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి. పాతవి గతించెను ఇవిగో సమస్తమును కొత్తవాయెను" ఈ వాక్యమును ఉదహరిస్తూ మనమిప్పుడు క్రీస్తును కలిగియున్నాము కాబట్టి మనము నూతనమైన వారము మనకి కులంతో ఏమి పని అనేవారు. వేదాంతపరంగా అది బాగున్నట్లు అనిపించినా తన వుద్యొగ ధర్మంలో తరచూ జరిగే బదిలీలలో అద్దేఇల్లు దొరకటం కష్టంగానేవుండేది. చాలా సార్లు ఊరిచివర్లోనో, కొత్తగా కడుతున్న ఇళ్ళలోనో వుండటం నాకు గుర్తు.
ఇక పోతే ఏడుగురు పిల్లలకు ప్రభుత్వంనుండి వచ్చే ఏరాయతీలకోసం ఆశించలేదు, కడుపు కట్టుకొనో అవసరాలను తగ్గించుకొనో, పస్తులు వుండో పిల్లలను చదివించారే తప్ప ప్రభుత్వ రాయతీలవైపు చూడలేదు. దానిక వెనుక దాగిన గొప్ప విశ్వాసమేదో నాకు ఇప్పటికీ అంతు పట్టడంలేదు.
ఒక్కడిగా వున్న మా తాతకు కలిగిన ముగ్గురు పిల్లలనుండి ఇరవైరెండు మంది పిల్లలుగా వృద్ది చెందడం, ప్రతివొక్కరూ చదువుకోవటం వారి పిల్లలు మరింత వున్నతమైన చదువులవైపు వెళ్ళడం ఆ నమ్మకంలోని ఆశీర్వాదమే అంటారు. ప్రస్తుతం ఎదురయ్యే సమస్యలో అద్దె ఇల్లు దొరకటం అనేది పెద్ద సమస్య.
నమ్మకము, విశ్వాసాల మద్య సాంఘికమైన అవరోధాలు, అవమానాలు ఎదురౌతూనేవున్నాయి.
బలవంతంగా క్రైస్తవ్యంలోకి మారుస్తున్నారనేది మరొక అపవాదు. ఏది ఏమైనా క్రైస్తవులుగా మారటం ఒక సవాలే !
ఎన్ని జరుగుతున్నాఏదో ఒక కులాన్ని ఆశ్రయించి సాంఘిక లబ్ది పొదటం అనేది జరలేదు. ఇప్పుడు మాకుటుంబాలలో అన్ని రకాలైన కులాలనుండి వచ్చిన వారు వున్నారు.
మేమంతా క్రీస్తులో పాలి భాగస్తులమే అనేది మా అవగాహన. సామజికంగా ఎదురయ్యే ఇబ్బందులను దృష్టిపెడితే ఎటూ చెందని వారముగా మిగిలిపోతామేమో?

Labels: , ,

Wednesday, October 8, 2008

క్రైస్తవ్యంలోని మర్మమేమిటి ?? వెంటాడుతూనే వుంది

ఏదో బ్లాగుల్లో రాసేయాలని ఒకటే తపన. ఏమిరాద్దామన్న ఎటూ తేలని ఆలోచనలు సతమతం చేస్తునే వున్నాయి. మతంపేరుతో జరుగుతున్న దాడులు కలవర పెడుతున్నాయి. ఇవేవీ కొత్తకాదు అనిపిస్తోది.

అప్పుడెప్పుడో సుమారు ఓ వంద సంవత్సరాల పూర్వం మా తాత (నాన్న గారి నాన్న) క్రైస్తవ్యంలో ఏమినచ్చిందో ఒక్కసారిగా ఆచారాలను, కుటుంబాన్ని కాదని క్రైస్తవ్యంలోకి దూకాడు. అది సరైనదికాదని ఎందరో నచ్చచెప్పడానికి చేసిన ప్రయత్నాలన్నీ వృదా అయ్యాయి. అప్పటికి బ్రహ్మచారిగా వున్న తాతకు పిల్లను ఇవ్వటానికి చుట్టుప్రక్కల గ్రామాలలో నిరాకరించారు. దేశమేమీ గొడ్డుపోలేదంటూ అప్పటి మిషనరీల సాయంతో అప్పటికి ఐదవ తరగతి చదివిన మరో హిందూ కులంనుంచి క్రైస్తవ్యంలోకి వచ్చిన అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. తన బందువులమద్య, గ్రామంలోనూ ఇబ్బందులు మొదలయ్యాయి. కొన్ని తగాదాలు, పంచాయీతీలతర్వాత వూరినుంచి వెలివేసారు. అయినా తనకు సంక్రమించిన ఆస్తి అయిన 25 ఎకరాల పొలంలో ఒక పాకవేసుకొని జీవనం మొదలుపెట్టారు. వారికి వ్యవసాయంలో సాయానికి కూలీలు రాకుండా కట్టడి చేయబడింది. అయినా దేనికీ వెరవకుండా జీవనం సాగిస్తునే వున్నారు. వారికి ముగ్గురు మగ పిల్లలు కలిగారు. తనకు ముందు మూడు నాలుగు తరాలలో ఒకొక్కరే సంతానంగా వుంటూ వచ్చారు. తనకు ముగ్గురు మగసంతానం కలిగే సరికి మురిసిపోయేవాడట మా తాత గారు. తగ్గాయనుకున్న దాడులు మళ్ళీ మొదలయ్యాయి. ఇల్లు తగుల బెట్టబడింది. పాడి పశువులపై దాడి జరిగింది ఆ దాడిలో గాయపడిన తాతయ్య మళ్ళీ కోలుకోలేదు. చివరి మాటగా ఈ గ్రామంలో వుండవద్దు, ఎక్కడికైనా వెళ్ళి పిల్లలను చదివించు అని చెప్పి శాస్వత నిద్రలోకి జారిపోయారు. మా తాతగారి మాటను, ముగ్గురు పిల్లలను తీసుకొని ఆ గ్రామానికి దూరంగా వెళ్ళిపోయింది. తన ఐదవ తరగతి చదువు అక్కరకొచ్చింది. తనకంటూ ఎవ్వరూ లేని స్థితిలో మిషనరీలే అన్ని తామై ధైర్యానిచ్చారు. తనకు తెలిసిన లేసు అల్లికలతో, మిషనిరీల దగ్గర పనిచేస్తూ ముగ్గురినీ చదివించింది. పాతికెకరాల పొలంకోసం ఎప్పుడూ వెనుతిరిగి చూడలేదు. అందులో చివరి వారు మా నాన్న.
ఇవన్నీ అలోచిస్తున్నప్పుడు ఏ నిఘూఢ మర్మం నమ్మకం వెనుక దాగివుంది అనే అనుమానం కలుగుతుంది. జీవితాన్ని, జీవనాన్ని, ఆస్తులను పణంగా పెట్టడానికి వెనుకాడని మర్మం ఎమైవుంటుదనే సందేహాన్ని నేను వెతుకుతూనే వున్నాను.

4354

Labels: , ,

Tuesday, September 30, 2008

నెలనెలా వెన్నెలలో ....


శ్రీ సి.వి.కృష్ణా రావు, శ్రీ అమ్మంగి వేణుగోపాల్, శ్రీ నిశాపతి

శ్రీ నాగార్జున, శ్రీ ధర్మాచారి, శ్రీ జాన్ హైడ్ కనుమూరి

Labels:

Friday, September 26, 2008

స్వయంవరానికి కొత్త అర్థం చెప్పిన - శశికళ



http://www.andhrajyothy.com/navshow.asp?qry=/2008/sep/26navya2

http://epaper.andhrajyothy.com/AJ/AJyothI/2008/09/26/index.shtml


మీరు చదివారా??...
ఈరోజు నవ్యలో...

Labels:

Tuesday, September 23, 2008

వ్యసనాన్ని మానటం ఎలా??

వ్యసనాన్ని మానటం ఎలా అని తరచు అడిగే కొందరికి నేనిచ్చిన సూచనలను ఇక్కడ పెడ్తున్నాను.
మొదట వ్యసనానికి అలవాటుకు మద్య తేడాను గుర్తించాలి
వ్యసనం వ్యక్తిగతంగా, కుటుంబపరంగా జరిగే మార్పుల ప్రభావాన్ని గుర్తించాలి
వ్యక్తిగత దృఢ సంకల్పంతో పాటూ మిత్రుల, కుటుంబీకుల సహకారం అవసరం.
వ్యసనాన్ని మానాలనుకున్నప్పుడు దాని తీవ్రతను గుర్తించాలి. తీవ్రతను బట్టి ఒక్కసారిగా మనాలా లేక అంచలంచలుగా మనాలా అనేది నిర్ణయించుకోవాలి.
వ్యసనం ప్రభావాన్ని చూపే సమయాన్ని గుర్తించాలి. ఆ సమయంలో జరిగే శారీరక, మానసిక పరిణామాలను గుర్తించాలి, దానికి అణుగుణంగా వైద్య సహకారాన్ని పొందటానికి వీలు కలుగుతుంది. సమయాలను గుర్తించడం ద్వారా మనల్ని మనం నియంత్రించుకోవాడానికి, ఆ సమయాలను అదుపుచేసుకోవడానికి వీలుకలుగుతుంది
నేను మానాలనుకున్నప్పుడు చాలా సంఘర్షణకు లోనయ్యాను. సుమారు 4 సంవత్సరాలు పట్టింది.
ఈ సమయంలో నా ప్రక్కటెముక ఇచ్చిన సహకారం మరువలేనిది.


-----
4204

Labels:

Friday, September 19, 2008

ప్రపంచం నలుమూలల నుంచి చదువుతున్న వారికి ధన్యవాదములు


బ్లాగుల ప్రపంచంలోకి దూరి నడుస్తూ నడుస్తూ అప్పుడే 15 నెలలు గడిచాయి. ఒక్క శాతంకూడా అర్థం కాలేదు

బ్లాగులంటే ఓ నిర్లిప్తత, నిరాశ, అసహనం... ఇలా కొన్ని భావనలు మీద పడుతున్న తరుణంలో నేనెందుకు బ్లాగాలి అని అన్పించింది. అదే విషయాన్ని టపాగా రాసినప్పుడు ఓ మిత్రుడు ఇచ్చిన సూచనమేరకు స్టాట్ కౌంటర్ను పెట్టి నాలుగు నెలలు అయ్యింది. అదే నిరాశ/చికాకుతో ఈ మద్య శెలవలు కూడా ప్రకటించుకున్నాను.

కానీ ఈ మద్య స్టాట్ కౌంటర్‌ను చూస్తున్నప్పుడు ఎవరెవరు, ఏ ఏ ప్రాంతాలనుండి చూస్తున్నారో అర్థం అయ్యింది. నచ్చినా నచ్చకపోయినా, అభిప్రాయాల్ని రాసినా రాయకపోయినా చూస్తున్నారన్న విషయం సుస్పష్టం. అందుకే నాకు నేనే కొత్త వుత్సాహాన్ని నింపుకొని నా పద్దతిలో ఎవరు చదివినా, ఎవరు చదవకపోయినా, ఎవరు తమ అభిప్రాయాల్ని తెల్పినా, తెలుపకపోయినా నా అనుకూలాన్ని బట్టి, నా ఆలోచనా సరళి బట్టి రాస్తూనే పోవాలని నిర్ణయించుకున్నాను.
---------
4119

Labels:

Tuesday, September 16, 2008

నెల నెల వెన్నెల ...సెప్టెంబరు 2008

శ్రీ సి.వి. కృష్ణారావు గారి నిర్వహణలో
నెల నెలా వెన్నెల
ఈ నెల సెప్టెంబరు 28, ఆదివారము
సమయము : సాయంకాలము 5.30 గంటలనుండి
స్థలము : శ్రీ సి. వి. కృష్ణారావు
103, బాబూ టవర్స్, క్రైస్థవ ప్రార్థనా మందిరము ఎదురుగా,
మారుతీనగర్ క్రాస్ రోడ్స్,
చైతన్యపురి, హైదరాబాదు-500 060.
ఫోను : 24044262

ప్రత్యేక స్వీయ కవితా పఠనము
జాన్ హైడ్ కనుమూరి

మరియు
అందరి స్వీయ కవితా పఠనము.

అందరూ ఆహ్వానితులే
---------
నా కవిత్వ ప్రయాణంలో ప్రత్యేకమనుకున్న వాటిని చదవాలనుకుంటున్నాను.
అందుకే మిమ్మల్ని ఈ ప్రత్యేక సమయం కోసం ఆహ్వానిస్తున్నాను

జాన్ హైడ్ - సెల్ +9912159531

Labels:

Tuesday, September 9, 2008

నా బ్లాగుకు సెలవులు ... కొన్నిరోజులు


కొన్ని అనివార్య కారణాల వల్ల

చాలా రాయాలని వున్నా రాయలేకపోతున దృష్ట్యా

నా బ్లాగుకు కొన్ని రోజులు శెలవులు ప్రకటించడమైనది

Labels:

Friday, August 29, 2008

అక్క - తమ్ముడు - చెల్లి - - జ్ఞాపకాల అల


ఆమెవరోగాని తన తమ్ముణ్ణి తలచి
జ్ఞాపకాల పొరల్లోంచి
అలికి సుద్దముగ్గులెట్టిన అరుగుపైకి
బాల్యాన్ని లాకొచ్చి కూర్చోబెట్టింది

కన్రెప్ప అంచున జారనున్న అనుభూతుల మంచు బిందువులు
ఏటవాలు లేలేత కిరణాలుతాకి
కొత్త రంగులు చిప్పిల్లుతున్నాయి

ఇంకో ఆమె ఆశ ఒక్కసారిగా పెల్లుబికిన క్షణంలో
అడ్డున్న సముద్రమేలేకుంటే
కారు తిన్నగా
అరుగుల లోగిలివైపు మళ్ళేది కదా! అంటుంది

జిల్లేడుకాయ పగిలినట్టు ఆలోచనలు
దూదిపింజాన్ని అంటుకున్న జ్ఞాపకాలు
చేతులు పైకెత్తితే అందనంతగా
చేతులు చాపితే దొరకనంతగా
ఒకొక్కటిగా ఎగురుతూనే వున్నాయి
నీతో నాకేంపనంటూ
ఎగరలేనితనాన్ని భుజాన భారంగావేసుకొని
అక్కడే పడిపోతున్నాయి మరికొన్ని.

ముగ్గుల్లోని చుక్కల్లా
వెన్నెలరాత్రుల్లో లెక్కపెట్టిన చుక్కల్లా
కళ్ళముందు మెరుస్తున్నాయి

ఆవుపేడతో ఇల్లు అలకడంకోసం
పాలేర్లు తొలుకెళుతున్న ఆవులవెనుక
మనతో పాటే పోటీపడే పిల్లల్ని తోసుకుంటూ
పోగుచేసిన పేడ మోయడం చిత్రమే కదా!

నువ్వు మూడు నేను ఒకటి చదువుతూ
అందమైన కలగా ఆడిన ఆటలో
నువ్వు డాక్టరై నేను కాంపౌండరై
ఇచ్చిన పాతమందుల్ని మింగిన పిల్ల
నురగలుకక్కుతూ విలవిలలాడినప్పుడు
వీధి వీధంతా ఇంటిపైకొస్తే
మన వీపులపై బెత్తం నాట్యమాడిన గుర్తులు
ఆ పిల్లతో ఆడుకొనేవరకూ
సలుపెడుతూనే వుండేవి కదూ!

బడిలోపెట్టే ఉప్మాముందు
పాడిన ప్రార్థనాగీతం
పంతులమ్మగారి పిల్లలంటూ
చూపే ప్రత్యేక ఏ పదాలకు దొరుకుతుంది?

వీధిచివర్న నూతిప్రక్క
రామయ్య వెలిగించిన
దీపస్థంబంపై కిరోసిన్‌దీపం చుట్టూచేరి
వెన్నెల జలతారు పరదాలమాటున
ఆడిన ఆటలు గుర్తొస్తున్నా
వీరివీరి గుమ్మడిపండంటూ
ముక్కుగిల్లుడు
కుంటుకుంటూ పట్టుకోవడం
అవ్వా! పచ్చా అంటూ చేతులు కలిపి
వూరేగిన వూరేగించిన నేస్తాలు
మనతో ఆడినవారి
పోలికలో పేర్లో గుర్తురావటంలేదెందుకని?

దాళ్వాయో సార్వాయో
పనులకోసం వలసకూలీలు
వాళ్ళ వెనుకేవచ్చి
రాత్రివేళ నెగడువేసి
రోజుకో కథో కళారూపమో ప్రదర్శించిన వాళ్ళు
ఎప్పుడైనా నా కలలోకొచ్చి
పలుకరిస్తారని ఎన్నిసార్లు ఎదురుచూసానో!

కొంచెం పెరిగిన తరగతులమద్య
బడిపక్కనుండే టూరింగు టాకీసు
రాత్రిచించిన టికెట్టు ముక్కలు
ఏరుకుంటూ... ఏరుకుంటూ...
ఏ లెక్కల్ని నేర్చుకున్నామో!
అందులోచూసిన 'రక్తసంబంధం' ఏమినేర్పిందో! ఎలాచెప్పాలి?

కొండదారిలో పులి తిరుగుతుందని
బడికెళ్ళే దారిలో గట్టుపైనున్న కుంకుడుచెట్టుపై
దెయ్యముందనే పుకార్లు
ఆ పక్కే సుబ్రహ్మణ్య గుడిలో
నాగిని మహత్యాల కథలు
దేనికీ భయపడని మన స్నేహ అనురాగబధం
బరువెక్కిన గుండెతో
ఇప్పుడెందుకో పదే పదే పలవరిస్తోంది

గోదారి వారగా వెళ్తూ
ఏటవాలు కొండపై గుర్తులు దాటుతుంటూ
రామలక్ష్మణ వనవాస కథల్నెన్ని నేర్చుకున్నామో?

ఇప్పుడు అలా వెళ్ళి
గోదారొడ్డున పిచ్చుకగూళ్ళను కట్టి
పిల్లగాలి అలలతో ఎగిరే చేపపిల్లల్ల్ని
ఒడుపుగా విసిరితే చిల్లపెంకులేసే కప్పగంతుల్ని
ఇసుకతెన్నెల్లో ఏరిన ఆల్చిప్పల్ని
పెరడులో కోసిన గొబ్బిపూల లేలేత సౌరభాల్ని
ఈ వెన్నెల్లో ఆరబోసి ఏరుకుందాం!

నా అనుబందపు తొలిస్నేహ హస్తానివి నువ్వే!
-------

అక్క మేరీ సలోమికి అంకితం

రాయాలని స్పూర్తినిచ్చిన రాధిక కవిత
తమ్ముడు
, అందులో నిషిగంద కామెంటు
నెనరులు
----
3936

Labels:

Tuesday, August 26, 2008

రెండు చందమామలు - సమీక్ష - ఆంధ్ర జ్యోతిలో




http://www.andhrajyothy.com/sunday/sundayshow.asp?qry=2008/24-8/newbooks

Labels:

Wednesday, August 13, 2008

కాల తపస్విని - చిన్న వివరణ


ఈగైవాలిన శబ్దం
చెవిలో రాగమై ధ్వనిస్తోంది
ఒక్కసారిగా
వాయుపుత్రుడు ఆవిష్కరించబడతాడు
ఆవిష్కరణకై
ఆత్మారామునికోసం వెదకుతుంటాను

సముచిత స్థానమివ్వని
ఏ రావణ సభలోనైనా
తోక సింహాసనమైపోతాను

అద్దరిన ఊరిస్తున్న
సంద్రాన్ని దాటడానికి
ఒక్కవుదుటన వుద్విగ్నుడనౌతాను

మాటలు
ముష్ఠిఘాతాలుచేసి
ముష్కరుల మట్టుబెట్టబోతాను

ఏ రాక్షసత్వమో దాచిన రహస్యాన్ని
ఛేదించిన
ఋజువేదో తేవాలనిచూస్తాను

జీవంకోసం వెదకులాటలో
సంజీవినేదో అర్థంకాక
ఎదురయ్యే పర్వతాన్నే ఎత్తుకొస్తాను

కాలం నడుస్తున్న దారిలో
సర్వకాల తపస్వినై
వీరోచిత విజయునికోసం
ఎదురుచూస్తుంటాను

శాశ్వతమైపోవాలని
శిలా విగ్రహాలు నిలిపినా
అనంతవిశ్వయానంలో
ఏ మణిహారంలో ఇమడలేక
అగోచర అణువై మిగిలిపోతాను

అంకురంకోసమో
నా ప్రతిబింభంకోసమో
ఒక్కసారిగా గుండెల్ని చీల్చి చూడలేక
యాతన పడుతుంటాను.
----
రాగి లోహ లక్షణము మనసు వుందనిపించింది. అధిక వేడిమికి, విద్యుత్తు ప్రవాహానికి తట్టుకుంటుంది. బంగారంతో కలిసినప్పుడు బంగారానికే కొత్త గుణాన్ని ఆపాదిస్తుంది, బంగారంతో సమానమైన విలువను పొందుకుంటుంది. రకరకాల పాత్రలు పోషించే ఈ రాగిని అలానే వదిలేస్తే తన సహజత్వాన్ని మరచి కిలుము పడుతుంది. దాన్ని ఏదైనా సిట్రిక్ యాసిడ్ కలిగిన పదార్దములతో తోమినప్పుడు కొత్తమెరుపును తెచ్చుకుంటుంది.
---
వ్యక్తిగతంగా నేను కొన్ని అపజయాలు, వత్తిడులు, అవమానాలతొ కృంగిపోతున్నప్పుడు పై వాక్యాలు నన్ను ఆలోచింపచేసాయి. సరిగ్గా అప్పుడే వాయుపుత్రిని కథలు ఒకొక్కటిగా మనసులో మెదిలాయి. తనకు కలిగిన అపార శక్తియుక్తులను ఎన్నడూ తనలొ వున్నట్టుగా వుండడు. కానీ అవసరసమయాలలో ఇతరుల ప్రోస్తాహంతో వాటిని వెలికితీసి ఆశించిన దానికంటే ఎక్కువగానే చేసుకొస్తాడు. సరిగ్గా ఇక్కడే నా ఆలోచనలు మలుపు తిరిగాయి. అవి నాలోచి నాలోకి ప్రయాణించాయి. సస్యలనుండి, పరిస్థితులనుండి నాకు నేను బయటకు రావడానికి దారిచూపాయి.
అందులోచి కలిగిన కొన్ని భావాల చిత్రాల రూపమే ఈ కవిత.

ప్రతీ మనిషిలో ఒక వాయుపుత్రుడు అజ్ఞాతంగా దాగివుంటాఅడు. వాణ్ణి వెలికితీయగలిగినప్పుడు ఎదురయ్యే సమస్యలను సునాయాసంగా దాటవచ్చు.
వాయుపుత్రిని ఎదురైన విభిన్న సమయాల పరిస్థితులను నేనైతే ఎలా ఎదుర్కొంటాను అనే ఆలోచనకు ప్రతిరూపం ఈ కవిత. ఆయన ఎదుర్కొన్న పర్థితులు, సమయాలు, నేను ఎదుర్కొనే సమయాలు పరిస్థితులు వేరైనప్పటికీ ఎదుర్కొనే మూలం మాత్రం ఒక్కటే అనిపిస్తుంది.

నేను నా వ్యసనం అనే సమస్యనుండి బయటకు రావటానికి ఈ ఆలోచనలు బాగా సహకారి అయ్యాయి.
---
ఈగైవాలిన శబ్దం
చెవిలో రాగమై ధ్వనిస్తోంది
ఒక్కసారిగా
వాయుపుత్రుడు ఆవిష్కరించబడతాడు
ఆవిష్కరణకై
ఆత్మారామునికోసం వెదకుతుంటాను

సముచిత స్థానమివ్వని
ఏ మైరావణ సభలోనైనా
తోక సింహాసనమైపోతాను
మైరావణ సభలో దూతగా స్థానమివ్వకపోయే సరికి తన తోకతోనే ఉన్నతమైన ఆసనాన్ని తయారుచేసుకొని కూర్చొన్నాడు. అప్పుడప్పుడు తగిన స్థానం ఇవ్వని పరిస్థితుల్లో మనకు మనమే సింహసనాన్ని ఆవిషరించుకోవాలి. దానికి తగిన ఆత్మ విస్వాసాన్ని కలిగివుండాలి ప్రోది చేసుకోవాలి.

---
అద్దరిన ఊరిస్తున్న
సంద్రాన్ని దాటడానికి
ఒక్కవుదుటన వుద్విగ్నుడనౌతాను
లంకలోకి వెళ్ళి సీత జాడకనుక్కోవటం అసలు విషయమే అయినా ఎలా వెళ్ళటం, ఎవరు వెళ్ళాటం అనేది పెద్దమీమాంశ. ముందడుగు వేయకపోతే అదే సముద్రాన్ని చూస్తూ వుండిపోవలసిందే.

---
మాటలు
ముష్ఠిఘాతాలుచేసి
ముష్కరుల మట్టుబెట్టబోతాను
లంకలోకి వెళ్ళాలంటే సునాయాసమేమి కాదు కొందరితొ పోరాడాలి అవి మాటలే కావొచ్చు, మనుషులే కావొచ్చు ముష్టి ఘాతాలకు సిద్దంగా వుండాలి. ముష్టి ఘాతాలో, మాటల ఘాతాలతోనో సిద్దంగా లేకపోతే మనల్ని నివీర్యం చేయడానికి మనచుట్టూ ప్ర్యత్నాలు జరుతూనే వుంటాయి.
---

ఏ రాక్షసత్వమో దాచిన రహస్యాన్ని
ఛేదించిన
ఋజువేదో తేవాలనిచూస్తాను

రాక్షసత్వం దాచిన రహస్యం సీత. చేధించడం సులువేమీ కాదు. అయినా చేదించి ఋజువును తేవటం కస్ఠమేమీ కాదు.

జీవంకోసం వెదకులాటలో
సంజీవినేదో అర్థంకాక
ఎదురయ్యే పర్వతాన్నే ఎత్తుకొస్తాను

క్లిష్టసమయలో సంజీవిని వెతకలేక మొత్తం పర్వాతాన్నే ఎత్తుకు రాగలగటం ఒక ఉద్విగ్న ఘట్టం.

కాలం నడుస్తున్న దారిలో
సర్వకాల తపస్వినై
వీరోచిత విజయునికోసం
ఎదురుచూస్తుంటాను

త్రేతాయుగాన్ని దాటి, ద్వాపరయుగంలో జరిగే సంగ్రామం కోసం, విజయుడు(అర్జునుడు) వచ్చేదారిలో ఎదురుచూడటం, నిరీక్షించడం చాలా కటినమైనదే. విజయుడు మనల్ని పోల్చుకున్నా పోల్చ్కోలేకపోయినా, విజయుడు ఇదే దారిలో రావటం మాత్రం నిశ్చయం.


శాశ్వతమైపోవాలని
శిలా విగ్రహాలు నిలిపినా
అనంతవిశ్వయానంలో
ఏ మణిహారంలో ఇమడలేక
అగోచర అణువై మిగిలిపోతాను

ఇక చివరిగా తనకోసం ఇచ్చిన మణిహారంలో రాముణ్ణి వెదకడం అత్యంత పరాకాష్ట.
అంకురంకోసమో
నా ప్రతిబింభంకోసమో
ఒక్కసారిగా గుండెల్ని చీల్చి చూడలేక
యాతన పడుతుంటాను.
ఒక్క సారి గుండెల్ని చీచి చూడగలిగితే దైవ స్వరూపం మణిహారాలలో కాక హృదయ అంతః సీమల్లో దర్శనమిస్తాడు.
అలా వెదకలేక జీవితమంతా యాతన పడుతూనే వుంటాము.
----
3798

Labels:

Monday, August 11, 2008

రేణుక అయోల కవిత్వము - కథలు



Read this document on Scribd: 31-32 renukaayola 10 8 08

కథలగురించి రాద్దామనుకున్న సమయంలో కవిత్వంపై వార్త ఆదివారంలో సమీక్షవచ్చింది.
అనుభూతుల దొంతర

ఆన్ లైనులో ఇక్కడ చూడొచ్చు

----

ఈ మద్య "రెండు చందమామలు" ఓ కథలపుస్తకాన్ని చదివాను.
ఇందులో పదమూడు కథలువున్నాయి. అందులో వున్న ఒక కథ రెండు చందమామలు. దాన్నే పుస్తకానికి పేరుగా పెట్టారు.
కథలు అన్నీ ఏదొక సందర్భంలో బహుమతి పొందినవే.
భూమిక, చినుకు, జాగృతి,ఆంధ్రభూమి, ఆంధ్రప్రభ ఆదివారం, నేటినిజం పత్రికలలో వివిధ సంద్భలాలో వచ్చాయి.
సరళమైన భాష, క్లుప్తత వుండటంవల్ల చదివించేవిగా వున్నాయి.
ఈ సంపుటిలోని కథలన్నిటిలోనూ ఏదో ఒక సమకాలీన సమస్యను చిత్రించడానికి రచయిత్రి ప్రయత్నించింది. చాలా కథల్లో స్త్రీ సమస్యలే ఎక్కువగా వున్నయి. కథల్ని సంభాషణాత్మకంగా నడిపించడంద్వార కథల్లో పఠణీయత పుష్కలంగా వుంది.

"రెండు చందమామలు"
రచయిత్రి : రేణుకా అయోలా
ఫ్లాట్ 210, భాగ్యష్రీ అపార్ట్‌మెంట్స్
స్టీట్ నం. 14, లేన్ నం. 2
తార్నాక, సికింద్రాబాదు -500 017
ఫోను : 040- 27158743

Labels:

Friday, August 8, 2008

కాల తపస్విని

ఈగైవాలిన శబ్దం
చెవిలో రాగమై ధ్వనిస్తోంది
ఒక్కసారిగా
వాయుపుత్రుడు ఆవిష్కరించబడతాడు
ఆవిష్కరణకై
ఆత్మారామునికోసం వెదకుతుంటాను

సముచిత స్థానమివ్వని
ఏ మైరావణ సభలోనైనా
తోక సింహాసనమైపోతాను

అద్దరిన ఊరిస్తున్న
సంద్రాన్ని దాటడానికి
ఒక్కవుదుటన వుద్విగ్నుడనౌతాను

మాటలు
ముష్ఠిఘాతాలుచేసి
ముష్కరుల మట్టుబెట్టబోతాను

ఏ రాక్షసత్వమో దాచిన రహస్యాన్ని
ఛేదించిన
ఋజువేదో తేవాలనిచూస్తాను

జీవంకోసం వెదకులాటలో
సంజీవినేదో అర్థంకాక
ఎదురయ్యే పర్వతాన్నే ఎత్తుకొస్తాను

కాలం నడుస్తున్న దారిలో
సర్వకాల తపస్వినై
వీరోచిత విజయునికోసం
ఎదురుచూస్తుంటాను

శాశ్వతమైపోవాలని
శిలా విగ్రహాలు నిలిపినా
అనంతవిశ్వయానంలో
ఏ మణిహారంలో ఇమడలేక
అగోచర అణువై మిగిలిపోతాను

అంకురంకోసమో
నా ప్రతిబింభంకోసమో
ఒక్కసారిగా గుండెల్ని చీల్చి చూడలేక
యాతన పడుతుంటాను.
----
3727

Labels:

Thursday, August 7, 2008

నాకింట్లోనే భయం వేస్తుంది.. డాడ్!! - మళ్ళి అభినందనలు

టపా మరొకసారి, అభిప్రాయాలు చదువుతున్నప్పుడు "గీతాంజలి"సినిమాలోని ఓ సన్నివేసం గుర్తుకు వచ్చింది. హిరోయిన్ తనకున్న వ్యాధి గురించి తెల్సీ సంతోషంగా వుండటంకోసం ప్రయత్నిస్తూనే వుంటుంది. కానీ ఓరోజు రాత్రి తండ్రి దగ్గరకి వచ్చి చచ్చిపోతానని భయమేస్తుంది నాన్నా అంటుంది.
---
నా అమ్మాయికి చిన్నతనంలో కలిగిన చిన్న అనారోగ్యం వల్ల అన్నిటికీ భయపడుతుంది.
గోడమీద బల్లిని చూస్తే భయం, రాత్రిపూట బయటవున్న టాయిలెట్‌కు వెళ్ళాలంటే భయం, ఇలా పెద్ద లిస్టువుంది పరీక్షలంటే భయం.
వీటికి తోడుగా మావీధిలో జరిగిన సంఘటన భార్యభర్తల తగువులాటలలో భ్యార్యను రోకలి బండతో కొడితే తలపగిలి చనిపోయింది. ఒక్కసారిగా దబ్బున పడిపోతూ పక్కనేవున్న పిల్లాడిపై పడి పిల్లాడుకూడా చనిపోయాడు గది అంతా రక్తమయం. అది చూసిన మా అమ్మాయి చాలా రోజులు భయాన్నుంచి తేరుకోలేదు.
అదే సమయంలో తన స్నేహితురాలి అక్క మెడిసెన్ కౌన్సిలింగుకు వెళ్ళివస్తూ యాక్సిడెంటులో చనిపోయింది. అది కూడా చూసి మరింత భయానికి లోనయ్యింది.
చాలా బాగా చదువుతుంది కానీ పరీక్షలొచ్చేసరికి అంతా భయం, భయం.
అమ్మాయికి అమ్మ దగ్గర కంటే నా దగ్గరే ఎక్కువ చనువుగా వుండటంవల్ల, తరచూ భయాన్ని పోగొట్టటానికి కౌన్సిలర్‌గా మారాను.

అందుకే ఈ టపా చదువుతున్నప్పుడు మా అమ్మాయిలు గుర్తుకొచ్చారు. కానీ ఈ భయాలు వ్యక్తి గతమైనవీ, మానసికమైనవి.
వీటికి సామజికమైన(జీవన సరళి) భయం తోడైతే జీవితం దుర్భరంగా అనిపిస్తుంది. అనేక జీవితాల్లోకి చాపకిందనీరులా వ్యాపించి మానవ సంబంధాలను నాశనం చేస్తుంది.
----

ఒక విషయాన్ని చదువుతున్నప్పుడు, వేరేది చదివినదో, జరిగినదో, చూసినదో గుర్తు రావటం అనేది ఒక మంచి రచనా లక్షణం.
అందుకు మరోసారి అభినందనలు.
----
సంభాషణాత్మకంకా సాగిన కథలు అరుదుగా చదివిన గుర్తు(కథలు చదవటమే తక్కువ), , నిన్నటినుంచి ఎవరికథలు చదివానా అని బుర్ర గోక్కుంటున్నా ఒక్కటి గుర్తు రావటంలేదు
-----
ఈ మద్య కలర్స్ చానల్‌లో "ఖతరోంకి కిలాడి" అని ఒక ప్రొగ్రాం వస్తుంది. అందులో ప్రముఖ మోడల్స్ కొంతమంది పాల్గొంటున్నారు. వారి స్లోగన్ "జో ఢర్‌గయా ఓ ఘర్ గయా".
భయానికి మరో పేరు "ఫోభియా" అన్ని భయాలు ఒకేలా వుండవు. కొన్ని భయాలు వంశపారంపర్యగా వస్తాయట. కాని నిత్యం నడుస్తున్న దారిలో కళ్ళెదుటే జరిగేవాటికి జీవనం భయమయం అయినప్పుడు జీవితం ధైర్యానికి కొత్తనిర్వచనాల్ని వెతుక్కోవలసిందే.
----

నాకింట్లోనే భయం వేస్తుంది.. డాడ్!!
టపా చదివిన తర్వాత మీతో పంచుకోవాలనిపించి ఈ కొన్ని మాటలు

---
ఇంటర్మీడియెట్ చదువుతున్న మా అమ్మాయిలు అప్పుడప్పుడూ ఎదోరకమైన భయంగురించి చెబుతానేవుంటారు.
వాళ్ళతో మాట్లాడుతున్నట్టే అనిపించింది.

---
సంభాషణాత్మకంగా కథను నడిపించడం గొప్పటెక్నిక్ అనిపిస్తుంది నాకు. అందులోనూ ఫోనులో మాట్లాడుతూ కథను నడిపించడం, వర్తమానంలోంచి గతంలోకి, గతంలోంచి వర్తమానంలోకి సమాజాన్ని, విషయాన్ని నడిపించడం. అందులో విజయవంతమైన కథనంగా చెప్పవచ్చు.
---
పూర్ణిమకు అభినందనలు

Labels:

Wednesday, August 6, 2008

నాకింట్లోనే భయం వేస్తుంది.. డాడ్!! - అభినందనలు

ఈ మద్య కలర్స్ చానల్‌లో "ఖతరోంకి కిలాడి" అని ఒక ప్రొగ్రాం వస్తుంది. అందులో ప్రముఖ మోడల్స్ కొంతమంది పాల్గొంటున్నారు. వారి స్లోగన్ "జో ఢర్‌గయా ఓ ఘర్ గయా".
భయానికి మరో పేరు "ఫోభియా" అన్ని భయాలు ఒకేలా వుండవు. కొన్ని భయాలు వంశపారంపర్యగా వస్తాయట. కాని నిత్యం నడుస్తున్న దారిలో కళ్ళెదుటే జరిగేవాటికి జీవనం భయమయం అయినప్పుడు జీవితం ధైర్యానికి కొత్తనిర్వచనాల్ని వెతుక్కోవలసిందే.
----

నాకింట్లోనే భయం వేస్తుంది.. డాడ్!!
టపా చదివిన తర్వాత మీతో పంచుకోవాలనిపించి ఈ కొన్ని మాటలు

---
ఇంటర్మీడియెట్ చదువుతున్న మా అమ్మాయిలు అప్పుడప్పుడూ ఎదోరకమైన భయంగురించి చెబుతానేవుంటారు.
వాళ్ళతో మాట్లాడుతున్నట్టే అనిపించింది.

---
సంభాషణాత్మకంగా కథను నడిపించడం గొప్పటెక్నిక్ అనిపిస్తుంది నాకు. అందులోనూ ఫోనులో మాట్లాడుతూ కథను నడిపించడం, వర్తమానంలోంచి గతంలోకి, గతంలోంచి వర్తమానంలోకి సమాజాన్ని, విషయాన్ని నడిపించడం. అందులో విజయవంతమైన కథనంగా చెప్పవచ్చు.
---
పూర్ణిమకు అభినందనలు
----
3618

Labels:

Monday, August 4, 2008

ప్రభాతగీతి

ద్యానమాలిక – 1

జలము ఆకాశము చుంబించడానికి వంగినప్పుడు, లేలేతకిరణాలతో మెరుస్తున్న సముద్రం కొత్త వేణుగనాన్ని మోసుకొస్తున్నప్పుడు ఈ తీరం వద్దనే నిలబడి ఉదయభానుడి వెలుగురేఖల్ని పట్టుకోవలనే గాఢమైన కొర్కెతో హృదయం ఉప్పొంగి గాన కెరటాలై ధ్వనిస్తోంది. ఎగసిపడుతున్న ధ్వని రాగాల కోర్కెతో అలై ఎగసిపడుతుంది. ఎగసిపడే ప్రతీ అల విరిగిపడుతుందా? విరిగిన ప్రతి అల ఉగసిపడుతుందా?

పక్షుల కువకువలు వినిపిస్తున్న ప్రభాత గీతిలో పాదాలను ముద్దాడుతున్న నురగలు నాయకునికి దారితొలగేందుకు ఆజ్ఞ కోసం ఎదురుచూస్తూంది. విశ్వాస దేహాన్ని నీటీలలపై నడిపించేందుకు ఆహ్వానం పలుకుతుంది. అడుగు కదిపితే పాదంకింద నేలను కోస్తున్న కెరటాలు పాదాల్ని భయపెడుతూనే వుంటాయి. భయాల మద్య కొట్టుమిట్టాడుతున్న జీవితానికి మరో వుదయం, మరో వుదయం నిరంతరం సాగిపొతుంది. విరిగిపడే కెరటాలు ఇంకా భయాన్ని పెంచుతాయి. ఏడ్చి ఏడ్చి కన్నీళ్ళు యింకిపోతే దోసెడు నీళ్ళు దాహాన్ని తీర్చడానికి దొరకవు. జలాల్ని చీల్చడానికి వాడిన మోషే కర్రో, ఎలీషా దిప్పటో ఎక్కడో దాచబడివుంటుంది. ఆలలపై నడచివస్తున్న నీతి సూర్యుడు(యేసు) ఎన్నటికీ దప్పిగొనని జీవజలంతో ఇటే వస్తున్నాడు. మోస్తున్న పాత్రలో నింపుకోవలసిందే! పనికిరాని పాత్రలను పగులగొట్టాల్సిందే! సముద్ర జలాల్ని చీల్చుకొనో, నీటిపైనో ఒక్కడుగైనా నడవాల్సిందే. నడావాలంటే తడవాల్సిందే!

మరణం ఇరువైపులా దాడిచెయ్యాలని చూస్తున్నప్పుడు ఆరిన నేలను దర్శించడం నడచి సాగిపోవడం ఆశ్చర్యం. ఆశ్చర్యాలతో హృదయంనిండి పొంగిపారుతున్నప్పుడు స్తుతిగానాల గొంతు సవరించాల్సిందే! ఎదురయ్యే ప్రతి ఆనంద పరిమళం నాసికలకు తగులుతుంది.

సముద్రపు అలలుగా
సమస్యలు భయపెడుతున్నవేళ
సాగిపోవటానికి దారిలేదనుకున్నప్పుడు
ఎర్రసముద్రాన్ని రెండుగా చేల్చిన దుడ్డుకర్రవైపుచూస్తాను
నదిని పాయలుగాచేసిన దుప్పటికోసం వెతుకుతాను
నీటిపై మునిగే నా కోసం చాస్తున్న చేతిని అందుకుంటాను
ప్రవాహాలలో ఎదురీది సాగిపోతాను
అలలు అనుభవాలై నా గానంలో ఇమిడిపోతున్నాయి.

----
3580

Labels:

Monday, July 28, 2008

ఈ "బ్లాక్ ఇంక్" కథ చదివారా?? మీకోసం ఇక్కడ

బ్లాక్ ఇంక్
..... వినోదిని

సెల్లారంతా పిల్లలతో విరగబూసిన పూలతోటలా ఉంది. రకరకాల పిట్టలు అరుస్తున్నట్టు పిల్లల అరుపులు, ఆటలు, కేకలు - గోలగోల. బుల్లి బుల్లి సైకిళ్లు - తూనీగల్లా. తూనీగల మీద సీతాకోకచిలకల్లా పిల్లలు - జుయ్ జుయ్ మని. సడెన్ బ్రేకులు - నవ్వులు - విరగబడి, తుళ్లిపడి, పడీపడీ, పకాపకా. విచ్చుకున్న పువ్వులా మొహాలు. రాలిపడుతున్న పుప్పొడిలా నవ్వుల వెలుగులు.

స్సుర స్సుర టీ పొంగి స్టవ్వారిపోయింది.
ఒక చేతిలో టీ కప్పు - ఇంకో చేతిలో రిమోట్.
'కలిసి పాడుదాం' అంటూ పిల్లలతో కలిసి పాడుతున్న శోభన్‌బాబు ... 'బలిపీఠమా'...?
కాలింగ్ బెల్ బదులు వేళ్ల కణుపులతో శబ్దం - రిథమిగ్గా. పాటని మ్యూట్‌లోకి తోసి తలుపు తీశా.
సీతాకోకరెక్కల్తో నేసిన ఫ్రాకేసుకున్న పువ్వులా - పాప.
ఎనిమిదేళ్లుంటాయా?

కళ్లనిండా నవ్వు - ఉబికి ఉబికి వస్తోంది. పట్టనంత నవ్వుని నోట్లో కుక్కుకుని, ఇంకొంచెం నవ్వుని బుగ్గల్లో దోపుకొని ... బొటన వేలెత్తి రెండు పెదాల మధ్యకు తీసికెళ్తూ ... పువ్వు తిరిగి తాజాతనం పొందడానికి కొంచెం నీళ్లు చిలకరించుకోడాని కొచ్చినట్లుంది.
లోపలికి రమ్మన్నట్లుగా తలూపి ఫ్రిజ్ దగ్గరకు నడిచా - నా వెనకే తను ... పూరేకల పాదాలకు చుట్టిన పట్టీలు కూడా మెత్తగానే మోగుతున్నాయ్.
"ఆంటీ, ఆ పాట్ వాటర్ యిస్తారా?''
నోటి పూలగంపలోంచి ఓ నవ్వు పువ్వు తుళ్లి పడింది.
కళ్లల్లో చిన్న ఆశ ... చిన్న యిష్టం ... చాలా చిన్న అభ్యర్థన ...
నాకూ కుండకీ మధ్య మైలు దూరం ఉండి, ఆ మధ్యలో గులక రాళ్లుండి, నాకు చెప్పుల్లేకున్నా సరే - వెళ్లి నీళ్లు తెచ్చుండే దాన్ని.
వెంట వెంటనే రెండు గ్లాసులు తాగింది.

"థ్యాంక్యూ ఆంటీ ... గేమ్ మజ్జలో వచ్చేశాను'' గ్లాసు టీపాయ్ మీద పెట్టి - తలుపు బయట విప్పిన పొందికైన హై హీల్ పిచ్చుక గూళ్లల్లో పసిపావురాయి పాదాలను దోపి, రెక్కలు మొలిచిన డాల్ఫిన్‌లా ఎగురుకుంటూ, ఈదుకుంటూ మెట్లమీంచి సెల్లార్‌లోకి చేరిపోయింది.
పాప తాగిన గ్లాసు పక్కనే టీ కప్పు - వంగి తీసుకున్నా. ఛానెల్ మార్చా. బ్లాక్ అండ్ వైట్లో కుట్టి పద్మిని - కళ్లు తిప్పుతూ ... 'పిల్లలూ దేవుడూ చల్లని వారే... కల్ల కపట మెరుగనీ కరుణామయులే'' పాడుతోంది.

నా 'టీ' చల్లబడిపోయింది. టీ వేడిగానే తాగాలి. మళ్లీ టీ పెట్టుకున్నా ... వేడి వేడి టీ. కప్పులో పోసుకొనొచ్చి కూర్చోబోతుండగా మళ్లీ అదే శబ్దం - తలుపు మీద వేళ్ల కణుపులతో ...
బెలూన్లో గాలిలా ... బుగ్గల్లో నవ్వుతో మళ్లీ అదే చందమామ.
ఈ సారి చిటికెన వేలుని గోరు కన్పించేటట్లు పైకి లేపి రెండు కళ్ల మధ్య నిలబెడుతూ ...
ఈ సారి యిదన్నమాట ... నవ్వొచ్చింది. బాత్రూమ్ వైపు చెయ్యి చూపించా!
"జుజ్జెపుడూ లెట్రిన్‌లోనే వెళ్లాలి. బాత్రూంలో వెళ్లకూడదు. మమ్మీ చెప్పింది. ఇప్పుడు నేను లెట్రిన్‌లోనే వెళ్లా.''
వెన్నెల్లో ముంచి తీసిన రెండు పూరెక్కలకూ మధ్య తేనె చుక్కలద్దినట్లు కళ్లు - వాటి మీద వాలడానికి తటపటాయిస్తున్న రెండు కందిరీగల్లా దట్టమైన వెంట్రుకలతో కనురెప్పలు ... చెమట పట్టినట్టు మొహమంతా ... నవ్వు పట్టింది.

ఎప్పుడూ యిలా నవ్వుతూనే ఉంటుందా? పేరేమయి ఉంటుంది? హాసిని? హాస్య? హసిత? స్మైలీ...? " ఆంటీ, నేను కొంచెం సేపు మీ దగ్గరుండొచ్చా?''
ఊర్లో మా తాటాకు బాత్రూం దడిమీద అల్లుకున్న పచ్చని తీగ మీద పూసిన పసుపు పచ్చని సోయగాల బీరపువ్వు నడిచొచ్చి నా యీ కాంక్రీట్ కుటీరంలో తన పుప్పొడి చినుకుల నవ్వులతో నాతో గడుపుతానంటే వద్దనడం కూడానా ...?
"కూర్చో, నీ పేరేంటి?''
"శ్రియ, ఫోర్త్ బి''
"ఏ ఫ్లాట్?''
"మాది గాంధీనగర్ ఆంటీ. సెకెండ్ ఫ్లోర్ టూ జీరో టూలో మోహన్‌రావుగారు మా చినతాతగారు. అంటే మా డాడీకి చినడాడీ అన్నమాట. ఈ రోజు రేపు హాలిడేస్ కదా, ఇక్కడికొచ్చేశా. మోర్నింగ్ మా డాడీ దింపేసి వెళ్లిపోయాడు.''

ఒక కేబుల్ కనెక్షన్ ... వంద ఛానళ్లు.
"మీరు జాబ్ చేస్తారా ఆంటీ''
చెప్పాను. వివరాలు కూడా.
"ఇది మాకు స్కూల్ వదిలే టైం. నేను యింటికొచ్చేసరికే ఫోర్, ఫోర్ఫిప్టీన్ అయిపోతుంది. నేను యింటికి రాగానే ఫస్టు మా మమ్మీ హార్లిక్సిస్తుంది''
నేను టీ తాగి తనకి హార్లిక్స్ కలిపా.
మొహమాటపు రేపర్ చుట్టిన చాక్లెట్ నవ్వు!
రెండు చేతులతో జాగ్రత్తగా కప్పు పట్టుకొని చాలా యిష్టంగా తాగుతోంది. చివర్లో కొంచెం మిగిల్చి లేచి నిలబడి "అపాంగ్ జపాంగ్, బపాంగ్!!'' అంటూ అడ్వర్టయిజ్‌మెంట్లో పిల్లల్లా నడుమూ, చేతిలో కప్పూ తిప్పుతూ ...
చాలా నవ్వొచ్చింది ... గట్టిగా నవ్వాను.
నేనింకా నవ్వుతుండగానే నా కప్పు, తన కప్పు తీసుకెళ్లి సిింకులో పెట్టేసింది.

"ఏంటలా చూస్తున్నారూ? నాకు ఖాళీగా ఉండటం ఇష్టముండదు. ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూ ఉంటా. ఇంట్లో కూడా అంతే. ఎప్పుడూ మా మమ్మీకి హెల్ప్ చేస్తుంటాను ... సో ... నాకేదయినా పని చెప్పండి ...''
"చెప్తాలే, దా. ముందిటొచ్చి కూర్చో - మీ యింటి దగ్గర నీకు ఫ్రెండ్సున్నారా?''
"ఓ తరుణ్, ఆష్‌తోష్, లాలస ... యివి ఫ్రిజ్‌లో సర్దాల్సిన కూరగాయలా'' పొద్దున రిలయన్స్ నుండి తెచ్చిన కవర్లను చూపిస్తూ అడిగింది.
నవ్వుతూ కవర్లను ఫ్రిజ్ దగ్గరకు లాగా. ఇద్దరం అక్కడే చతికిలబడ్డాం.

పాప మాట్లాడుతూనే ఉంది. ఏ మాటా తనంతట తాను బయటకు రావడం లేదు. వెనకా ముందూ నవ్వుల కాన్వాయ్. కూరగాయల్ని ఆర్నమెంట్లుగా ఎట్లా ఉపయోగించొచ్చో చెబుతూనే పీలర్, చాకూ తీసుకొని వాటిని పూలనీ, పక్షుల్నీ చేయడానికి ఒకటే ప్రయత్నం.
ఫెయిలయితే దీనికి రెక్క విరిగిందనీ, దీనికో కాలు పొట్టలోనే ఉంది - ఆపరేషన్ చేసి బయటకు తియ్యాలని చమత్కరించింది. తను చెప్పే తీరుకి చాలా చాలా నవ్వొచ్చేస్తోంది. తట్టుకోలేనంత! నవ్వుకీ నవ్వుకీ మధ్య ఒక షార్ట్‌బ్రేక్ కూడా లేకుండా పోతోంది.
కూరగాయలు సర్దడం అయిపోయింది. తను లేచి నిలబడి నాకు చెయ్యందించింది. మీగడతో చేసినట్లు చేతివేళ్లు - ముట్టుకుంటే నా వేలి ముద్రలు పడతాయేమోనన్పించేంత నున్నగా, పారదర్శకంగా, సుకుమారంగా ... ఆ చెయ్యి వదలాలన్పించలా - నా స్పర్శ తనతో ఏం చెప్పిందో, తలెత్తి నా మొహంలోకి చూస్తూ నా నడుముని చుట్టేసింది.

పాలపువ్వుల్ని పూసిన పూలతీగలా పాప! నా మనసు పూరేకుల మత్తులో కూరుకుపోయింది.
నా గుండెల వరకే వచ్చిన పాప మునివేళ్ల మీద పైకి లేచి నవ్వుల బుగ్గల్లోంచి పెరుక్కొచ్చిన ఓ హాయి ముద్దుని పెదాల మీదకి లాక్కొచ్చి లేతలేతగా తడితడిగా నా బుగ్గమీద అద్దింది. అటు మనసూ, ఇటు శరీరం దూది మబ్బుల్లోంచి దూరి, నెలవంక అంచుల్ని పట్టుకుని "సీ - సా'' ఆడుతున్నాయి.
ఇద్దరం హాల్లో కొచ్చాం. నా చెయ్యి ఒకటి తన భుజం చుట్టూ తన చెయ్యి నా నడుం చుట్టూ.
"ఏం చేద్దాం?'' అడిగా.
"ఓ పని చేద్దాం! ఏదైనా పనిచేద్దాం!!''
బాల్కనీ లోంచి ఆరిన బట్టల్ని తెచ్చి దీవాన్ మీద వేసి మడత పెట్టడం మొదలుపెట్టాం. కర్చీఫుల్ని సమోసాల్లా మడత పెట్టి తలమీద పెట్టుకొని -
"హ్హే స్సమోస్సాలే .. స్సమోస్సాలూ ...'' అంటూ ఇల్లంతా తిరుగుతూ అమ్మింది.
రెండేసి ముద్దులకి ఒక సమోసా చొప్పున నేనే కొనుక్కున్నాను.

"అవునూ. నువ్వింక ఆడుకోడానికి వెళ్లవా?''
"ఊహూ ... మీతోనే ఉంటాను'' నవ్వుని గారాబంలో రంగరించి ...
"ఆం బీం బుష్'' అని ముద్దుకి ఓ రూపం తెప్పిస్తే అది ఈ పాపమొహం.
"అలాగే'' అన్నాను.
"ఇంకా ఏదైనా పని చేద్దామా?'' అడి గింది.
"ఓ పని చేద్దాం, ఏమైనా తిందాం'' అని, వంటింట్లోకి వెళ్లి నలుపలకల స్టీల్ సాసర్ నిండా గవ్వలు తెచ్చాను. వాటిని చూసి అడిగింది.
"మెగాస్టార్ ఫుడ్డా''
"ఏం? యివంటే ఆయనకిష్టవా?''

"ఊహు కాదు. చిరుతిండికి నేను పెట్టిన ట్రాన్స్‌లేషన్ పేరు''
ఇద్దరం పకపకా నవ్వుకున్నాం. తనకి ఏ మెగాస్టార్ ఫుడ్డిస్టమో లిస్టు చెప్పుకొస్తోంది.
మార్కెట్లో రంగురంగుల పూలు కుప్పలు కుప్పలుగా పోసినట్టు నవ్వుల పువ్వుల్ని నా యింటినిండా పోసింది. క్రిస్మస్‌రోజున మా యింటి సీలింగుకీ, గోడలకీ, తలుపులకీ, కిటికీలకీ వేలాడే రకరకాల డిజైన్లున్న రంగురంగుల కాగితాల్లా నా యింటినిండా ఈ పాప మాటలే అతుక్కొని గాలికి ఊగుతున్నాయి.
"ఆంటీ, ఆ సౌండేంటీ?'' పక్క ఫ్లాట్లోంచి గట్టిగా కసిగా తలుపులు బాదుతున్న శబ్దం వినబడి కనుబొమలు పైకి లేపుతూ అడిగింది.
"పక్కింటోళ్లు, వాళ్ల డాగుని లోపలబెట్టి లాక్ చేసి బయటికెళుతుంటారు. మళ్లీ వాళ్లు తిరిగొచ్చేవరకూ అది అలాగే చేస్తుంటుంది. కుక్కంటే ఎవరూ నమ్మరు. అచ్చం మనిషిలా ముందు కాళ్లతో తలుపునలా బాదుతూనే ఉంటుంది.''
"పాపం కదా. ఎందుకలా యానిమల్స్‌ని బాధ పెట్టడం?''
" .......'' ఏం చెప్పాలి?

"యానిమల్స్ బాధ పడితే నేనసలు చూడలేను. ఒకసారి ఏమయిందో తెల్సా ఆంటీ? నేను స్కూల్ నుంచి ఆటోలో వస్తున్నా. డ్రైవరంకుల్ అందర్నీ వాళ్లిళ్లదగ్గర దించేశాడు. నేను చివర్లో దిగుతానన్న మాట. ఇంకో ఫైవ్ మినిట్స్‌లో మా యిల్లు వచ్చేస్తుంది. గల్లీలోంచి వస్తుంటే ఒక పిగ్‌పిల్ల మా ఆటోకింద పడింది. దాని కాలు విరిగింది. ఆటో ఆపమంటే అంకులేమో 'ఫర్వాలేదు ... వెళ్లిపోదాం' అన్నాడు. నేను దెబ్బలాడి దానిని ఆటోలో ఎక్కించుకోని ... నా కర్చీఫ్‌తో కట్టు కట్టాను. ఒళ్లో పెట్టుకొని నారాయణగూడ హాస్పిటల్‌కి తీసుకెళ్లి డాక్టరు చేత కట్టు కట్టించాం. మళ్లీ తీసుకొచ్చి అదే గల్లీలో వదిలేశాం - వాళ్ల అమ్మ దగ్గర ...'' వెలుగు మొహంతో కాండిల్లా నిలబడి చెప్పుకుపోతోంది.
"మరి నువ్వు రాకపోతే మీ అమ్మ కంగారు పడలేదా?''
"ఎందుకూ? డ్రైవరంకుల్ సెల్‌ఫోన్లోంచి ఫోన్ చేసి చెప్పాగా?!''

"ఇంటికొచ్చాక ఆ పిగ్‌పిల్ల గుర్తొచ్చి డల్‌గా అన్పించింది. రాత్రి ట్వల్వ్ వరకూ కూర్చుని ఇదంతా డైరీలో రాశా...''
"యేంటీ? నువ్ డైరీ రాస్తావా?'' ఇంకేదో చెప్పబోతుంటే ఆపి కొంచెం ఆశ్చర్యంగా అడిగా.
"అవునాంటీ, నేను రోజూ డైరీ రాస్తా. నాకిది మా రాఘవ మామ నేర్పాడు. నాకు సిస్టర్స్, బ్రదర్స్ లేరుకదా, ఒక్కదాన్నే కదా. అందుకే డైరీతో షేర్ చేసుకుంటానన్నమాట...''
బయట చీకటి కమ్ముకుంటోంది. నా ఫ్లాట్‌లో మాత్రం ఈ మూడడుగుల నిలువు చందమామ వెన్నెల కురిపిస్తూనే ఉంది. చీకటిని చొరబడనివ్వకుండా వెలుగు నవ్వుల కర్రలు విసురుతూనే ఉంది.
పాప చెప్పేది వింటూనే కారట్ వేపుడు చేశా. పెరుగు చారు చేశా. కొంచెం ముద్దపప్పు చేశా - ఇవన్నీ పాపకి యిష్టమైన పదార్థాలని తెలుసుకొని.
"అన్నం తినేద్దామా?'' అడిగా.
"అప్పుడేనా? ఓ పని చేస్తా. నేను మీతో కల్సి భోంచేస్తానని మా నాన్నమ్మతో చెప్పి వచ్చేస్తా!''
"తొందరగా వచ్చెయ్''

రెండు నిమిషాల తర్వాత - వాకిట్లో చెప్పులిప్పి, ఆ ఏడేడు రంగుల ఇంద్రధనుస్సు ఒంటినిండా నవ్వుల తళుకులు అద్దుకొని అడుగుపెట్టింది. బుల్లి బొటనవేలు ఎత్తి చూపి "నా భోజనం మీతోనే'' అంటూ ఒక్క గంతులో నన్ను హత్తుకుపోయింది.
ఏదో సువాసన తన మీంచి నా మీదకు వస్తోంది. ఒంటి మీద నుంచి కాదు ఒంట్లోంచి. మనుషుల్ని తన వశం చేసుకొనే పరిమళమేదో పిల్లల ఒళ్లు సహజ సిద్ధంగానే వెదజల్లుతుందనుకుంటా. గుండెల్నిండా ఆ సుగంధ ద్రవ్యాన్ని పీల్చుకున్న పరవశంతో పాప నుదుటిమీద ముద్దుపెట్టుకున్నా. ఇద్దరం కిచెన్లో కెళ్లాం. గిన్నెలన్నీ హాల్లో టీపాయ్ మీదకు చేరవేస్తోంది.

చిన్నప్పుడు మా యింటి తాలూకు కప్పుల్లోంచి దూరొచ్చిన కాంతికిరణం మట్టినేల మీద వెలుగు సున్నాలా పడి - కొంచెం కొంచెం - జరుక్కుంటూ జరుక్కుంటూ వెళ్లినట్లు ఈ పాప తన వెలుగు పాదాలతో ఇల్లంతా కలియ తిరుగుతూ నా మనస్సంతా నులివెచ్చని వెలుతురు పూలని పూయిస్తోంది.
"రేపీవినింగ్ ఇంటికెళ్లగానే మీ గురించి కూడా నా డైరీలో రాసుకుంటా'' గిన్నెల్లో గరిటలు పెడుతూ ..."అవునూ నా డైరీ గురించి మీకో ఇంపార్టెంట్ విషయం చెప్పలేదు కదా?''
"ఏంటబ్బా'' ఫ్రిజ్‌లోంచి వాటర్ బాటిల్ తీసి తనకందిస్తూ అడిగా.
"నా కిష్టమైనవే బ్లూ ఇంకుతో రాసుకుంటా, నాకు నచ్చనివి ఇష్టం లేనివి బ్లాకింకుతో రాస్తా...''
"అంటే పిగ్‌పిల్ల గురించి బ్లాక్ ఇంక్‌తో రాశావా?''
"నోనో ... అది నాకు చాలా ఇష్టమైన పని... ఒకసారి మహిమ వాళ్లింటికెళ్లి వాళ్లమ్మ పెడితే టిఫిన్ తిన్నా ... అది బ్లాకింకుతో రాశా... ఈ బౌల్లో దేంటాంటీ...?''
"చికెన్. నిన్నటిది. ఫ్రిజ్‌లో ఉంటే తీశా''

"అదేంటి? మీరు నాన్‌వెజ్ తింటారా?'' చాలా ఆశ్చర్యంగా ... చాలా చాలా అనుమానంగా అడిగింది. తన ప్లేట్లో అన్నం పప్పు పెట్టి కొంచెం క్యారెట్ ఫ్రై వేశా.
"అవునూ ... ఏం?'' నా ప్లేట్లో అన్నం కొంచెం కొరివికారం పచ్చడి, రెండు చికెన్ ముక్కలు వేసుకుంటూ.
"మీరు బ్రామ్మిన్స్ కారా?'' కళ్లలో ఎప్పుడూ ఉండే నవ్వు చెప్పాపెట్ట్టకుండ ఎక్కడికో ఎగిరిపోయింది.
"కాదు''
"చౌదరీసా?''
"కాదు''
"మరి రెడ్డీసా?''
"ఊహూ ... కాదు.''
"మరి యింకెవరు?''
"దళిత్'' ఆ పిల్లతో ఏం చెప్పాలో ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు.
"అంటే .... వేరే హిందూసా?''
"కాదు. క్రిస్టియన్స్.''
"హరిజన్సా? అంటే మహిమా వాళ్లకి లాగా...?''

ఆరో తరగతిలో డ్రిల్లు మాస్టారు గ్రౌండ్లో పరిగెత్తమన్నప్పుడు చూపుడు వేలంత ముల్లు అరికాల్లో కసుక్కున దిగి కాడ దగ్గర విరిగిపోయింది. ఇప్పుడదే ముల్లు తిరిగొచ్చి రెండింతలై నా గుండెల్లో కసుక్కున దిగబడింది.
"ముందు అన్నం తిను...'' నేను అన్నం కలుపుకుంటూ అన్నాను.
"నిజం చెప్పండి, హరిజన్సేనా...?'' పాప మొహంలో రంగులన్నీ మాయమయ్యాయి. చిన్నగా బూడిదరంగు అలుముకుంటోంది.
"అవును ... అయినా యిప్పుడవన్నీ ఎందుకు? మనం ఫ్రెండ్స్ కదా, మనమధ్య అవన్నీ అవసరమా?''
"ఊ ... మా డాడీకి, మా మమ్మీకి హరిజన్ ఫ్రెండ్సే లేరు. నాక్కూడా లేరు. అసలు మాకు వాళ్లతో ఫ్రెండ్షిప్పే ఇష్టం ఉండదు. నా ఫ్రెండ్సంతా బ్రామ్మిన్స్, చౌదరీస్, రెడ్డీస్, వేరే హిందూస్ ...''

ఆకాశం అంచుల వరకు ఎగిరిన రంగుల గాలిపటం పుటుక్కున తెగిన చప్పుడు -
"నేనంటే నీ కిష్టమే కదరా ...'' నా చేతిలో అన్నం మెతుకులు నలిగిపోతున్నాయి.
"ఇష్టమే ...'' పాప మొహం వాంతి తన్నుకొస్తోంటే అతి కష్టం మీద ఆపుకున్నట్లుంది.
"మరి కూర్చో, అన్నం తిందాం''
కూర్చోలేదు పాప. అలాగే నిలబడి నా వైపు రెప్పవాల్చకుండా చూస్తోంది. లుకలుకమని తిరుగుతున్న తెల్లటి పురుగుల్ని చూస్తున్నంత అసహ్యం ఆ పిల్ల కళ్లల్లో.
"నానమ్మ పిలుస్తున్నట్లుంది'' గబగబా నడుచుకుంటూ బైట విప్పిన చెప్పుల్ని వేసుకొని పడిపోతుందేమో అన్నంత వేగంగా పరిగెత్తుకొని వెళ్లిపోయింది.
ఇందాకటి వెలుగుసున్నా భూతద్దంలోంచి నా గుండె మీద నిలబడిపోయింది.
గదినిండా పేరుకుపోయిన రంగు రంగుల సీతాకోకచిలకలు బొచ్చు పురుగులై నా మీదకు పాక్కుంటూ వస్తున్నాయ్!



ఆంద్ర జ్యోతి ఆదివారం అనుబంధం 27.7.2008

బ్లాక్ ఇంక్

http://www.andhrajyothy.com/sunday/sundayshow.asp?qry=2008/27-7/story

పెదరాయ్డు said...
ఆ పసి హృదయంలో నాటిన ఆ విషపు మొక్క తనంతటత తానే పెరుగుతుంటుంది. ఆ అమ్మాయి ఎందుకో తెలియని కుల కట్టుబాట్ల నుంచి బయటకు రావడానికి ఒక జీవిత కాలం పట్టొచ్చు.

-----
3498

Labels:

Monday, July 21, 2008

నీవు... నేను... ఒక ఏకాంతం


photo : khojhyderabad.com

నీవొచ్చేలోగా
నా వూహ
మబ్బుల పల్లకినెక్కి ఊరేగుతోంది


మనసు చేసే తొందర సవ్వడితో
మేనంతా పులకిస్తుంటే
ఇరుగు పొరుగు
బుగ్గలేం కెంపులయ్యాయని
పదే పదే నిలదీస్తున్నారు


చేతిన పండిన గోరింట
కొత్తరంగేదో మనసుకు పులిమింది


ఏ దుస్తులు ధరిస్తే
నీకందంగా కనిపిస్తానో తేల్చుకోలేక
ఉన్నవన్నీ చిందరవందరయ్యాయి


గుమ్మాలకు వేల్లాడే
పరదాల్లాంటి ఆంక్షల చూపులను తోసుకుంటూ
నీకోసం... ఉద్యానవనంలో... నిరీక్షిస్తున్నప్పుడు...
నిశ్శబ్ద మైదాన పరిసరాల్లో
నా గుండె
శబ్దపు పరుగును పెంచుతుంటే
మిణుగురు చెస్తున్న ప్రేమకాంతిలో
పికిలిపిట్టల గానమౌతోంది


నీవొచ్చేలోగా
ఈ గదినలంకరించాలని
తెచ్చిన పూలగుత్తులన్నీ
ఆత్రంలో అలసిన నన్ను
దిగాలుగా చూస్తున్నాయి


తీరా నీవొచ్చేసరికి
జిడ్డోడుతున్న మొహంతో
చెదిరిన కురులతో
నలిగిన వస్త్రాలతో
ఇక్కడే ఇలానే
నిలచేవున్నాను సుమా!


ఇలాక్కూడా అందంగావుంటావనే
నీ మాట
నా అలసటనుపోగొట్టి
నన్నింకా గిలిగింతలు పెడ్తూనేవుంది.
--------------

ఓ రోజు అమ్మ సంకలనం పేజీలను టైపుచేస్తున్నప్పుడు సుమారు రాత్రి రెండు గంటలయ్యింది. సిస్టం కొంచెం ఇబ్బంది పెడుతున్నా ఎలగైనా పూర్తిచెయ్యానుకుంటూనే కుర్చీలోనే నిద్రపట్టింది. హటాత్తుగా మెలకువ వచ్చి కళ్ళు నులుపుకుంటుంటే కొన్ని వాక్యాలు నన్ను వెంటాడాయి. అవే ఇవి ఇలా ఇక్కడ చేరాయి. అప్పటికి సమయం 4.00 గంటలయ్యింది.

------------
3425

Labels:

Wednesday, July 9, 2008

రాళ్ళలో పూసిన పువ్వు - కథ

Read this document on Scribd: a4story2




ఆంధ్ర ప్రభ దీపావళి కథలపోటీలో సధారణ ప్రచురణకు ఎన్నికైనది

Labels:

Saturday, June 14, 2008

మందారమాలతో మరుమల్లె ముచ్చట్లు - "స్నేహమా" బ్లాగ్సమిక్ష

రాధిక గారికి,
కవిత్వమనేది హృదయాంతరాళాలలో దాగివున్న జలనిధి. బయటకు రావడానికి నిరంతరం ప్రయత్నిస్తూనే వుంటుంది. ఆ ప్రయత్నం నిత్య జీవితంలో జరుగుతూనే వుంటుంది. కొన్ని సమయాలు, కొన్ని సందర్భాలు, కొన్ని పరిస్థితులు, కొందరి ప్రభావం తటస్థించడం ద్వారా అది బయట పడుతుంది. అలా వస్తూ అది ప్రవాహమౌతుంది. ఆ ప్రవాహానికి దిశ, లక్ష్యాలను నిర్ణయించడానికి ఒక క్రమశిక్షణాత్మకమైన పరిశ్రమ అవసరమౌతుంది. ఈ ప్రవాహంలో వెలువడే కవిత్వం ఒక అంత:సూత్రాన్ని పాటిస్తూ తెలియకుండానే ధ్వని సమన్వయం చేసుకుంటుంది. ఇలా జరగటానికి బాల్యము, జన్మస్థలాలు, పరిసరాలలోని పెద్దల స్ఫూర్తి, చదువు నేర్చుకున్న మూలాలు దోహదంచేస్తాయి. స్పందించే హృదయం కొనుక్కుంటేనో, సాధన చేస్తేనో వచ్చేది కాదు. సహజసిద్ధంగా గోరుముద్దలు, లాలిపాటలతో మొదలై శ్రమైక జీవనంనుంచి అంతరంగాలలో పాదుకుంటుంది.
ప్రస్తుత సాహిత్యం, విప్లవసాహిత్యమే సాహిత్యమన్న స్థితినుంచి, వివిధ ధోరణులు విభిన్న వర్గాలుగా విడిపోతున్న దశ, ఏ వాదాలు దేనికి మార్గదర్శకంగా నిలుస్తాయోననే సందిగ్ధత ఓ ప్రక్క, మరో ప్రక్క కెరీర్ ఓరియెంటేషన్ పెరిగి ఇంటర్ మీడియట్ స్థాయినుంచే తెలుగును వదిలేస్తున్న నేటి విద్యావిధానాలు, కార్పొరేట్ చదువులు వీటన్నిటి మధ్య యువత కవిత్వాన్ని ఆస్వాదిస్తున్నదా అనే పరిస్థితి. వలసలు, వలసలవల్ల ఏర్పడే “డయస్పోరా” మరో ప్రక్క.
తెలుగునాట విరివిగా కవిత్వం వస్తున్నది, కవిత్వ పుస్తకాలు వస్తున్నాయి కాని అమ్మకాలు లేవు. అసలు ఇవి ఎంతవరకూ యువతకు చేరుతున్నాయి అనేది పెద్ద ప్రశ్న. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త కవి, అందులోనూ యువకవుల పుట్టుక చాలా సందిగ్ధంగా వున్నదశలో రాబోయేకాలంలో కొత్తకవులు పుడ్తారా అనేదికూడా ప్రశ్నే.
ఇలాంటి భిన్నత్వం మధ్య మీరు కవిత్వం రాస్తున్నందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాను. నేను కవిత్వాన్ని చదువుతున్నప్పుడు కొన్ని విషయాలను దృష్టిలో వుంచుకొని చదవటం అలవాటయ్యింది
చదవగానే వచ్చే తక్షణ స్పందన
అక్షరాలలో అంత:సూత్రం ఏమైనా కనిపిస్తుందా
అక్షరాలు ఏమైనా మోసుకొని వస్తున్నయా (ప్రతీకలు)
వీటిల్లోంచి నాకు(ఇప్పటికి) ఏమైనా పనికివస్తుందా
ఇలా కొన్ని విషయాల దృష్టితో చదువుతుంటాను. అందులో కొన్ని తాత్కాలిక ఆనందానిస్తాయి, కొన్ని ఆలోచింపచేస్తాయి, కొన్ని వెంటాడుతుంటాయి . అలాంటివి మీ కవిత్వంలో నాకు కొన్ని కనిపించాయి.
ఎక్కువగా అన్నీ ఒకలాగే వుండటంవల్ల అన్ని కవితలూ కోట్ చెయ్యటం లేదు. ప్రత్యేకమని నాకు అనిపించినవే వుదహరిస్తున్నాను. కవిత్వంలో ఇలాగే వుండాలనే నిర్దిష్టాలు ఏవీలేవు. నేను చెప్పినవే ప్రమాణాలు కాదు. నాకు అనిపించినవి మాత్రమే చెప్పడానికి ఒక ప్రయత్నం, అది మీకు ముందుముందు వుపయోగ పడాలని ఆశ.
కవిత్వం రాయడమే కాకుండా బ్లాగుల్లో వుంచడం, దానికి సందర్భోచితంగా ఫోటోలు జోడించడం, బ్లాగు తెరవగానే పాట వినిపించడం, ఇలా మీరు కంప్యూటరు టెక్నాలజీని వినియోగించుకోవడం నాకు బాగా నచ్చిన ఆంశాలు. కవితకు బొమ్మ వేసి ముద్రించడం పత్రికల్లో పద్ధతి. ఫోటోను పొందుపరచడం బ్లాగుల్లో సౌలభ్యం. మీరు ప్రతీ కవితకు ఓ ఫోటోను జతచేస్తారు. ఫోటోను ఎన్నుకుని కవిత రాసినా, రాసినదానికి ఫోటో వెదుక్కుని పెడ్తున్నా ప్రకృతి సౌదర్య స్పృహ అంతర్గతంగా మీలోదాగి వుంది (ఈస్తటిక్ సెన్స్అంటారు).
ఈ కవిత్వాన్ని ఎన్నిసార్లు చదువుతున్నా చిత్రమైన అనుభూతి కలుగుతుంది. అది చాలాసార్లు నదిలోనో, సముద్రానికో స్నానం కోసం వెళ్ళినప్పుడు చిరుకెరటాల మధ్య మోపే మొదటి అడుగు పొందే నీటి స్పర్శలాంటిది. లోపలికెళ్ళేకొద్దీ ఆ స్పర్శ, అనుభూతి మారిపోతుంది. మళ్ళీ ఎప్పుడైనా మొదటిపాదం పెట్టాల్సి వచ్చినప్పుడు అదే అనుభూతి, అదే స్పర్శ..
బహుశ: మొత్తం కవితల్లో వస్తువు ఇంచుమించు ఒకటే అవటం వల్ల ఇలా అనిపించవచ్చు.
మీరు, మీ స్నేహితులు పంచుకున్నదేదైనా అందులో దాగివున్నది ప్రేమ మాత్రమే. ఆ ప్రేమే మీచేత ఇన్ని అక్షరాలను మాలలుగా తోరణాలను అల్లిస్తుంది.
మీ కవిత్వంలో కనిపించిన అనుభూతులు పాతబడిపోయిన కవిత్వమని తలుస్తారు కాని అందులోంచి ఒక కొత్త వ్యక్తీకరణ కనిపిస్తుంది. అనుభూతిని చెప్పటంలో తాజాతనం కనిపిస్తూ వుంటుంది. ఆ తాజాతనం ఎవ్వరినైనా ఆకర్షిస్తుంది. జ్ఞాపకాలనో, అనుభవాలనో, అనుభూతులనో తట్టిలేపుతుంది.
బేలతనం, అమాయకత్వ లక్షణాలను తొలగించుకోవల్సిన, బయటపడవల్సిన అవసరం వుంది.
కవిగాని, రచయితగాని దైనందిన జీవితంలో ఎదుర్కొంటున్న అన్ని రకాల అంశాలనుండి ప్రభావితమై, దాని ప్రభావం రచనల్లో అంతర్లీనంగానైనా కనిపిస్తుంది అని విమర్శకులు చెపుతారు. ఆ కోణంలో చూస్తే కన్నీళ్ళు, ఒకలాంటి నిస్పృహ, ఎడబాటు ఎక్కువగా కనిపిస్తాయి మీ కవితల్లో.
ఆలోచనలను ఎక్కువగా పోజిటివ్ వైపు మళ్ళించడం కనిపిస్తుంది. అది మిగతావాటిని అధిగమిస్తుంది కూడా.
ఐతే కొన్నిచోట్ల వాస్తవ విరుద్ధమైన పదాలు వున్నాయి.
ఉదా : చల్లని చీకటి తెచ్చిన చక్కటి చుట్టాన్ని చూస్తుంటే
చప్పున మెదిలిన నచ్చినవాడి రూపం ఇది పరస్పర విరుద్ధభావన. గమనించండి.
ఇందులో చీకటి వాస్తవం. చీకటి భయానికి, తెరమాటుతనానికి, వికృత చేష్టలకు , చెడ్డతనానికి …. ప్రతీక.
అది తెచ్చే చుట్టం అలాగే వుంటుంది కానీ మంచిగా ఎలా వుంటుంది?
పూర్ణిమ వున్నప్పుడు చీకటికి తావులేదు, చీకటి ఆక్రమించినపుడు వెన్నెలకు చోటు లేదు
వెన్నెల సాహిత్యానికి, ఇరుమనసుల కలయిక పడే విరహానికి ప్రతీక. వెన్నెల ప్రేమికుల మధ్య కొత్తసంగీతాన్ని తెస్తుంది.
కన్నీరు కవితలో ఇలా అంటారు:
“ఈ బరితెగించిన బాధని చూడు
కనుల సరిహద్దును దాటి
చెంపలను తడుపుతుంది
కనికరంలేని కన్నీళ్ళు
ఎంత ఆపినా ఆగట్లేదు
సంతోషమా
నువ్వొచ్చి కట్టడి చెయ్యొచ్చుగా!”
సంతోషం ఎలావస్తుంది, ఎవరి ద్వారా వస్తుంది, దేనివల్ల వస్తుందో తెలియనప్పటికీ ఆహ్వానించడం ద్వారా ఒక దృశ్యంగా సాగిపోతున్న ఒరవడి నుండి కవితా రూపం, అనుభవాలు మారిపోతాయి.
కొన్ని కవితల్లో మిమ్మల్ని మీరు స్థిరీకరించుకుంటున్నారు:
“అలుపుతీర్చే చిరుగాలి
అలిగి సుడిగాలైతే
చిగురుటాకులా వణికిపోతున్నాను.
కానీ..
ఈ సుడిగాలి జడివాన కురిస్తే
సాహిత్యపు మొలకలెత్తిస్తుంటే
ఆ ధారల్లో తడిసి మురిసిపోతాను గానీ
ఎండుటాకులా దూరంగా ఎగిరిపోను”
….’చిరుగాలి కోపానికి’ కవితలో
కొన్ని కవితల్లో మీరు అర్థం చేసుకుంటున్న కవిత్వ నిర్వచనాన్ని వ్యక్తీకరిస్తున్నారు.
“కవిత” అనే కవితలో
“మనసులోని భావాలు
మాటలుగా చెప్పలేని వేళ
అవి కలై … అలలై
అనుభూతుల తుఫానులు చెలరేగి
యెద తీరాన్ని తాకినప్పుడు
మది లోతుల్లో పలికేదే కవిత”
అంటారు. అనుభూతులకు, ఆలోచనలకు భిన్నంగా వాడిన పదాలు ‘అందం’ కవితలో “అదృష్టం”, ఆమె కవితలో “విధి”.
అనుభూతులు, ఆలోచనలను అందరూ ఏదో వొకప్పుడు అంగీకరిస్తారు కాని పై పదాలు అన్నివేళలా అందరికీ ఆమోదయోగ్యం కాదు. ఎందుకంటే ఇలాంటి పదాల వెనుక మతం వస్తుంది. అది భిన్నమైన అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తుంది.
నాకు బాగా నచ్చిన కవిత:రేపటి ఉదయం
ఎదురుచూపులో ఎన్ని ఋతువులు కరిగిపోయాయో
నా కన్నీళ్ళల్లో ఎన్ని కలలు జారిపోయాయో
మనసు మెదడుతో యుద్ధం చేస్తుంది
ఫలితమే ఈ నిదురలేని రాత్రి
అయితేనేమిలే…
పారిపోయిన కాలాన్ని పట్టలేనని తెలుసుకున్నాను
అందుకే ఇప్పుడు
నా పుస్తకాన్ని సరికొత్తగా ప్రారంభిస్తున్నాను
ఓ నిరాశా…
ఈ రాత్రి మాత్రమే నీది
రేపటి ఉదయం…నాది….
కన్నీళ్ళు, మనసు యుద్ధం, సరికొత్త ప్రారంభం, కమాండ్ - శాసించడం
నాది అని సొంతం చేసుకొనే దృక్పథం సరికొత్త ఆవిష్కారాలకు దారి చూపిస్తుంది. నిదురలేని రాత్రిని యుద్ధంతో పోల్చడంలో నేటి జీవన పరిస్థితి “struggle for existence ” కనిపిస్తుంది. ప్రతీ వోటమిలోనుంచి గెలుపుకు మార్గాలను వెతుక్కోవచ్చు అని నిరూపించిన వాళ్ళు ఎందరో వున్నారు. జారిపోయిన, పారిపోయిన కాలం నుంచి పాఠాలను నేర్చుకున్నప్పుడే ప్రతి ప్రారంభం నిర్మాణానికి, నిర్మించుకోవడానికి దారి తీస్తుంది - అది జీవితమైనా, జీవనమైనా, సమాజమైనా.
నిరాశను శాసించడం ద్వారా ఆశను పట్టుకోవడం బాగుంది.
“ఇప్పటికైనా” కవితలో స్త్రీవాదం కనిపిస్తుంది.
అదిమిపెడుతున్న ఆశలు పైకి చెప్పాలనుకోవడం మార్పుకోసం ఎదురు చూడటమే. శిశువుగా శ్వాసించడం కేకతోనే ప్రారంభం.
కేక/శబ్దం నిశ్శబ్దాన్ని చీలుస్తుంది. తరంగ తరంగాలుగా భావం బయటపడుతుంది. ప్రపంచం మొత్తంమీద మాట్లాడగల్గిన (prominent personalities) వాళ్ళను వేళ్ళపై లెక్కపెట్టవచ్చు.
“వర్షించడానికి సిద్ధంగా
ఎన్నేళ్ళ భావాలో?
ప్రవాహంలా
ఎన్నెన్ని కన్నీళ్ళో?”
ఇది చదువుతున్నప్పుడు మా అమ్మ గుర్తుకువచ్చింది. ఆరు కానుపులు, ఏడుగురు పిల్లలు, చాలీచాలని ఆర్థిక వెసులుబాటు, రెండు మూడు సంవత్సరాలకోసారి బదిలీలు. తన వ్యకిగత ఆశలకు, ఆలోచనలకు ఎప్పుడూ వూపిరి దొరకలేదు. తనకొచ్చిన వుద్యోగావకాశాలు సంసారం, బాలింత సూలింతల మద్య నలిగిపోయాయని అంటుండేది. బహుశ కన్నీళ్ళై ప్రవహిస్తే మనసుకు వూరట కలుగుతుందేమో? మరి సమస్య మాటేమిటి? ఆశల సంగతేమిటో…. పెద్దప్రశ్న. ఇది ఒక్కరిదీ ఇద్దరిదీ కాదు. బహుశ స్త్రీలందరిదీనేమో.
కన్నీళ్ళ ప్రవాహాలవటం కొత్తదారుల్ని తెరుస్తుంది
వర్షిస్తే కొట్టుకుపోయినవి ఎన్నో.
మాట్లాడాలి ఇకనైనా…అనే భావాన్నిస్తుంది
“అతడు” కవితలో
“చాలా చెప్పాలనుకున్నాను అతనికి
కాని ఏమిచెప్పాలో తెలియని పరిస్థితి”
యవ్వనంలో తప్పని భావాలైనా ప్రేమకూ ఆకర్షణకూ మధ్య తేడా తెలవకుంటే సమన్వయం కష్టమే. సత్యభామదీ ఇదే మనస్తత్వం. కాని ఆమె ప్రౌఢ. కృష్ణుడితో తగవులాడుతుంది. అలక బూనుతుంది. కోపిస్తుంది, కలహిస్తుంది. పరిపరి విధాల తలపోస్తుంది. అది కృష్ణునిపై ఇంకా ప్రేమను పెంచుతుంది.
“నిశీధిలో నేను” కవితలో పోజిటివ్ అలోచనలు అనిచెప్పానే అది ఈ కవితకు వర్తిస్తుంది. కవిత బాగున్నట్లు అనిపించినా ప్రతీకాత్మకంగా చూస్తున్నప్పుడు పరస్పర విరుద్ధంగా అనిపిస్తాయి.
చీకటి తెరలను దాటుకుని ఇపుడే
ఉషోదయపు వెలుగుల్ని చూస్తున్నాను.
నిశీధిలో నియంత బ్రతుకు అయినా…
ఉషస్సు చూడలేక
తలను వంచిన ఈ క్షణం
ఇపుడు నాకు నచ్చుతుంది.
మబ్బులు సూర్యుణ్ణి ముసురుతున్నాయి
నా మనసుని కాదు.
ఇక ఎప్పటికీ కాదు
అప్పుడే పుట్టిన పసి పాపలా నా మనసు………
ఇందులో పరస్పర విరుద్ధమైన భావాలు వున్నాయి. ఒకసారి తలను వంచితే సమర్థిస్తునట్టూ, అంగీకరించినట్టూ, మోసుకుపోతున్నట్టూ అవుతుంది. అది నచ్చితే దాన్నుంచి బయటకు ఎప్పుడూ రావాలనిపించదు. తలను ఎత్తినప్పుడే, లక్షణాలు నచ్చనప్పుడే ఛేదించే మార్గాలను అన్వేషణ చేస్తుంది మనసైనా, బ్రతుకైనా. ఉషోదయపు వెలుగుల్ని చూడటం ఒక శుభపరిణామం.
మబ్బులు ముసిరేది నా మనసును కాదు అని చెప్పడం పాజిటివ్ ఆలోచన. ఆ అలోచనలు నిర్మలంగా, స్వచ్ఛంగా, అప్పుడే పుట్టిన పసి పాపలా వుండటం మీ కల్పనా చాతుర్య ప్రతీక.
“జీవితం” కవితలో
కన్నీళ్ళ అనుభవాలు చెబ్తూ నిర్వచనం దిశగా మారిపోయారు.
ఏదో అసంతృప్తి కనిపిస్తుంది.
ఇలాంటిదే మరొకటి “మదికోరిన మరణం”
ఇంకా ఎదురు చూస్తూనే వున్నాను నువు వస్తావని
నాకు తెలుసు నీవు రావని ..రాలేవని
తిరిగి రాని సుదూర తీరాలకు తరలిపోయావని
అయినా నిరీక్షిస్తున్నాను ఎందుకో..నువు వస్తావని
నీదైన ప్రతి జ్ఞాపకం మది లో మెదులుతుండగా
మధురమైన భావాలను కలిగిస్తుంది
అసలు నువులేవన్న మాటనే మరిచిపోతున్నాను
మది కరిగించే నీ చిరునవ్వు కనులముందు కనిపిస్తూనే వుంది
నాపై వెన్నెల జల్లులు కురిపిస్తూనే వుంది
ఒంటరినై వున్నపుడు నీ వెచ్చని స్పర్శ,
ఓదార్పుగా తీయని పలకరింపు తాలూకు భావన
ఇప్పటికీ నువ్వు వున్నావన్న అనుభూతిని కలిగిస్తున్నాయి
ఆ తలపులే …నీవు నా వెంటే వున్నావన్న ధైర్యాన్ని ఇస్తున్నాయి
అయినా………….నీవు లేని నా కల సయితం ఊహించలేను
నీ నీడగా మారిన నా మనసుతో పాటూ నేనూ వస్తున్నాను
నిను చూడాలని..నీ దరి చేరాలని
ఈ లోకానికి చివరి వీడ్కోలు పలుకుతూ…
నీ దరి చేరబోతున్న నేను
ఇందులో కన్నీళ్ళు, నల్లని అనుభవాలు పిండాలని ప్రయత్నించారు.

మనసుభాష: ఈ కవిత దగ్గరకు వచ్చేసరికి మీ కవితా ప్రయాణం రూపుదిద్దుకుంది. నిశ్శబ్ద సంగీతాన్ని ఇందులో ఇమడ్చగలిగారు. అద్భుతమైన చిత్రీకరణ కూడా.
ఏకాంత వనం లో
ఆమె - నేను
మౌనం గల గలా
మాట్లాడేస్తుంది.
మనసులు ఏమి అర్థం చేసుకున్నాయో
కన్నులు ఏమి భాష్యం చెప్పుకున్నాయో
చిత్రంగా..
చిరునవ్వుల అంగీకారాలు తెలుపుకున్నాయి

“ఈ తరం” కవితలో..
“అలారం మోతలతో
ఉలికిపాటు మెలకువలు
అలసిన మనసులతో
కలలులేని కలత నిదురలు”
నిజంగా ఈ తరానికి ప్రతీకే. జీవన శైలి ప్రతిబింబిస్తుంది.
“ఓ భావన” కవితలో
ఒక అందమైన భావనకి వేవేల రూపాలు
అమ్మ-నాన్న
అన్న-చెల్లి
అతడు-ఆమె
నువ్వు-నేను…ఇలా ఎన్నో
అన్ని మనసుల మధ్యా ఉన్న
ఒకే వారధి ప్రేమ
అమృతం తాగిందేమో ఈ ప్రేమ
నిత్యం యవ్వనంతో వుంటుంది
అందరినీ తనలో నింపేసుకుంటూ
అందరినీ తనతో కలిపేసుకుంటూ…
మురిపిస్తూ[పసిపాపై]-మరిపిస్తూ[అమ్మై]
కవ్విస్తూ[ప్రేయసై]-లాలిస్తూ[నాన్నై]
బాధిస్తూ[అసూయై]-ఓదారుస్తూ[నేస్తమై]…ఇలా
ఎన్నో అనుభూతుల్ని అందిస్తూ.. మిగిలింది
చిరంజీవిగా ఈ ప్రేమ
[] పెట్టకుండా రాసుంటే బాగుంటుందేమో
పసిపాపనై మురిపిస్తూ
అమ్మై మరిపిస్తూ నాన్నై లాలిస్తూ
ప్రేయసినై కవ్విస్తూ
అసూయై బాధిస్తూ
నేస్తమై ఓదారుస్తూ
- ఇలా
ఎన్నో అనుభూతుల్ని అందిస్తూ
మిగిలింది చిరంజీవిగా
ఈ ప్రేమ.
ఆమె
తనొక జ్ఞాపకమై వుంటానంది
నేను వద్దన్నాను
తనొక అనుభూతిగా మిగులుతానంది
నేను కుదరదన్నాను
గుండెల్లో నిలుస్తానుగా అంది
సదా కళ్ళెదుట వుండమన్నాను
గతమై నా వెనుక వుంటానంది
జతగా నా పక్క నడవమన్నాను
జన్మంటూ వుంటే నీ కోసమే అంది
నీతోటే నేనంటూ..ఈ జన్మకి వీడ్కోలన్నాను
మొదట ఓదార్చింది–తరువాత వివరించింది
బ్రతికి సాధించమంది
సాధించి దానిలో తనను బ్రతికించమంది
కళ్ళు తుడుచుకున్నాను
నాకు దారి చూపుతూ..అనుక్షణం విధిని గుర్తుచేస్తూ
ఎదురుగా నా లక్ష్యం రూపంలో ఆమె
తన రాక కోసం
నచ్చిన నెచ్చెలి చెప్పే
తొలకరి చినుకుల్లాంటి ముద్దు మాటల్లో
ముద్దగా తడిసిపోవాలని
తొలి వేకువ నుండి ఎదురుచూస్తుంటాను.
ఒంటరిగా కాదులెండి
తోడుగా ఆమె తలపులు.
తను ఒకసారి వచ్చి వేల వసంతాలను
కానుకిచ్చి వెళుతుంది.
అనుభూతుల వానలో తడిపి
ఆరేలోపు వచ్చేస్తానంటుంది.
నాకు మాత్రం
మనసు కన్నులతో చెప్పిన ముచ్చట్లతో
రేయి కలలా సాగిపోతుంది.
నెచ్చెలి తెచ్చే
నవ్వుల కోసం ఎదురుచూపుల్లో
మళ్ళా వెన్నెల వచ్చేస్తుంది.
అద్భుతమైన కవితలు. మీది కాని స్వరూప స్వభావాన్ని వ్యక్తీకరిండం: ఇది వ్యక్తిగతానికి భిన్నం. సఫలమయ్యారు. ఈ కవిత్వాన్ని చదువుతూ తక్కువ రాసానేమో అని ఒకసారి, ఎక్కువ రాసానేమో అని ఒకసారి అనిపిస్తుంది. సామాజిక, ఆధ్యాత్మిక, భావాత్మక, ప్రగతిశీల, అభ్యుదయ, స్త్రీవాద కవిత్వాన్ని ముమ్మరంగా మీరు రాయాలని అభిలషిస్తున్నాను.
లేఖల గురించి ఓ మాట:
ఉత్తరాలు తరిగిపోని సంపద లాంటివి. దానికి కవిత్వం అద్దటం ఒక మహత్తర ప్రక్రియ. ఉత్తరాలు ఏకాంతం నుండి సమూహాల్లోకి, సమూహాల నుండి ఏకాతంలోకి వంతెనను నిర్మిస్తాయి. ఎవరి వంతెనకు వాళ్ళ నేపథ్యమే చిత్రాన్నిస్తుంది. నిర్మించడమే. మీరు మీ వంతెనను ప్రదర్శనకు పెట్టారు. సుమారు రెండు కిలోమీటర్లున్న రాజమండ్రి వంతెనలా. లండన్ లోని వంతెనపైనో, హౌరా వంతెనపైనో విహరిస్తున్నట్టు అక్షరాల వంతెన పైనుండి ఎవరికివారే మరో కొత్త వంతెన నిర్మించుకోవాలి.
బాల్యంలో తొక్కుడు బిళ్ళ ఆడినట్టు, యవ్వనంలో దాచి దాచి చదువుకున్నట్టు మనస్సులో కట్టుకున్న కొత్త ఫొటో ఫ్రేములా అనిపించాలి. అలా అనిపించాయి నాకు. ఈ అనుభూతులు మీ అక్షరాల మధ్య దాగివున్నాయి వెలికితీయండి.
పుస్తకంగా చేయతగ్గ కవిత్వం ఇందులోవుంది. విరివిగా రాయండి. బ్లాగులే కాకుండా ఇతర పత్రికల్లో కనిపిస్తారని ఆశిస్తూ..
అభినందనలతో…..
జాన్ హైడ్ కనుమూరి
---------------published in poddu.net
3182

Labels:

Tuesday, June 3, 2008

ఆహ్వానము అన్నమాచార్య సాహిత్య మాధుర్యం

అన్నమాచార్య సాహిత్య మాధుర్యం

ఉపన్యాసకులు

డా. రవ్వా శ్రీహరి
విశ్రాంత వైస్ చాన్స్లర్, ద్రవిడ విశ్వవిద్యాలయము

తేది 8.5.2008 సాయంత్రము 5 గంటలనుండి

స్థలము : శ్రీ కవిరాజు అక్షరాలయము
సంగీత్ నగర్, కుకట్‌పల్లి, హైదరాబాదు.

పోను : 23066444


------------
3140

Labels:

Monday, May 26, 2008

భార్గవి రావుకు నివాళి

మీరు చదివారా??
ht



http://www.andhrajyothy.com/editshow.asp?qry=/2008/may/26vividha2

Labels:

Monday, May 12, 2008

మనమూ మన అలవాట్లు

మా కంపెనికీ గతవారంలో విదేశీ అథిదులు మూడు ధఫాలుగా వచ్చారు. వారిని తోడ్కనిరావటానికి విమానాశ్రయానికి నేను వెళ్ళటం జరిగింది. నాతోపాటు ఒక విదేశీ అథిది కూడా వున్నారు. మాకు కలిగిన రెండు అనుభవాలు మీ ముందుంచాలని ఈ ప్రయత్నం.
9.5.2008న రాత్రి 10.30 గంటల సమయం, స్థలం : రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, హైదరాబాదు.
ఇద్దరు విదేశీ అథిదులతో రెండవ ప్లోరులో నిలబడి వున్నాము. ఇద్దరూ సిగరెట్టువెలిగించి ఎదో మట్లాడుకుంటున్నారు. ఒక కుర్రాడు మాదగ్గరికి వచ్చి ఒక సిగరెట్టు ఇస్తారా ప్లీజ్.. అంటూ అడగటం మొదలెట్టాడు. వారికి ఏమి అనాలో అర్థం కాక నా వైపు తిరిగి చూసారు. సిగెరెట్టు అడుగుతున్నాడనిచెప్పాను. అంతలో కుర్రాడే చెప్పడం మొదలు పెట్టాడు. సార్ గటనుంది సిగరెట్టుదుకాణం(షాప్) కోసం వెదకుతున్నాను, ఎక్కడా కనబడలేదు, నాలుక పీకేస్తుంది అందుకనే అడిగాను అన్నాడు.
వాళ్ళు( అథిదులు అతనికి సిగరెట్టు ఇచ్చారు.)
11.5.2008 ఆదివారము రాత్రి : 11 గంటల సమయం స్థలం : రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం

కౌలాలంపూర్ నుంచి రావలసిన విమానానికి ఇంకా సమయం వుండటంతో అథిది సిగరెట్టు కాలుస్తూ బయట తిరుగుతున్నాము. అంతలో 35-40 సంవత్సరాల మద్య వయస్సున్న వ్యక్తి వచ్చి అగ్గిపెట్టెవుందా అని అడిగాడు. జేబులోంచి తీసి ఇస్తూ అదోలా నావంక చూసాడు. నాకేమీ అర్థం కాలేదు. అగ్గిపెట్టి ఆదిగిన తను తన సిగరెట్టు వెలిగించుకొని, అగ్గిపెట్తె ఇచ్చి వెళ్ళిపోయిన తర్వాత నన్ను అడిగాడు.


సిగరెట్టు కాల్చే అలవాటు అవసరం తెలిసినప్పుడు దగ్గర పెట్టుకోవాలని తెలియదా?
విచారమైన వింతమొఖం పెట్టి విదేసీయులను అడగాలని ఎలా అనిపిస్తుంది ... అని నన్ను అడిగాడు.

నిజానికి నాదగ్గర ఏ జవాబు దొరకలేదు.

అలావాట్లను నియంత్రించుకోలేమా అని నాకు అనుమానం కలిగింది

----
2916

Labels:

Saturday, May 10, 2008

బ్లాగర్లకు విన్నపం - మదర్స్ డే



(photo Nanacy)

అమ్మంటే ఓ అద్భుతం
అమ్మంటే ఓ అపురూపం
మురిపాలు, జ్ఞాపకాలు,
లాలిపాటలు, గోరుముద్దలు
అక్షరాలు, ఆలింగనాలు
నడక నడత
ఆనురాగాలు ఆత్మీయతలు
ఇంకా ... ఇంకా..
మీ గళంనుండి కలం నుండీ పంచుకోండి
ఓ మరుపురాని జ్ఞాపకాన్ని తయారు చేద్దాం


మదర్స్ డే సందర్బంగా మీ పోస్టులను, మీ భావాలను, మీ అభిమానాన్ని తెలియజేస్తూ రాసినవి నాకు వేగు పంపండి.
ఈ ఆలోచనలలో మీరు పాలుపంచుకోండి
ఎంత త్వరగా పంపితే అంత మంచిది.

లింకు ఇవ్వడం మర్చిపోకండి

పుస్తకంగా(పి.డి.ఎఫ్.) కూర్చి పంపుతాను.

john000in@gmail.com

Labels:

బ్లాగర్లకు విన్నపం

అమ్మంటే ఓ అద్భుతం
అమ్మంటే ఓ అపురూపం

మదర్స్ డే సందర్బంగా మీ పోస్టులను, మీ భావాలను, మీ అభిమానాన్ని తెలియజేస్తూ రాసినవి నాకు వేగు పంపండి.
ఈ ఆలోచనలలో మీరు పాలుపంచుకోండి
ఎంత త్వరగా పంపితే అంత మంచిది.

పుస్తకంగా(పి.డి.ఎఫ్.) కూర్చి పంపుతాను.
john000in@gmail.com

Labels:

మదర్స్ డే - నేను అమ్మ

రోడ్డుపై నేను ... అమ్మ

అప్పుడే

చీకటి పులుముకుంటుంటోంది

చలి మెల్లగా పంజా విసురుతోంది

శాలువా కప్పుకున్న... అమ్మ

నడుస్తున్నాం ఇద్దరం

దూరం తెలియకుండా

ఏవో చెబుతోంది అమ్మ

నేడు

అదే దూరం

అదే రోడ్డు

అదే చలి

చెంత అమ్మలేదు

అయినా...

ఎన్నో సంగతులు

నన్ను కప్పేవున్నాయి

శాలువాలా !

-----------------
అమ్మ జ్ఞాపకం

Labels:

Sunday, May 4, 2008

నేనెందుకు బ్లాగాలి???


బ్లాగుల్లో ఎందుకు రాయాలి?
బ్లాగుల నిర్దిష్ట లక్యం ఏమిటి?
బ్లాగుల్ని ఎవరు చదువుతారు?
చదివేవారు రాసేవారి భావజాలానికి, ఆలోచనకీ సమీపంగా వుంటారా??
బ్లాగులు రాయటం స్వలాభమా? సాంకేతిక లాభమా?? తెలుగుకు లాభమా???
బ్లాగులు కాలక్షేప రచనలా?
బ్లాగులు సమచార భాండాగారాలా???
బ్లాగులు సాహిత్య నిలయాలా???

అయినా రాస్తున్న బ్లాగ్‌రాతలను అభినందించే వాళ్ళాకోసం ఎదురుచూపులమద్య హటాత్తుగా దుమ్మురేపుకుంటూ దూసుకువచ్చి అభిప్రాయ భాణాలను వదిలే పేరే చెప్పలేని వాళ్ళను ఎలా ఎదుర్కోవాలి?

ఒక్కోసారి మన ప్రక్కనవున్నవారే మన రాతాల సౌరభాన్ని ఆస్వాదిస్తున్నారో లేదోనని సందిగ్దాలనడుము ఏమి రాయాలి అనే మీమాంస.

మరోసారి అదేపనిగా పొంగుకొచ్చేభావాలను రాతల్లోకి మార్చి బ్లాగులు నింపితే విసుగుచెంది ఇటువైపే చూడని బ్లాగ్వీక్షకులు.

ఎప్పుడైనా పదుగురు కూడి మాట్లాడుకొనేటప్పుడు మాటవరసకైనా ఎవరిని గురించి మాట్లాడితే ఏమౌతుందొనని భయం.

నాలుగక్షారలు పేర్చి నలుగురుకూ కనపడేచోట అతికించాలంటే నావాళ్ళే గుర్తుకొస్తారు.

ఇలా ఎన్నో ఆలోచనలు మనసును తొలుస్తూనే వున్నాయి.

అయినా ఏదో నా మనసుకు నచ్చింది రాస్తూనే వుంటాను.

Labels:

Tuesday, April 22, 2008

చిరునామా చెప్పని మరణం

పనిచేసున్నప్పుడు జరిగిన చిన్న ప్రమాదంలో ఒక పని వానికి దెబ్బలు తగిలితే ఈ రోజు అనుకోకుండా ఆసుపత్రికి వెళ్ళవలసి వచ్చింది. అతన్ని డాక్టరు పరిక్శిస్తున్నారు నేను ఇంకొంతమంది బయట నిరీక్షిస్తున్నాము. ఇంతలో ప్రవేశద్వారం వద్ద కలకలం మొదలయ్యింది. ఏమా అనిచూస్తే ఓ పెద్దావిడకు ప్రమాదం జరిగింది. డాక్టర్లు, నర్సులు పరుగెత్తారు ఆక్సిజన్ పెట్టారు, సెలైను పెట్టారు. కానీ ఆవిడ ఎవరో ఎవరూ గుర్తించలేకపోతున్నారు. వస్త్రధారణను బట్టి చూస్తే ముస్లిం మహిళగా కనిపిస్తుంది. చేతులకు రెండేసి చొప్పున బంగారు గాజులు, చెవులకు రాళ్ళ దిద్దులు, మెడలో గుళ్ళ(బంగారం) దండవున్నాయి. చేతిలో వున్న చిన్న గుడ్డ సంచిలో కొత డబ్బు, కొన్ని పాన్ మసాలాలు వున్నాయి. ఎంతవెతికినా చిరునామా ఎవరిది దొరకలేదు. డాక్టర్ల కొంత ప్రయత్నం తరువాత కొద్దిగా కళ్ళు తెరిచి ఎదో చెప్పాలని ప్రయత్నించి, ప్రయత్నించి మళ్ళీ కళ్ళు మూసేసింది. అదే చివరి చూపని తరువాత తెలిసింది.
ఎదురుగా వున్న పోలీసు స్టేషునునుండి వచ్చిన కానిస్టేబులు పంచనామాలు రాసుకుంటున్నాడు. అప్పటివరకూ ఆత్రంగా గుమికూడిన వాళ్ళంతా ఒకొక్కరుగా ఆ ప్రదేశాన్ని ఖాళీచేసారు. అప్పుడక్కడ నిశ్శబ్దం మెల్లగా పరచుకోవడం మొదలయ్యింది.
ఎవరో ఓ తెల్లని వస్త్రాన్ని(కఫన్) ముఖంమీదుగా కప్పారు.
నాలో ఏదో ఆలోచన సుడులు తిరగటం మొదలయ్యింది. ఎక్కడెక్కడో మాటల హుకుంనామాను జారీచేసిన దేహం ఇప్పుడు నిశ్శబ్దంగా, నిరాశ్రయంగా పడివుంది.
చిరునామాని తనలోనే దాచుకొని ఎటో వెళ్ళిపోయింది ప్రాణం

Labels:

Saturday, April 19, 2008

వసంతమా ఎపుడొచ్చావు నువ్వు??


అప్పటిదాకా భయపెట్టిన చలి
దుప్పటి దులిపి పారిపోతున్న వేళ
చికురాకుల వగరు తిన్న కోయిల
కుహు కుహు రాగాలాపన చేస్తున్న వేళ
చేదునింపుకున్న వేప తేనెలొలుకు పూలై విరబూస్తున్న వేళ
వచ్చిందంట వసంతం
దాని వర్ణన కవులకే సొంతం
అనుభూతి ఓ అనంతం

యంత్రాలవలె కదలికలతో వాహనాలరొదలలో
క్షణం కోసం అనుక్షణం పోరాడుతూ
కాలంవెనుక వడివడిగా పరిగెడుతున్న వేళలో
గ్లోబునంతా జేబులొ పెట్టాలని
సాప్ట్‌వేర్ హార్డ్‌వేర్ అంటూ
కొత్తవేళ్ళూనుతున్న తరుణంలో
ఓ వసంతమా ఎపుడొచ్చావు నీవు?
ఎవరు గమనించారు నిన్ను
అందుకే అంటాను
నీవు కవులకే సొంతమని

వెండితెర తారల తళుకు బెళుకులతో
నెట్‌లోని బ్రౌసింగు రూములలో చాటింగులతో
పబ్‌లలో హంగుల పొంగులతో
హోరెత్తించే బీటులోని నోటులతో
నూతన విరామాన్ని ఆనందాన్ని వెతుక్కుంటున్న సమయయంలో
ఓ వసంతమా ఎపుడొచ్చావు నీవు?
ఎవరు గమనించారు నిన్ను
అందుకే అంటాను
నీవు కవులకే సొంతమని

సస్యశ్యమలమనిపించే సీమలో
కాలే కడుపుతో బక్కచిక్కిన రైతు
నీవు వస్తావని సిరులెన్నో తెస్తావని
ఎదురుచూస్తున్న సమయంలో
పుట్లునింపాలని పట్టెడాశతో
పుస్తెలనమ్మి ఎరువేస్తే
వరదొచ్చి పురుగొచ్చి కరువొచ్చి
వెన్నుపై వెన్ను విరిచిన వేళ
ఓ వసంతమా ఎపుడొచ్చావు నీవు?
ఎవరు గమనించారు నిన్ను
అందుకే అంటాను
నీవు కవులకే సొంతమని

నిన్నెరిగిన వారు నీకై స్పందించినవారు
నిన్నాశ్వాదించిన వారు
నీతో నడవలేక నవతరంతో ఇమడలేక
మమతల కరువై వెతల బ్రతుకై
కాలం పొరలమాటున దాగిన జ్ఞాపకాలను
నెమరేసుకుంటున్న తరుణంలో
ఓ వసంతమా ఎపుడొచ్చావు నీవు?
ఎవరు గమనించారు నిన్ను
అందుకే అంటాను
నీవు కవులకే సొంతమని

ఉన్నత విద్యా సాధనలో
సుదూరతీరాలకు నిచ్చనవేసే ఆరాటంలో
భాషా సౌదర్యాన్ని గాలికి వదిలేసి
సబ్జెక్టులతో సెట్తులకై కుస్తీ పడుతూ
నిరంతరం అవిశ్రాంతంగా పోటీపడే
తాపత్రయంలో నిమగ్నమైపోతుంటే
ఓ వసంతమా ఎపుడొచ్చావు నీవు?
ఎవరు గమనించారు నిన్ను
అందుకే అంటాను
నీవు కవులకే సొంతమని

మానవత్వాలు మరచి
బంధాలు పొడి బారిపోతున్న వేళ
వలస బ్రతుకుల మధ్య మనిషి
వ్యాపార వస్తువైపోతూ
వర్గవర్గాలుగా విడివడిపోతున్న వేళలో
ఓ వసంతమా ఎపుడొచ్చావు నీవు?
ఎవరు గమనించారు నిన్ను
అందుకే అంటాను
నీవు కవులకే సొంతమని

Labels:

Saturday, April 12, 2008

నేనూ ఋషినే - (నేను నా అనుభవాలు)

నేనూ ఋషినే - (నేను నా అనుభవాలు) (సొంతడబ్బా అనుకోకపోతే కొన్నివిషయాలు )
బహుశ నేను ఇంటరు చదువుతున్నరోజుల్లో
"అడవి రాముడు" సినిమా విడుదలయ్యిందిఅందులో "కృషివుంటే మనుషులే ఋషులౌతారు, మహాపురుషులౌతారు" అనే పాటవుంది, అది చాలా ప్రాచుర్యం పొందింది. నేను కూడా చాలా సార్లు పాడుకున్నా, అప్పుడు దాని అర్థం బోదపడలేదు. ఈ మద్య అంటే ముప్పై ఏళ్ళ తర్వాత అనుభవానికి వచ్చాక గాని దాని పరమార్థం బోధపడలేదు.
నేను పనిచేస్తున్న చోట 1998లో కంప్యూటర్లు పరిచయమయ్యాయి.కంప్యూటరు నేర్చుకోవలసిన అవసరం తప్పనిసరి అయ్యింది.అంతకుముందెప్పుడో 1992-93ల మద్య ఒకసారి ప్రయత్నించి నేర్చుకోవడానికి ప్రయత్నించి మద్యలోనే ఓదిలేసాను. మళ్ళీ నేర్చుకోవడంకోసం ప్రయత్నించాను కాని ఎక్కడా పట్టుమని పదిరొజులు క్లాసులకు వెళ్ళలేకపోయాను. అలా అవటానికి కొన్ని కారణాలున్నాయి.>అప్పటికి ఇంకా మద్యపాన వ్యసనం మానలేదు. క్లాసులకు వెళ్ళే సమయాలు సరిగా కుదిరేవికాదు.>అప్పటికే ఆఫీసులో కంప్యూటర్‌తో పనిచెయ్యడం వలన సందేహాలు ఎక్కువగా వ్చ్చేవి. అవి క్లాసులో అడగటంవల్ల మిగతావారికి ఇబ్బందికరంగాను, ఫ్యాకల్టీకి తడబాటుగాను వుండేది. ఇలా కొన్ని ఇబ్బందులవల్ల క్లాసులనుండి నన్ను బయటకు తోసేసేవారు.
కంప్యూటరు నేర్చుకోలేకపోతే వేరే వుద్యోగం వెతుక్కోవాలేమో అనే పరిస్తితుల్లో, ఇంటర్‌నెట్టు పరిచయమయ్యింది. చాట్‌లో పరిచయమైన కొంతమంది మిత్రులవల్ల నా ఇంగ్లీషును వృద్దిచేసుకున్నాను. కంప్యూటర్‌ను ఉపయోగించుకొనే కొన్ని సులువు సూత్రాలను నేర్చుకున్నాను. నన్ను నేను కవిగా గుర్తించుకున్నాను, గుర్తింపు పొందాను. నా మాటల్లోని కవిత్వలక్షణాలను నా చాట్ స్నేహితులు గుర్తించి పోత్సాహాన్నిచ్చారు. వేరు వేరు ప్రదేసాలలొని వారమైయుండి, పరిచ్యమైనప్పటినుంది ఒక్కసారికూడా ఒకరినొకరు ఎదురెదురుగా చూసుకోలేకపోయినా స్నేహాన్ని కొనసాగిస్తూనే వున్నవారు వున్నారు. ఇటలీనుంచి డోనీ, థాయిలాండ్ నుంచి డాక్టర్ చాన్, ఇంగ్లాండు నుంచి నిస్సార్.
అప్పుడప్పుడూ అనిపిస్తుంది ఏ పూర్వమైన అనుబంధం మమ్మల్ని ముడివేసింది? కాని ఒక నిరంతర కృషి మమ్మల్ని నిలుపుతూ వచ్చింది. వారికోసం నేను చదివిన పుస్తకాలు, నాకోసం వాళ్ళు చదివిన పుస్తకాలు ఎన్ని సంగంతలు మాట్లాడోమో ఎప్పుడూ లెక్కించలేదు కాని, ఎంత అమూల్యమైన జ్ఞాన సంపదను ఖండాతరాలు దాటించామో. ఇప్పుడు నేను కంప్యూటర్‌ను వాడుతున్నాను.(సాంకేతికంగా ఎక్కడా నేర్చుకోలేదు)స్కూలు విద్యార్థిగా గాని, కాలేజీ విద్యార్థి గా కాని ఎప్పుడూ రాసిన గుర్తులేదు.అయినా కవిత్వాన్ని విరివిగా చదువుతున్నాను, రాస్తున్నాను.అన్నిటికంటే ముక్యంగా మద్యపానవ్యసనాన్ని మానేసాను.

Labels:

Thursday, April 10, 2008

ఏది ప్రేమ అనే ప్రశ్న నన్ను నిరంతరం తొలుస్తూనే వుంటుంది.

ఏది ప్రేమ అనే ప్రశ్న నన్ను నిరంతరం తొలుస్తూనే వుంటుంది.
ప్రేమ శారీరక ఆకర్షణేనా??
ప్రేమ దేహం స్పందించే కణాల ఉపసమనం కోసమేనా??
ప్రేమంటే ప్రేమికులేనా???
ప్రేమంటే స్త్రీ పురష శారీరక, లైంగికావసరాలకు తొలి అడుగా??
ప్రేమంటే పురుషాధిక్యమా??
ప్రేమంటే సెల్యులాయిడ్(సినిమా) తెరపై చూపించే రెండు గంటల ప్రదర్శనేనా??
ప్రేమంటే హత్యప్రయత్నాలు, యాసిడ్ దాడులు, ఆత్మహత్యలు, ఆత్మహత్యా ప్రయత్నాలేనా ??
ఇవన్ని(స్త్రీ) అమ్మాయిలపైనేనా??
యువత ఏమి అర్థంచేసుకుంటుంది??
రాబోయే తరానికి ఏ సంస్కృతిని ఆదర్శంగా నిలుపుతున్నాం??
లక్ష్మి, అయేషా, మీనా కుమారి, అరుణ ఇలా ఎవరో ఒకరు బలి అవ్వడానికి ప్రేరేపిస్తున్న ప్రవృత్తిని ఎక్కడనుంచి పెంచి పోషిస్తున్నాము??
మృగాలుగా, ఉన్మాదులుగా మారుస్తున్న పరిస్తితుల ప్రభావాలేమిటి??
అప్పుడెప్పుడో సుడిగుండాలు అనే సినిమా వచ్చింది. అందులో పిల్లలు నేర ప్రవృత్తికి ఇంటిలోని, సమాజంలోనివారే కారణమౌతున్నారనే విశ్లేషణ జరిగింది. ఆ ప్రవృత్తి ఇప్పుడు కొత్తరూపం దాల్చింది, దాల్చుతూనే వుంది. ఇలా కొనసాగవలసిందేనా????
ప్రశ్నలు? ప్రశ్నలు?? ప్రశ్నలు??
మనసును చిన్నభిన్నంచేస్తున్నాయి.

Labels:

Tuesday, April 8, 2008

కవిత్వం ఏమిస్తుంది


ఈ మద్య ప్రముఖ కవి శ్రీ శివారెడ్డి ఓ సభలో మాట్లాడుతూ కవిత్వం ఏమి ఇచ్చింది అని తరచు ఎదురయ్యే ప్రశ్నను లేవనెత్తి తనకు ఎదురయ్యిన అనుభవాల్ని చెప్పారు. తనకు కలిగిన ఆసుపత్రి అనుభావన్నుంచి రాసిన ఆసుపత్రి గీతం మళ్లీ మళ్లీ ఎదురౌతున్నప్పుడు కలిగే వేదన, బాధలనుండి స్వాంతననిచ్చింది. మనసులోనో దేహ అంతఃరాళాలలోనో పేరుకుంటున్న కల్మషాన్ని కడిగివేసింది.నిస్సత్తువలోకి జారిపోకుండా నిలిపింది. అది ఓ దార్పా? కొన్ని సార్లు నన్ను నేను పునః, పునః చిత్రించుకోవడానికి ఒక కుంచెను ఇచ్చింది.
ఇంతకన్నా ఏమికావాలి?అన్నారు.
అందుకే నేనంటాను కవిత్వం నా అలవాట్లనుండి మళ్ళించడమే కాకుండా మద్యపానాన్ని మానడానికి, ఆ తర్వాత జరిగిన అనేక శరీరక రసాయన మార్పులను తట్టుకోవడానికి కొత్త శక్తినిచ్చింది.

Labels:

Monday, April 7, 2008

ఉగాది శుభాకాంక్షలు

అందరికి ఉగాది శుభాకాంక్షలు

Sunday, April 6, 2008

పరివ్యాప్త - సమీక్ష

పరివ్యాప్త, స్త్రీ సమస్యలను ఒకచోటకూర్చిన కవిత్వ ప్రయత్న సంకలనం. ఇందులో అనేక స్త్రీ సమస్యలు వున్నాయి. భ్రూణ హత్యలు, వరకట్న సమస్యలు, వంధ్యత్వ సమస్యలు, మానసిక క్షోభ వీటన్నిటిపై స్పందించిన 100 మంది కవులు, కవయిత్రులు వున్నారు. వీరిలో లబ్ద ప్రతిష్టుల నుండి విద్యార్థుల వరకూ వున్నారు. కొత్త, పాత కలయికలతో నాలుగు తరాల కవులున్నారు. కొత్తవారికిది ప్రోత్సాహమే అయినా సమస్యాత్మక అలోచనాధారకు కొంచెం విఘాతం కలిగే అవకాశంవుంది. ఇందులోని కొన్ని కవితలు వివిధ పత్రికలలో ముద్రింపబడినప్పటికీ మొత్తంగా చూసినప్పుడు పత్రికల్లో వచ్చినవి తక్కువే కనిపిస్తాయి. సంపాదకురాలు వ్యయప్రయాసలకోర్చి ఒక్కచోట చేర్చడం, వాటిని సంకలనంగా తేవడం అభినందనీయం. స్త్రీ సమస్యలు అనగానే పురుష వ్యతిరేకత కాదు అని తనముందుమాటలో చెప్పుకున్నట్టు “మానవీయ స్పర్శ” తో చూడవలసిన అవసరాన్ని తెలియజేసాయి, ఇందులోని కవితలు. ఇంకా ఇందులో స్త్రీ ఔన్నత్యాన్ని చాటిచెప్పే కవితలు, అమ్మగురించి చెప్పే కవితలు, వివిధ సంఘటనలకు స్పందించిన కవితలు, వేదనలు, నిర్వచనాలు, ముందడుగు వేయటానికి స్ఫూర్తినిచ్చే కవితలూ కనిపిస్తాయి.
పూర్తీ వివరాలు చదవండి http://poddu.net/?p=543

Labels:

Friday, April 4, 2008

బత్తి బంద్ - విద్యుత్ ఆదాచేయండి



ఈ మద్య ఆదివారం వరంగల్ వెళ్ళాను. ఉదయమే సికింద్రాబాదునుండి ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ ఎక్కాను.ఖాజీపేట సుమారు 9.30 గంటలకుచేరింది.
ఫ్లాట్‌ఫారం మీదవున్న ఏదో రైల్వే వారి ఆఫీసు గోడపై ఒక నినాదం కనిపించింది.ఫోటో తీద్దామని బాగ్ తెరిచోలోపు త్రైను కదిలిపోయిందిఎవరైనా కెమేరా వున్నవాళ్ళు, ఖాజీపేట్ దగ్గరవారు ఆ నినాదాన్ని ఫోటో తీసి పెడతారా?? (ఇంకా వేరే స్టేషనులో వుందేమో తెలియదు)
నినాదం :
విద్యుత్తు ఒక యూనిట్ ఆదాచీస్తీ
ఒక యూనిట్ విద్యుత్తును ఉత్పత్తిచేసినట్టే.
బత్తి బంద్ వివరాలు మరికొన్ని చదవండి

http://battibandh.wordpress.com/

Labels:

Tuesday, April 1, 2008

నేను - తీరిన నా కల

బహుశా ౧౯౭౫లొ మొదటిసారి నేరెల్ల వేణుమాధవ్ గారి మిమిక్రి కార్య క్రమాన్ని చూసాను
ఆ ఉత్సాహంతో ఏకలవ్య సిష్యరైకాన్ని చేసాను.
చాలా సార్లు సాహితి కార్యక్రమ్మాలలో కలిసినప్పటికి ఆయనతో పొటో తియించుకోవాలనే కోర్కె అలానే మిగిలిపూయింది
కొన్ని సార్లు ఫోతోగ్రాఫర్లకు పైసలు ఇచ్చినా అది కలగానే మిగిలిపోయింది.
అనుకోకుండా కవితా వార్షిక ౨౦౦౭ కు నేను కెమేరా పట్టు కేల్లడం వల్ల అ కోరిక తీరింది.

Labels:

Monday, March 31, 2008

కవితా వార్షిక - 2007

కవితా వార్షిక ౨౦౦౭

కవితా సంకలనం వరంగల్లులో శ్రీ కే. శివారెడ్డి ఆవిష్కరించారు

డా. కత్తి పద్మారావు

ధ్వని అనుకరణ సామ్రాట్ శ్రీ నేరెల్ల వేణుమాధవ్

అంపశయ్య నవీన్

డా. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

అనంతరం కవిసమ్మేలనం జరిగింది

konni వివరాలు ఆంధ్ర జ్యోతి వివిధలో చదవొచ్చు

http://www.andhrajyothy.com/editshow.asp?qry=/2008/mar/31vividha2

Labels:

Monday, March 24, 2008

అతలాకుతలం చేసింది

రెండు రోజుల వర్షం అతలాకుతలం చేసింది
చేతికొచ్చిన పంట తడిసి
రంగు రుచి ధర కొల్పోయింది
నాలలు నిండి వరదై పొంగింది
రైతు గుండెలో కన్నిరు పారింది

ప్రతీ సారీ

పర్యావరణ సమతుల్యాన్ని గుర్తుచేస్తుంది

Labels:

Saturday, March 22, 2008

యేసు క్రీస్తు సిలువలో పలికిన ఏడుమాటలు

సాధారణంగా చనిపోవుచున్నవారు చివరిసారి పలికిన మాటలకు విలువ, ప్రాముఖ్యత, మరణవాగ్మూలము గా పరిగణిస్తారు.
యేసుక్రీస్తు అప్పగింపబడినప్పటినుండి పలికిన మాటలు చాలా తక్కువగా కనిపిస్తాయి.
ఇవన్నీ (బైబిలు) పరిశుద్ధ గ్రంధమందు ఒకేచోట రాయబడలేదు.
రాయబడ్డ సమయాలు కూడా వేరు వేరుగా కనిపిస్తాయి.
ఇతరులను గూర్చిన లక్ష్యము ఈ మాటల్లో కనిపిస్తుంది
1. తండ్రీ వీరేమిచేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము (లుకా 23:34) - శత్రువుల కొరకు ప్రార్థన.
2. నేడు నాతోకూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను (లుకా 23: 43) - పశ్చాత్తాప పడిన వారికి వాగ్దానము.
3. అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తల్లితో చెప్పెను, శిష్యునితో యిదిగో నీ తల్లి యని చెప్పెను (యోహాను 19: 26-27) - విశ్వాసముతో వెంబడించువారికి ఆదరణ, భాద్యతలను గుర్తు చేస్తుంది.
వేదనను తెలియచేసివిగా
4. "ఏలీ ఏలీ లామా సబక్తా" బిగ్గరగా కేకవేసెను (మత్తయి 27:46)
ఎలోయీ, ఎలోయీ, లామా సబక్తా బిగ్గరగా కేకవేసెను. ఆ మాటలకు నా దేవా, నా దేవా నన్ను ఎందుకు చెయ్యివిడిచితివని అర్థము. (మార్కు 15: 34) - మనోవేదన మరియు దేవునికిని కుమారునికిని మద్య వున్న సంబధాలను గురించి చెపుతుంది
5. నేను దప్పిగొనుచున్నాననెను (యోహాను 19:28) - శారీరక వేదన - లేఖనములు, ప్రవక్తల ప్రవచన నెరవేర్పు కనిపిస్తుంది
విజయము :
6. సమాప్తమైనదని చెప్పి తలవంచి ఆత్మను అప్పగించెను. (యోహాను 19:30) - ముగిసెనను తృప్తి.
7. తండ్రీ, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాననెను. (లూకా 23:46) - ప్రాణాత్మలను గురించిన తృప్తి.
ఇవి ద్యానము చేయుటద్వారా యేసుక్రీస్తు ఈ లోకమునకు మన పాపములకు బలియాగముగా చనిపోయెనని విశ్వసించుటద్వారా రక్షణ, పరిశుద్ధత, నిరీక్షణ ఇవ్వబడతాయి.
సమసమయాలలో తప్పిపోతున్న పరిస్తితులను, చేస్తున్న పాపములను ఒప్పుకొని మరియొకసారి నిర్ణయించుకోడానికి (రి డెడికేట్), సరిచేసుకోవడానికి ఇది సమయము.

Labels:

Wednesday, March 19, 2008

శుభ శుక్రవారము

నా ద్యానములోవున్నప్పుడు శుభశుక్రవారము గురించి బ్లాగాలనిపించింది. చాలా సార్లు నేను కొన్ని క్రైస్తవ మందిరములలో ఈ అంశాలను మాట్లాడినప్పటికీ బ్లాగు రాయటం కష్టంగానే అనిపిస్తుంది. అ యినా చిన్న ప్రయత్నం.
ఇది యేసు క్రీస్తు సిలువ మరణము పొందిన దినము.
దీనికిముందు 40 రోజులు లెంట్ డేస్‌గా పాటిస్తారు..భస్మ బుధవారముతో మొదలయ్యే 40 రోజులలో పాటించేవి ఉపవాసము, బ్రహ్మచర్యము, మిత ఆహారము, ప్రత్యేక ప్రార్థనలు. ఇవి ఆచారబద్దంగా వున్నాయని క్రైస్తవ శాఖలలో కొన్ని శాఖలవారు పాటించటలేదు. క్యాధలిక్ వారు పాటిస్తునే వున్నారు. ఈ రోజులలో సిలువ ధ్యానాలు పేరిట ఇళ్ళను దర్శించడము, ప్రత్యేకమైన ప్రార్ధనలు జరిగించడము, సిలువలోని మర్మాలను గురించి ధ్యానించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలకు ప్రస్తుత రోజుల్లో తక్కువగా హాజరౌతున్నారు.
ఈ శుక్రవారము సమావేశము అవటం ద్వారా క్రీస్తు సిలువ వేయబడుతున్న సమయంలోని సంగతులను ఉదయం 11 గంటలనుండి మద్యాహ్నం 3 గంటలవరకు ధ్యానిస్తారు. ముఖ్యంగా యేసుక్రీస్తు సిలువపై వ్రేలాడుతూ పలికిన ఏడు మాటలను, తనుపొందిన ఏడు గాయములు, వాటి ఆంతర్యాలను మన జీవితాలకు అన్వయించుకోవలసిన అవసరాన్ని తెలియచేసేవిగా వుంటాయి. క్రైస్తవులనే వారు తప్పనిసరిగా ఈ సమావేసము(ఆరాధన)లో పాల్గొంటారు.
యేసుక్రీస్తుకు ఇలా జరుగుతాయని ఆయన పుట్టక మునుపే ప్రవక్తలు ప్రవచించినట్లుగా బైబిలు తెలియచేస్తుంది.
యేసును నమ్మటంద్వారా పాపములు పరిహరింప బడతాయని, క్రొత్త జీవిత విధానములోకి మార్చ బడతామని, (యెవడైనను క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి.)బైబిలు తెలియచేస్తుంది
క్రీస్తును సమాధిలోవుంచి సీలువేసి, సైన్యము కాపలావున్న తర్వాత ఆదివారము వుదయం యేసుక్రీస్తు సమాధిని గెలిచి లేచి వచ్చాడు, దీనిని పునరుత్థానపు (ఈస్టరు) గా పండుగ జరుపుకుంటారు. మొదటి తరం ప్రొటస్టెంటులలోనూ, మిషనరీ ప్రాచుర్యము చేస్తున్న సమయంలో ఈస్టరును ప్రత్యేక రీతిలో జరుపుకునే పద్దతులు పాటించినప్పటికీ మారుతున్న కాల మాన పరిస్తితులకు అనుగుణంగా చాలా మార్పులు చోటుచేసుకోవడంవల్ల ప్రత్యేకంగా ఇలా జరుపుకుంటారు అని వివరించలేము ఇప్పుడు .
యేసు సిలువకు అప్పగింపబడిన సమయమునుండి పునరుత్థానుడైనంత వరకూ జరిగిన సంగతులను, విషయాలను, సంభాషణలను, రహస్యాలను, దీనివెనుకున్న వేదాంతాన్ని పరిశీలించినపుడు చాలా ఆశ్చర్యంగాను, అద్బుతంగాను అనిపిస్తాయి.
ప్రత్యేకమైన సమయాలను పాటిచడం కాదు, ప్రతిసమయాన్ని ప్రత్యేక సమయంగా మార్చు కోవాలి అనే వాదన వల్లకూడా కొన్ని మేలుకరమైన ఆచారాలు కూడా కనుమరుగౌతున్నాయని నా కనిపిస్తుంది.
యేది యేమైనా యేసు అన్నట్లు "నమ్ముట నీవలనైతే సమస్తము సాధ్యమే" యేసు పాపపరిహార్థముగా చనిపోయాడని నమ్మటం ముఖ్యం. మనం అనుభవించవసిన పాపపు శిక్షను యేసు సిలువకు కొట్టాడని, అయనను ఆశ్రయించడం ద్వారా పాపం నుండి మనం స్వతంత్రులమౌతామని బైబిలు తెలియచేస్తుంది.
ఈ శుభ శుక్రవారపు మరియు పునరుత్థానపు (ఈస్టర్) దీవెనలు మీ అందరికి కలుగును గాక!

Labels:

Monday, March 17, 2008

కవితా వార్షిక 2007

కవితా వార్షిక ౨౦౦౭లో చోటుచేసుకున్న కవులకు శుభాభినందనలు

ఆవిష్కరణ ౩౦.౩.౨౦౦౮ ఆదివారము వరంగల్లులో
ఆవిష్కర్త శ్రీ శివారెడ్డి

అందరికి ఆహ్వానం అని తెలియ చేస్తున్నారు సృజనలోకం, వరగల్లు వారు

Labels:

Saturday, March 15, 2008

ఎప్పుడు శిరసు వంచుతాయి???

బహుశ
ఎనబయ్యో దశకంలో
విద్యకు దూరమైనవారి కోసం
దూరవిద్య ప్రారంభ మైనప్పుడు
సిటీకి దూరంగా భవనాలను నిర్మిస్తుంటే
కొండచరియల మధ్య నిలబడితే
పరిసరాలు ఎక్కలేని బండలై
నను వెక్కిరించేవి
ఇప్పుడు
చదునుచేసిన రహదారివెంట
పరుగెడుతున్న నా ఆశల రథాన్ని చూసి
అవే బండలు
తలవొంచి ప్రక్కకు తప్పుకుంటున్నాయి.

(చాలా కాలం తర్వాత దర్శించిన డా. బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలము, హైదరాబాదు)

Labels:

Friday, March 14, 2008

సం గతులు తగునా మీకిది ??

తగునా మీకిది?
తాజా వార్తలు
ఈ రోజు బి.జా.పా. బంద్‌కు పిలుపునిచ్చింది
రాజకీయాలలో ఇలాంటివి సాధరణమైనవే అయినా ప్రజల పరిస్థిని అర్థంచేసుకుంటున్నారా??

బంద్‌ను దృష్టిలో ఉంచుకొని ఇంటర్మీడియెట్ బోర్డు ఈ రోజును పరిక్షను వాయిదావేసింది.
డిగృఈ పరీక్షను వాయిదా వేసారు

ఎన్నోరోజులుగా పరీక్షలకు సిద్దపడుతున్న విద్యార్థి విద్యార్థుల్లో ఒకటే ఉత్కంఠ. దానితో తల్లితండ్రుల మనసుల్లోను అలజడి.
వత్తిడికిలోనయ్యే విద్యార్థులకు తీవ్రమైన మానసిక పరిణామాలకు గురయ్యే అవకాశంవుంది.
ఇలా విద్యార్థుల్ని, వారి తల్లిదండ్రుల్ని అలజడికి గురిచేయడం

రాజకీయ నాయకులారా
మీకిది తగునా ?????????????

Labels:

Thursday, March 13, 2008

నేను - హైదరాబాదు - సిటీ బస్సులు

సం"గతులు"
నేను - హైదరాబాదు - సిటీ బస్సులు

నేను వుంటున్నది రామచంద్రపురము. ఇక్కడ బి.హెచ్.ఇ.ఎల్. బస్సుడిపోవుంది.
కోఠికి 218, 225, 222 (వయా హైటెక్ సిటీ)
సికింద్రాబాదుకు 226, 219 నడుస్తూ వుంటాయి.

సిటీలో అత్యంత ఆదాయ మార్గాలలో ఇవి ఒకటి.
సిటి బస్సులు మూడు రకాలుగా నడుపుతున్నారు
1. సమాన్యం (జెనరల్)
2. మెట్రో ఎక్స్‌ప్రెస్
3. మెట్రో లైనర్ (ఇప్పుడు డీలక్సు అని పిస్తున్నారు)
225డి దిల్‌సుక్ నగర్ పఠాన్‌చెరుల మద్య నడుస్తుంది
దానికి ఇవ్వబడిన సమయము 1 గం. 40ని.లు
కాని ఇప్పటి ట్రాఫిక్ రోడ్లు పరిస్తితుల దృష్ట్యా 2 గ. 40ని.లుగా నడుస్తున్నాయి.
అంతే కాకుండా మెట్రోలో ఎక్కువ చార్జి వసూలుచేస్తున్నప్పటికి సౌకర్యాలు మాత్రం రోజు రోజుకు అద్వాన్నంగా మారుతున్నాయి.
సీట్లు మరియు ఇతర సౌకర్యాలు నా మాత్రమైపోయాయి.
దీనికితోడు నగర రోడ్ల పరిస్తితులు ప్రయాణాన్ని నరక ప్రాయం చేస్తున్నాయి.

నేను హైదరాబదుకు వచ్చినప్పతినుంది ఇప్పటికి అనేక కొత్త మార్గాలు(రూట్స్)లలో బస్సులు నడుస్తునేవున్నయి
నగరం అభి వృద్ది అవుతుందని ఆనంద పడాలో లేక
సౌకర్యాలు ఇవ్వలేని రవాణా సంస్థ(ప్రభుత్వము) తలచుకొని బాధ పడాలో అర్థం కావటంలేదు
ఇంకో విషయం : ప్రస్తుత రోడ్ల విస్తరణ వల్ల బస్సు షేల్టర్లు లేని బస్సు స్టాపుల వల్ల ఇబ్బంది రోజూ ప్రాయాణిస్తున్నావారికి అనుభవమే.

Labels:

సం "గతులు"

ఇందు ములముగా యావన్మందికి తెలియజేయునదేమనగా
జాన్ హైడ్ కనుమూరి పేరుతో బ్లాగుతున్న నేను
ఇకనుంచి
సం "గతులు"
బ్లాగ్నామముతో బ్లాగాబోతున్నాను
గమనించ గలరు

Labels:

Tuesday, March 11, 2008

కలయేనా ???

హఠాత్తుగా
కళ్లు తెరవగానే
కల చెదరిపోయినట్లు
చేయిజారిన అద్దం
భళ్లున పగిలినట్లు
దశాబ్దాల వాస్తవం
కలలాగ కరిగిపోయింది
తీపిగురుతులు మాత్రం
జ్ఞాపకాల పొరలమధ్య నుంచి తొంగిచూస్తున్నాయి
మైదానలాలో
రెపరెప లాడిన త్రివర్ణ పతాకం
నేడు
నిర్జీవ నైరాశ్యాల మద్య
తలదించుకు నిలబడింది
మిత్రమా!
భారత జాతిరత్నమా!
ఎక్కడున్నది లోపం!
ఏమైపోతున్నదా ప్రతిభా పాటవం!
నిట్టూర్పుల సెగలేనా !!
ప్రతివోటమి వెనుక
గెలుపు మార్గమేదో దాగివుంటుంది.
ఒక్కసారి మరొక్కసారి అవలోకిద్దాం!
అవరోదించే కలుపుమొక్కలను పీకేద్దాం!
తలెత్తుకు తిరిగేలా జాతి కీర్తి దశదిశలా చాటుదాం!
(ఓటమి పాలైన హాకీ వార్తకు స్పందిస్తూ)

Labels:

నేను - బ్లాగర్ల సమావేశం

గత రెండు బ్లాగర్ల సమావేసాలు డుమ్మా కొట్టాటం జరిగింది ఏవో వ్యక్తిగత కారణాలవల్ల. ఈ సారి ఎలగైనా వెళ్ళాలని చలా రోజులనుంచే ప్రయత్నాలు. ఆదివారం ఉదయం నేను నా ప్రక్కటెముక (బెటర్ హాఫ్) కలిసి అద్దె ఇళ్ళ వేటకు బయలుదేరాము. ఒక ఇల్లుచూస్తున్న సమయంలో నా బాస్ నుంచి ఫోను. చెల్ ఇంటిలోనే వదిలేయాల్సింది అనిపించింది. అయిష్టంగానే పలరించాను, తోదరగా ఆఫీసుకు రమ్మని సారాంశం. నా ప్రక్కటెముకను ఆటో ఎక్కించి నేను ఆఫీసుకు బయలుదేరా( నా స్కూటరు పై). ఇక బ్లాగర్ల సమావేశం మళ్ళీ డుమ్మా అనుకున్నా. కాని పని 1.30 గం. అయిపోవటం వల్ల తొందరగానే బయటపడ్డాను.
3 గ. ప్రంతంలో బయలుదేరుతుండగా త్రివిక్రం వస్తున్నారా అని పలరింపు ఫోను. రామచద్రపురంనుండి బస్సుఎక్కాను కాని అది కుకట్పల్లి వరకే. కుకటపల్లినుండి 19 నెంబరు బస్సు దొరికింది.
పార్కు ఎదురుగానే దిగటం కొంత శ్రమను తగ్గించించింది.
ఇక సమవేశం గురించి :
సాంకేతికంగా మాటలు నాకు అర్థం కానప్పటికీ ఏమి జరుగుతుందో తెలుసుకొనే నిమిత్తం హాజరవుతున్నాను.
బ్లాగులగురించిన చర్చవిన్న తర్వాత నేను బ్లాగడంలోని దృక్పదాన్ని మార్చుకోవాలనుకున్నాను.

కొత్తవారి పరిచయాలు ఎప్పుడూ తాజాగానేవుంటాయి.

నేను ఎక్కడకి వెళ్ళినా, ఏ కార్యక్రమంలో పాలుపంచుకున్నా నా దృష్టి అంతా సాహిత్యంమీదనే వుంటుంది
నా బ్లాగులనే దానినుండి విభజించాలని అనుకున్నాను.
నా ప్రయత్నం ఎంతవరకు ఫలిస్తుందో వేచిచూడాలి.
కశ్యప్
చావా కిరణ్ వసంతకుమార్ జాన్ హైడ్ కనుమూరి తుమ్మల శిరీష్ సీతారామ శాస్త్రి కే.బి.యల్ శర్మ కే.యస్.శ్రావ్య
సత్యసాయి శ్రీనివాసరాజు ధాట్ల సుధాకర్ వెంకటరమణ వీవెన్ త్రివిక్రం సి.బి.రావు పద్మనాభం దుర్వాసుల నరసింహారావు నువ్వుశెట్టి క్రిష్టకిషొర్ నందగిరి ప్రవీణ్ కట్టా vijay
dhanyavaadamulu

Labels:

Thursday, March 6, 2008

A Wreath from Your John Hyde

English Rendering Dr V.V.B.Rama Rao
The great figure that collapsed while forging ahead
Would fill eyes and dreams with grief
The rays of radiance cleaving the dawn rise sky high
Filled out bosoms with tears of searing grief
You have chosen to depart in stiff silence.
Whichever evil moment had you chosen to bed
Time took you into everlasting slumber.
As we obeyed your orders many a time
We know that we too should follow you
Even then
The footprints you left behind remind us of duty
Countless memories in every grieving heart
Have been getting ready for a new era
Ties that bound in some way or other
Would keep waiting for your telephonic greetings
As the mortal earthen body is reduced to ashes
Your dreams would ever be fresh and green
Surely, we go on lighting your dream lamps
అశ్రునివాళి
నడుస్తూ నడుస్తూ ఒరిగిపోయిన దేహం
కళ్ళలోనూ స్వప్నంలోనూ దుఖాఃన్ని నింపుతుంది
వెలుగురేఖలు నింగికెగుస్తున్న ఉదయాన్ని చీల్చుకొని
మా హృదయాలలో శోకాన్నినింపి
కొత్త పయనాన్ని నిశ్శబ్దంగానే వెతుక్కున్నారు.
ఏ రాహుకాలంలో నిదురకుపక్రమించారో
శాశ్వత నిద్రలోకి మిమ్మల్ని చేర్చింది కాలం
ఎన్నోసార్లు మీ ఆజ్ఞను పాటించినట్లే
ఏదో ఒకరోజు మేమూ మీ వెంటరావాలని తెలుసు
అయినా...
మీరు వదిలి వెళ్ళిన పాదముద్రలు
మరింత నిశ్శబ్దంగా కర్తవ్యాన్ని గుర్తు చేస్తున్నాయి
లెక్కించలేని జ్ఞాపకాలు
ప్రతిహృదయంలో
సరికొత్త రాగంకోసం సంసిద్ధంచేస్తున్నాయి సుమా!
ఏదో ఒక రూపంలో ముడివేసుకున్న బంధాలు
పలకరింపుల ఫోనులకోసం ఎదురుచూస్తూనే వుంటాయి
శోకతప్తంతో పార్థివ దేహాన్ని
తలో సమిదనువేసి గుప్పెడు బూడిదచేసినట్టు
మీ స్వప్నాల్ని చేయలేము
అందుకే
మీ స్వప్న సాకారాల జ్యోతుల్ని వెలిగిస్తూనే వుంటాము
జాన్‌హైడ్ కనుమూరి

Labels:

Saturday, March 1, 2008

మలుపుల్లో .....

పడిపోయినచోట లేవడం
ఓడిపోయిన చోటులో గెలవడం
దొరకని దారుల్ని వెతుక్కోవడం
వర్షించే కన్నుల్లో చిరునవ్వుకోసం నిరీక్షించడం

ఎన్నిసార్లు
కాలపు సూచికగా గిరగిరా తిరగాలో!

జయాపజయాల నడుమ
కళ్ళను, నాల్కను, మనసును కత్తిరించుకోవాలో!!

జీవితసారాన్ని
ప్రతిరూపంగా మలచడానికి
ఎన్ని ఉలిదెబ్బల గాయాలను మాన్పుకోవాలో!!

తెరచి వుంచిన హృదయాన్ని ఎవ్వరో మిటినట్లు
అడుగుల సవ్వడి చేస్తూ
నవ్విన చిరుగాలి
కిలకిల రావాల పక్షుల కోలాహలం చేస్తున్న
నవ్య రాగోదయం
వేలుగురేఖల గమనాన్ని ఒడుపుగా పట్టుకోవడమే.

Labels:

Wednesday, February 27, 2008

నవ్య రాగోదయం

తెరచి వుంచిన హృదయాన్ని

ఎవ్వరో మిటినట్లు

అడుగుల సవ్వడి చేస్తూ

నవ్విన చిరుగాలి

కిలకిల రావాల పక్షుల కోలాహలం చేస్తున్న

నవ్య రాగోదయం

Tuesday, February 26, 2008

శోధన గారికి ధన్యవాదములు

తెలుగులో వ్రాయాలని చిన్న ప్రయత్నం.

శోధన గారికి ధన్యవాదములు

జాన్ హైడ్ కనుమూరి

Monday, February 25, 2008

మనసంతా ఎదోలా అయిపోయింది

వరుసగా రెండు ఎలిజీలు రాయాల్సిన అవసరం కలిగేసరికి మనసంతా ఎదోలా అయిపోయింది
జీవితం ఎంత చిన్నది?
జీవం ఎంతలో ఎగిరిపోతుంది?
జీవనంలో ఏమి మిగిల్చిపోతున్నాము? అనే ప్రశ్నలు
ఉన్నంతలో ఏదో ఒకటి చేయాలన్న ఆశ
కొత్త ఆలోచనల్ని చిగురింపచేస్తుంది.

Labels:

Saturday, February 23, 2008

సంసిద్దతచేసే పాత్ర

ఎక్కడినుంచి ఎగిరొచ్చిందో
రాత్రికురిసిన వాననీటిలో లేని చేపకోసం
ఎదురుచూస్తున్న కొంగలాంటి మనసు

మట్టితో చేయబడ్డదేహం
మళ్ళీ మట్టిలో కలవడం సృష్టి ధర్మం

సిలువనెత్తుకొని
ఒలికే కన్నీటితో
పరుగులాంటి నడక
అంధకార శక్తులతో నిత్యం పోరాటమే
ఎందరివో పగిలన హృదయాలను కడ్తుంది

నిరీక్షించే దారుల్లో
నిత్యం వేధించే భయాలను ఛేదిస్తూ జాగురూకచెయ్యడం
వెలిగించిన జీవితాన్ని దీపస్థంబంగా పెట్టడమే

మట్టి శరీరం శిథిలమవ్వడం తప్పనిసరి
వెలుగిచ్చే త్రోవలలో
వెలుగురేఖల పయనానికి సంసిద్దతచేసే పాత్ర
సిద్దమైన జీవకిరీటంకోసం సాగిపోతుంది

నీతిసూర్యుని కిరణాలలో వెలిగే
మహిమ శరీరంకోసం
పయనం సాగిపోతూనేవుంటుంది

Labels:

Tuesday, February 19, 2008

అశ్రునివాళి

శ్రీ దయాకిరణ్ (५.४.१९५७ - १४.२.२००८ ) డైరెక్టర్ , ఫెనోప్లాస్ట్ లిమిటెడ్, సికింద్రబాద్

నడుస్తూ నడుస్తూ
ఒరిగిపోయిన దేహం
కళ్ళలోనూ స్వప్నంలోనూ దుఖాఃన్ని నింపుతుంది
వెలుగురేఖలు నింగికెగుస్తున్న ఉదయాన్ని చీల్చుకొని
మా హృదయాలలో శోకాన్నినింపి
కొత్త పయనాన్ని నిశ్శబ్దంగానే వెతుక్కున్నారు.
ఏ రాహుకాలంలో నిదురకుపక్రమించారో
శాశ్వత నిద్రలోకి మిమ్మల్ని చేర్చింది కాలం
ఎన్నోసార్లు
మీ ఆజ్ఞను పాటించినట్లే
ఏదో ఒకరోజు మేమూ మీ వెంటరావాలని తెలుసు
అయినా...
మీరు వదిలి వెళ్ళిన పాదముద్రలు
మరింత నిశ్శబ్దంగా
కర్తవ్యాన్ని గుర్తు చేస్తున్నాయి
లెక్కించలేని జ్ఞాపకాలు
ప్రతిహృదయంలో
సరికొత్త రాగంకోసం సంసిద్ధంచేస్తున్నాయి సుమా!
ఏదో ఒక రూపంలో
ముడివేసుకున్న బంధాలు
పలకరింపుల ఫోనులకోసం ఎదురుచూస్తూనే వుంటాయి
శోకతప్తంతో పార్థివ దేహాన్ని
తలో సమిదనువేసి గుప్పెడు బూడిదచేసినట్టు
మీ స్వప్నాల్ని చేయలేము
అందుకే
మీ స్వప్న సాకారాల జ్యోతుల్ని వెలిగిస్తూనే వుంటాము

Labels:

Saturday, February 16, 2008

"షోలే" తో ముడివడ్డ జ్ఞాపకాలు

"షోలే" తో ముడివడ్డ జ్ఞాపకాలు
రాత్రి జీ లో షోలే సినిమా వచ్చింది. చాలాకాలం తర్వాత ఇష్టమైన సినిమా కనిపించేసరికి చూడలనిపించింది. అందులోనూ ఇంటిలో ఎవ్వరూ లేకపోవటంవల్ల కూడా చూడాలనిపించింది. కొన్ని జ్ఞాపకాలు వెన్నంటాయి. కొన్ని ఇక్కడ మీతో.
ఈ సినిమా విడుదలయ్యే సమయానికి నేను ఏలూరులో ఇంటర్మీడియట్ చదువుతున్నాను. ఇంటిలో సినిమాకు వెళ్ళడానికి అనుమతి లేకపోవడంవల్ల నేను చూసిన సినిమాలన్నీ దొంగచాటుగానే. ఈ సినిమా ఎన్ని సార్లు చూసానో గుర్తులేదు. అప్పటికే మిమిక్రీ అభ్యాసం చేస్తున్న నేపద్యం, ఇంటరులో రెండవభాషగా హిందీ చదవటంవల్ల కొన్ని సీనులు, కొన్ని డైలాగులు కంఠతా పట్టాను. మిమిక్రీ చెయ్యడానికి అనువైన, భిన్నమైన స్వరాలు(మాడ్యులేషన్స్) ఇందులో వుండటం విశేషం.
సినిమా మొదట విదుదలయ్యే సమయానికి ఏలూరులొ హిందీ సినిమాలు వచ్చేవి కాదు. విజయవాడలో నవరంగ్‌లో వచ్చింది. హౌస్ ఫుల్ కలక్షన్లతో ఆడుతోదని తెలిసింది. ఏమిచెయ్యాలో అర్థం కలేదు. కోటి అనే స్నేహితుడు ఏలూరు పవర్‌పేట స్టేషను వద్ద వుండే వాడు. వాడితో ఈ సినిమా గురించి మాట్లడుతున్నప్పుడు వాడు ఒక ఆలోచనచెప్పాడు. అదేమంటే 11 - 11.30 గంటల మద్య ఈస్టుకోస్టు రైలు వుంది. అది పవరుపేటలో ఆగుతుంది, కాలేజీకి దగ్గర. అది ఎక్కితే విజయవాడ ఒక గంట ప్రయాణం. మళ్ళీ విజయవాడలో 7గంటలకు జనతా ఎక్స్ప్రెస్ వుంది. అది ఎక్కితే 8.30 గంటలకల్లా ఏలూరులో స్టెషన్లలో దిగొచ్చు. అది ఇంటికి దగ్గర. ఇకపోతే టిక్కట్టు తీయకుండా, ష్టేషన్లలో ఎవ్వరూ పట్టుకోకుండా బయటికి వచ్చే మార్గాల్ని కోటి చూపిస్తానన్నాడు. ఇక సినిమాకోసం డబ్బులు వుంటే ఎప్పుడైనా వెళ్ళవచ్చు. కాని తిరకాసు ఏమిటంటే కోటికి సినిమా ఖర్చులు నేను పెట్టుకోవాలి. ఈ ఆలోచన మరో సినిమా పిచ్చి దోస్తులకు చెప్తే భయపడ్డారు. సరే ఒకరోజు ప్లాన్ చేసి విజయవాడ వెళ్ళి సినిమా చూడటానికి ప్లాన్ చేసాము. ఉదయమే కాలేజీకి బయలుదేరినట్టే ఇంటివద్ద బయలుదేరి ఎవ్వరికీ అనుమానం రాకుండా పవరుపేటా స్తేషను చేరుకుని, నేను కోటి కలుసుకున్నాము. గుండెల్లో ఎదోభయం. రైలుప్రయాణం కొత్తకాదు కాని టికెట్టులేకుండానే ప్రయాణించడం మొడటిసారి.
ప్రయాణమంటా ఒక సాహసం ఎడ్వంచరు। రైల్వే పోలీసుల, టిటి, స్టేషను మాష్టరు ఇలా భయం వెన్నంటే వుంది. ఎదురుచూస్తున్న ఈస్టుకోస్టు రానేవచ్చింది. జనరల్ బోగీలో ఎక్కాము. కొచెంరద్దీగానే వూంది. విజయవాడలోపు మద్యలో ఏశ్తేషనులోనూ ఆగదు కాబట్టి కొంచేం భయం తగ్గింది. ఇంచుమించు ఒక గంటలో విజయవాడ చేరుకున్నాము నేను, కోటి. ముందుగా అనుకున్న ప్రకారం దిగగానే ఎవరివైపు, ఎటువైపు దిక్కులుచూడకుండా ప్లాట్ఫారం చివరికి చాలా వేగంగా నడచి వెళ్ళాము. అక్కడ పార్సిలు ఆపీసు వుంది. దాన్ని దాటి ముందుకువెళ్ళి పట్టాలను దాటితే అక్కడ కొంచే సన్నని ఖాళీ వుంది. అందులోచి దూరితే కొచేం చేత్త చెదారం దాటి, అటు ఇటు నడిస్తే రోద్దు వచ్చింది. అప్పటి వరకు ఎవరైనా వస్తున్నరేమో, ఎవరైనా చూస్తున్నారేమో అని ఒకటే దడ, దడా. అక్కడనుంచి పరులాటి నడకతో నవరంగ్ చేరుకున్నాము. బహుశ ఒంటిగట అయ్యివుండవచ్చు(సరిగా గుర్తులేదు) అప్పటికే టికెట్లకోసం క్యూ వుంది. రెండు రూపాయల లైనులో నిలబడి తోపులాటలమద్య టికెట్టు సంపాదించాము. సినిమా చూస్తున్నంసేపూ చిత్రమైన అనుభూతి. మాదగ్గర డబ్బులు ఖర్చు అయిపోతాయేమో ఏదైనా ఇబ్బంది పడతామేమో అని ఇంటరువెల్లులో ఏమీ తినలేదు, కొనుక్కోలేదు. సినిమా అయిన తర్వాత జనతా ఎక్స్‌ప్రెస్ వెళ్ళిపోతుందేమోనని ఒకటే కంగారుతో పరుగులాంటి నడకతో విజయవాడ స్టేషను చేరాము. కొద్దిసేపటికి రైలు వచ్చింది ఏలూరు చేరాము. ఏలూరు బాగా ఎరిగిన స్టేహ్స్నే కాబట్టి మెల్లగా బయటపడి ఇళ్ళకుచేరాము. నాయింటి వద్ద ఎవరైనా ఏమంటారొనన్ని కొద్దిగా భయవుంది, కాని అప్పటికి మా నాన్నగారు ఇంటికి రాకపోయే సరికి కొంతవూపిరితీసుకున్నాను.

Labels:

Tuesday, February 12, 2008

"షోలే" తో ముడివడ్డ జ్ఞాపకాలు

changed

Labels:

Saturday, February 9, 2008

జ్ఞాపకాలు దేవాలయాలు

ఈ మద్య నా మిత్రుడొకడు వూరు వెళ్ళివస్తూ వస్తూ చీరాలలో ట్రాఫిక్ ఆగినప్పుడు ఓ గుడి గోపురాన్ని ఫోటో తీసుకొచ్చాడు. మీరుచూస్తున్నది అదే. ఆది ఏ దేవాలయమో నాకుగాని, అతనికి గాని తెలియదు. ఈ చిత్రాన్ని చూస్తున్నప్పుడల్లా నా అనుభవాలు రాయాలనిపిస్తుంది. చివరికి ఇప్పటికి తీరికదొరికింది.
నేను 1వ తరగతి నుండి 5 తరగతివరకు పట్టిసీమ - కొవ్వూరు (పశ్చిమ గోదావరి జిల్లా)మద్య జరిగింది. గోదావరీ తీరం వైషణవానికి ప్రసిద్దిచెందిన చరిత్ర వున్నప్పటికి వివిధ ఇతర దేవాలయాలు వుండాటాం విశేషమే అనిపిస్తుంది.పోలవరంలో నడీస్వరునికొండ, పాండు రంగడికొండ, రామలయము, పట్టిసీమలో గోదవరి నదిమద్యలోవున్న శివాలయం బహు ప్రసిద్ది చెందినదే. గూటాల ఆంజనేయుడి గుడి కొవ్వూరు వేణుగొపాల గుడి, గోవుపాదాలరేవు ఇలా కొన్ని.ద్వారకా తిరుమల(చిన్న తిరుపతి), హనుమాణ్ జంక్షన్(పెద్ద విగ్రహం) ఆంజనేయుడి గుడి, అమరావతిలో ద్యానంజనేయ విగ్రహం, పొన్నురులో నల్లరాతి అంజనేయుడి విగ్రహం, కోటిలింగాలు, అమరావతిలో శివాలయం, మంగలగిరిలో పానకాలస్వామి, బాసరలోని సరస్వతి ఏఅలయం, కృష్ణా, గుంటూరు జిల్లాలోని కొన్ని దేవాలయాల పేర్లు నాకు గుర్తుకు రావటంలేదు అద్భుత శిల్ప సంపద అన్నవరం సత్యనారాయణ స్వామి, సింహాచలం, ఇలా నేను సందర్శించిన దేవాలయాలు జ్ఞాపకానికి వచ్చాయి.
ఇవేకాకమద్యప్రదేశ్‌లోని మయ్యర్ కొండ చాలా ఎత్తుగాను, ఏటవాలుగాను వుండే క్షేత్రం ఆ ప్రాంతంలో సుప్రసిద్దమైనదే. బదరీనాద్ వెళ్ళినప్పుడు హోరున వర్షం మరచిపోలేనిది.ఆగ్రా ఢిల్లీల మద్యవున్న మథురై కృష్ణుడి దేవాలయానికి వెళ్ళినప్పుడు పోగొట్టుకున్న స్వెట్టరు అప్పుడప్పుడు నా ఆల్బంలోని ఫొటొలలో కనిపించి గుర్తుచేస్తుంది. డిల్లీలోని బిర్లా దేవాలయంలో అద్దాలమద్య వున్న కృష్ణుడు, లక్స్మీనారయణ దేవాలయంలో కనిపించే పాలరాతి కట్టడాలు అప్పుడప్పుడూ అనంతమైన సంస్కృతిని గుర్తుచేస్తునేవున్నాయి.

Labels:

నా పాట నా బొమ్మ


ఓ చెలీ!
దాచాను భావాలే
రాసాను కావ్యాలే

తొలిచూపు నవ్వులనే
వాడిపోని రేకులుగా
మనసు పొరలకితాబులో
మడచివుంచాను బద్రంగా

నిదుర రాని కళ్ళలో
నిలుపుకొన్న బొమ్మగా
చెదరిపోని రంగులతో
అల్లుకున్న రుమాలుగా
దాచివుంచాను బద్రంగా

పారాకులో చిరాకులో
ఆదమరచి నేనుండగా
చిరుగాలివై అలరించిన
జారిన కురులలో కుసుమంగా
తలచి వుంచాను బద్రంగా

Labels:

Thursday, February 7, 2008

సరికొత్త విత్తనాలు

అవమానాల వెంట
అపజయాల వెంట
అనుభవాలు గింజలై రాల్తాయి
కూర్చుకోవాలి
నేర్చుకోవాలి
సరికొత్త విజయపథాలకు
విత్తనాలుగా నాటుకోవాలి
ఎటోపోతున్న మేఘాన్ని పిలిచి
ఇక్కడ వర్షించమని
చెప్తావా నేస్తం

Labels:

Tuesday, February 5, 2008

నేను నా బ్లాగ్ రచన

నేను నా బ్లాగ్ రచన
1997లో మద్యపాన వ్యసనాన్ని మానేయాలని ప్రయత్నాలు ప్రారంబించాను. అప్పుడే కంప్యూటరు నేర్చుకోవలసిన అవసరం వచ్చింది. రెండు, మూడు చోట్ల చేరాను. కాని నా ఫీజు వాపసు ఇచ్చిమరీ నన్ను బయటకు తోసేసారు. ఎందుకంటే నేను క్లాలో వయసులో పెద్దవాణ్ణి కావటం. నాకు కలిగే సందేహాలవల్ల క్లాసుకు ఇబ్బంది కలుగుతుందని. ఇక నేర్చుకోవాలనే ప్రయత్నం ఇంటరునెట్టుమీద పడ్డాను. తాజ్మహల్ ఫోటోలు ఆల్బం గా పెట్టాడం మొదలు పెట్టాను. అలా అలా పేజిలి పేజిలుగా జియోసిటిలో పెట్టడం జరిగింది. తెలుగు పెట్టాలని తెలుగులో రాయాలని చాలా ప్రయ్నం చేసాను కాని 2003 నాటికి ఆ ప్రయత్నాలు సఫలం కాకపోయేసరికి కొంత నిరుత్సాహం కలిగింది. డిటిపి చేయించి వాటిని ఇమేజ్‌లుగా పెట్టడం జరిగింది, కాని ఖర్చుతో కూడుకున్న పని అవటంవల్ల కుంటు పడింది.
మళ్ళీ ఇప్పుడు ఇలా బ్లాగులు ఎదురయ్యాయి.
వయసు మీదపడుతుంది నాకు ఎందుకు అనుకున్నప్పుడు పద్మనాభంగారిని చూసి కొత్త ఉత్సాహాన్ని తెచ్చుకున్నాను.
బ్లాగుల్లో సాహిత్యం దొరుకుతుందా అని సందేహపడుతున్నప్పుడు రాధికగారి బ్లాగు(స్నేహమా) నన్ను కంప్యూటరుకు కట్టి పడేసింది.
నా బ్లాగులో అనామక వాఖ్యానాలను చూసి మానేద్దం అనుకున్నప్పుడు విస్త్రుతంగా బ్లాగులు రాస్తున్న జ్యోతిగారి బ్లాగుచూసి ఆశ్చర్యానికి లోనయ్యి, మనసును మళ్ళీ బ్లాగులవైపు మళ్ళించాను.
సమయం దొరకడంలేదు ఎలా అనుకుంటున్నప్పుడు
ఈనాడు వ్యాసం సరికొత్త అవసరాన్ని గుర్తు చేసింది.

Labels: